హైదరాబాద్, ఏప్రిల్15 (నమస్తే తెలంగాణ): కొవిడ్ బాధితుల కోసం ప్రభుత్వ దవాఖానలు, ప్రైవేట్ మెడికల్ కాలేజీల్లో పడకల సంఖ్యను పెంచాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్కుమార్ ఆదేశించారు. కరోనా రెండోదశ నేపథ్యంలో ప్రస్తుత పరిస్థితులపై గురువారం బీఆర్కేభవన్లో అధికారులతో ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. కొవిడ్ కేర్ సెంటర్లను రెట్టింపు చేయాలని జిల్లా కలెక్టర్లను ఆదేశించారు. ప్రైవేట్ దవాఖానలు ఆక్సిజన్ను సక్రమంగా వినియోగించి, వృథాను అరికట్టేలా చైతన్యపరచాలని సూచించారు. కరోనా కేసులు పెరిగితే ఉత్పన్నమయ్యే పరిస్థితులను ఎదురోవడానికి సిద్ధంగా ఉండాలని, జిల్లాల్లో కొవిడ్ పరీక్షల సంఖ్యను పెంచాలని చెప్పారు. వ్యాక్సినేషన్ ప్రక్రియను వేగవంతం చేయాలన్నారు.
వైరస్ బారి నుంచి రక్షణకు ప్రభుత్వం జారీచేసిన ఉత్తర్వులను ప్రజలు పాటించేలా కృషిచేయాలని తెలిపారు. సమావేశంలో ఐటీశాఖ ముఖ్య కార్యదర్శి జయేశ్రంజన్, ఆరోగ్య, కుటుంబసంక్షేమశాఖ కార్యదర్శి రిజ్వీ, డ్రగ్ కంట్రోల్ అడ్మినిష్ట్రేషన్ డైరెక్టర్ ప్రీతి మీనా, మెడికల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ డాక్టర్ రమేశ్రెడ్డి, పబ్లిక్ హెల్త్ డైరెక్టర్ శ్రీనివాసరావు, వైద్యారోగ్యశాఖ సలహాదారు డాక్టర్ గంగాధర్, టీఎస్హెచ్ఎంఐడీసీ ఎండీ చంద్రశేఖర్రెడ్డి పాల్గొన్నారు. కాగా, ఈ నెల 6న కరోనా పాజిటివ్గా నిర్ధారణ కావడంతో 9 రోజులపాటు హోంఐసొలేషన్లో ఉన్న సీఎస్ బుధవారం పరీక్షల్లో నెగెటివ్గా తేలడంతో గురువారం విధుల్లో చేరారు.