వరంగల్ : బీజేపీ రాష్ర్ట అధ్యక్షుడు బండి సంజయ్ మాటలు నమ్మేందుకు వరంగల్ ప్రజలు సిద్ధంగా లేరని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు స్పష్టం చేశారు. వరంగల్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మంత్రి దయాకర్ రావు మాట్లాడారు.
వరంగల్ పట్టణం ఊహించని రీతిలో అభివృద్ధిలో ముందుంది అని తెలిపారు. టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చాక సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ నిర్ణయాల వల్ల అనూహ్య అభివృద్ధి జరిగిందన్నారు. తప్పుడు మాటలు మాట్లాడే వారికి వరంగల్ ప్రజలు మంచి తీర్పు ఇస్తారనే నమ్మకం తమకు ఉందన్నారు. ఇప్పటి వరకు జరిగిన ప్రతి ఎన్నికలలో మమల్నీ ప్రజలు ఆశీర్వదించారు అని పేర్కొన్నారు. ప్రతి ఎన్నికలో బీజేపీని ఓడిస్తున్నా.. బండి సంజయ్కు బుద్ధి రావడం లేదని ధ్వజమెత్తారు. సంజయ్ అవగాహన లేని మాటలు మాట్లాడుతున్నాడని నిప్పులు చెరిగారు. వరంగల్లో వరదలు వచ్చినప్పుడు కేంద్రం ప్రభుత్వం ఏమైనా ఇచ్చిందా? ఎందుకు ఇవ్వలే? ఇతర రాష్ట్రాలకు ఎందుకు ఇచ్చారు? అని ప్రశ్నించారు.
బండి పోతే బండి.. గుండు పోతే గుండు.. ఇలా అనేక హమీలు ఇచ్చాడు.. చివరకు ఏమైందని దయాకర్ రావు ప్రశ్నించారు. బీజేపీ స్టేట్మెంట్లకే పరిమితం … ఇచ్చిన ఒక్క హామీ ని ఇంప్లిమెంట్ చేయ్యలే… అని మండిపడ్డారు. మెడికల్ కాలేజీలు ఇవ్వాలని విజ్ఞప్తి చేసాం.. ఒక్కటి ఇవ్వలే. నిజామాబాద్ పసుపు బోర్డు ఏమైంది? మీరే కాజీపేట కోచ్ ఫ్యాక్టరీ తేస్తున్నాం.. ఇస్తున్నాం అని ప్రకటనలు చేశారు. గిరిజన యూనివర్సిటీ, బయ్యారం ఉక్కు ఇస్తామని హమీ ఇచ్చారు. కానీ ఒక్కటి కూడా నెరవేరలేదని మంత్రి ఎర్రబెల్లి తెలిపారు.