అహ్మదాబాద్: ఐపీఎల్ 14వ సీజన్లో భాగంగా ఢిల్లీ క్యాపిటల్స్తో జరుగుతున్న మ్యాచ్లో
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు(ఆర్సీబీ) గౌరవప్రదమైన స్కోరు చేసింది. ఏబీ డివిలియర్స్(75 నాటౌట్: 42 బంతుల్లో 3ఫోర్లు, 5సిక్సర్లు) మెరుపు అర్ధశతకంతో రాణించడంతో బెంగళూరు 20 ఓవర్లలో 5 వికెట్లకు 171 పరుగులు చేసింది. ఈ మ్యాచ్లో విరాట్ కోహ్లీ(12), దేవదత్ పడిక్కల్(17) క్లీన్బౌల్డ్ అయ్యారు. మాక్స్వెల్(25: 20 బంతుల్లో 1ఫోర్, 2సిక్సర్లు), రజత్ పటిదార్(31: 22 బంతుల్లో 2సిక్సర్లు) రాణించారు. ఢిల్లీ బౌలర్లలో ఇషాంత్ శర్మ, రబాడ, ఆవేశ్ ఖాన్, అమిత్ మిశ్రా, అక్షర్పటేల్ తలో వికెట్ తీశారు.
టాస్ ఓడి బ్యాటింగ్కు దిగిన బెంగళూరును ఆరంభం నుంచి ఢిల్లీ బౌలర్లు కట్టడి చేశారు.
ఆవేశ్ ఖాన్ వేసిన ఇన్నింగ్స్ నాలుగో ఓవర్ ఆఖరి బంతికి విరాట్ కోహ్లీ(12) బౌల్డ్ కాగా, ఇషాంత్ శర్మ వేసిన తర్వాతి ఓవర్ మొదటి బంతికే దేవదత్ పడిక్కల్(17) కూడా బౌల్డ్ అయ్యాడు. సీజన్లో తొలి మ్యాచ్ ఆడుతున్న ఇషాంత్ బుల్లెట్ లాంటి బంతులతో బ్యాట్స్మెన్ను ఇబ్బంది పెట్టాడు. దీంతో పవర్ప్లే ఆఖరికి 36/2తో కష్టాల్లో పడింది.
ఈ దశలో మాక్స్వెల్, పటిదార్ ఇన్నింగ్స్ను చక్కదిద్దే ప్రయత్నం చేసినా ఎక్కువ సేపు నిలువలేదు. వీరిద్దరు ఔటైనా డివిలియర్స్ బౌలర్లపై ఎదురుదాడికి దిగుతూ స్కోరుబోర్డును ముందుకు నడిపించాడు. ఈ క్రమంలోనే 35 బంతుల్లోనే అర్ధశతకం పూర్తి చేసుకున్నాడు. స్టాయినీస్ వేసిన 20వ ఓవర్లో మూడు సిక్సర్లు బాదిన ఏబీడీ 23 రన్స్ రాబట్టడంతో జట్టు స్కోరు 170 దాటింది.