సిరిసిల్ల, ఏప్రిల్ 21: కరోనా పాజిటివ్తో హోంఐసోలేషన్లో ఉన్నప్పటికీ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు రైతులపై తనకున్న ప్రేమను చాటుకుంటూనే ఉన్నారు. రాష్ట్రంలో సాగునీటి ప్రాజెక్టులు, వాటికింద ఆయకట్టుకు నీళ్లందుతున్న తీరును తెలుసుకుంటూనే ఉన్నారు. నడివేసవిలోనూ మత్తడి దుంకుతున్న ఆనందాన్ని ఇరిగేషన్ ఈఈ ఎర్రంరెడ్డి అమరేందర్రెడ్డితో పంచుకొన్నారు. ఎగువమానేరు ఆయకట్టు రైతులకు ఇకపై సాగునీటి కష్టం రానియ్యొద్దని ఆదేశించారు. మెట్టప్రాంతమంతా సస్యశ్యామలం కావాలని ఆకాంక్షించారు. నిజాం కాలంలో నిర్మించిన కాలువలకు మరమ్మతులు చేపట్టాలని సూచించారు. వానకాలం నాటికి చెక్డ్యాంల నిర్మాణం పూర్తిచేయాలని.. జలాశయం కింద చెరువులను నింపాలని ఆదేశించారు. బుధవారం మధ్యాహ్నం 12 గంటలకు సీఎం కేసీఆర్.. ఇరిగేషన్ ఈఈ అమరేందర్రెడ్డికి ఫోన్చేసి మాట్లాడారు. వారి మధ్య సంభాషణ ఇలా సాగింది..
సీఎం: అమరేందర్ బాగున్నావా?
ఈఈ: బాగున్నాను సార్.
సీఎం: మానేరు దుంకుతున్నదా?
ఈఈ: అవును సార్, గత రెండు రోజులుగా దుంకుతున్నది సార్.
సీఎం: ఆయకట్టు రైతులందరికీ యాసంగి పంటలకు సమృద్ధిగా నీటిని అందించారా? రైతులకు ఇబ్బందులు కలుగకుండా చూడండి
ఈఈ: మానేరు పరిధిలో చివరి ఆయకట్టువరకు సరిపడా నీరందింది సార్.
సీఎం: మానేరు వాగు వెంట నిర్మిస్తున్న 11 చెక్డ్యాంలను జూన్లోగా పూర్తిచేయండి
ఈఈ: సార్.. ఎగువమానేరు నుంచి రాజరాజేశ్వర జలాశయం వరకు మానేరు వాగు వెంబడి 11 చెక్డ్యాంల పనులు వేగంగా జరుగుతున్నాయి సార్. మీరు ఆదేశించిన ప్రకారం జూన్లోగా చెక్డ్యాంల నిర్మాణం పూర్తిచేస్తాం సార్.
సీఎం: మానేరు పరిధిలోని చెరువులన్నీ నింపండి
ఈఈ: మానేరు పరిధిలోని 22 చెరువులను నింపుతాం సార్. ప్రస్తుతం ఎగువమానేర్ జలాశయంలో 2,200ఎంసీఎఫ్టీ నీరు ఉన్నది. అందులోనుంచి 250 ఎంసీఎఫ్టీ నీటితో 22 చెరువులను నింపుతాం సార్. ప్రస్తుతం రైతులు వరి కోతల పనిలో ఉన్నారు. యాసంగి కోతలు పూర్తికాగానే చెరువులకు నీటిని వదులుతాం. గంభీరావుపేట మండలంలోని గొల్లకేతమ్మ, పెనంమడుగు ఆయకట్టును కూడా నింపుతాం సార్.
సీఎం: వానకాలం పంటలకు నీరు సరిపోతుందా?
ఈఈ: ఎగువమానేరు జలాశయంలో ప్రస్తుతం ఉన్ననీరు వానకాలం కూడా పంటలకు సరిపోతుంది సార్. ఎగువమానేరు ఆయకట్టు పరిధిలోని 13 వేల ఎకరాలు, 22 చెరువుల ద్వారా 5 వేల ఎకరాలు, వాగు వెంబడి రెండువేల ఎకరాలతో దాదాపుగా 20 వేల ఎకరాలకు సాగునీరందుతుంది సార్
సీఎం: ముస్తాబాద్ మండలంలోని తెర్లుమద్ది, పోత్గల్కు యాసంగి పంటలకు పూర్తిస్థాయిలో నీరిచ్చారా?
ఈఈ: పూర్తిస్థాయిలో అందింది సార్.
సీఎం: నిజాంకాలంలో నిర్మించిన కాల్వలు మరమ్మతులు ఏమైనా ఉంటే చేయండి, నిధులు మంజూరు చేస్తా
ఈఈ: నిజాంకాలంలో నిర్మించిన 30 కిలోమీటర్ల ఎగువమానేరు కుడికాల్వలో బండరాళ్ల నుంచి నీళ్లు లీకేజీ అవుతున్నాయి సార్. వాటి మరమ్మతులకు ప్రతిపాదనలు పంపిస్తాం సార్.
సీఎం: ఆల్ ది బెస్ట్, రైతులకు ఇబ్బందులు కలుగకుండా చూసుకోండి
ఈఈ: అలాగే సార్.. థాంక్యూ సార్.