ప్రజల ఆకాంక్షను నెరవేర్చిన కేసీఆర్
రాష్ర్టాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తున్న సీఎం
ఖమ్మం కార్పొరేషన్లో 60కి 60 గెలుస్తాం
రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్
ఘనంగా టీఆర్ఎస్ ఆవిర్భావ దినోత్సవం
ఖమ్మం, ఏప్రిల్ 27: నాలుగు కోట్ల గొంతుకలను ఏకం చేసి, చీకట్లను తొలగించి చిరుదీపాలు వెలిగించిన జెండా.. కేసీఆర్ ఎగరేసిన గులాబీ జెండా అని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం నాలుగు కోట్ల ప్రజల ఆకాంక్షలను నెరవేర్చిన ఉద్యమ పార్టీ టీఆర్ఎస్ అని స్పష్టం చేశారు. టీఆర్ఎస్ ఆవిర్భావ వేడుకలను మంగళవారం ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా ఆ పార్టీ శ్రేణులు ఘనంగా నిర్వహించాయి. ఖమ్మం జిల్లా పార్టీ కార్యాలయంలో జరిగిన వేడుకల్లో మంత్రి అజయ్ పాల్గొని టీఆర్ఎస్ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ 60 ఏండ్ల తెలంగాణ రాష్ట్ర ప్రజల ఆకాంక్షలను భుజాన ఎత్తుకున్న నాటి ఉద్యమ నేత, నేటి పరిపాలనా దక్షుడు కేసీఆర్ అని గుర్తుచేశారు. 60 ఏళ్లలో వలస పాలకులు మిగిల్చిన కన్నీళ్లను తుడిచి తెలంగాణ ప్రజల మోముల్లో ఆనందాన్ని నింపిన ముఖ్యమంత్రి కేసీఆర్ ధన్యుడని అన్నారు.
ముందుగా తెలంగాణ సిద్ధాంతకర్త ప్రొఫెసర్ జయశంకర్ సార్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా నాయకులు, కార్యకర్తలు కూడా టీఆర్ఎస్ జెండాలను ఎగురవేశారు. ప్రొఫెసర్ జయశంకర్ సార్ చిత్రపటాలకు నివాళులర్పించారు. ఖమ్మం ఎంపీ నామా నాగేశ్వరరావు, ఎమ్మెల్యేలు సండ్ర వెంకటవీరయ్య, రేగా కాంతారావు, రాములునాయక్, మాగంటి గోపీనాథ్, నల్లమోతు భాస్కర్రావు, ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ, జడ్పీ చైర్మన్ లింగాల కమల్రాజు, డీసీసీబీ చైర్మన్ కురాకుల నాగభూషణం, సుడా చైర్మన్ బచ్చు విజయ్కుమార్, మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి, టీఆర్ఎస్ జిల్లా కార్యాలయ ఇన్చార్జి ఆర్జేసీ కృష్ణ, మాజీ ఎమ్మెల్యే మదన్లాల్, నాయకులు మద్దినేని బేబీ స్వర్ణకుమారి, చింతనిప్పు కృష్ణ చైతన్య తదితరులు పాల్గొన్నారు.