నల్లగొండ : తెలంగాణ రాష్ట్ర సాధనకు జానారెడ్డి ముఖ్యమంత్రి పదవిని త్యాగం చేశారన్న కాంగ్రెస్ పార్టీ ప్రచారంలో ఏమాత్రం వాస్తవం లేదని శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి అన్నారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కాంగ్రెస్ అధిష్ఠానం జానారెడ్డిని ఎప్పుడూ సీఎం పదవీకి గానీ లేదా పీసీసీ పదవీకి గానీ పరిగణించలేదన్నారు.
నూతనంగా ఏర్పడ్డ తెలంగాణ రాష్ట్రాభివృద్ధికి సహకరించాల్సిందిపోయి అధికారంలోకి రావడమే లక్ష్యంగా కాంగ్రెస్ నేతలు పనిచేస్తున్నారని మండిపడ్డారు. అంతేకాకుండా సామాన్య ప్రజల శ్రేయస్సును బలిపెడుతూ అభివృద్ధి, సంక్షేమానికి అడ్డుపడుతున్నారన్నారు. కేవలం టీఆర్ఎస్ అధినేత కె. చంద్రశేఖర్ రావు ఉద్యమంతోనే తెలంగాణ సిద్ధించిందన్నారు. సాధించుకున్న తెలంగాణను సీఎం కేసీఆర్ అభివృద్ధిలో పెడుతున్నారన్నారు.
రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ పథకాలతో సమాజంలోని అన్ని వర్గాల ప్రజలు సంతోషంగా ఉన్నారన్నారన్నారు. హాలియా సభ సందర్భంగా నాగార్జునసాగర్ నియోజకవర్గానికి బీసీ రెసిడెన్షియల్ స్కూల్, కాలేజీని మంజూరు చేసిన సీఎం కేసీఆర్కు గుత్తా ధన్యవాదాలు తెలిపారు. అదేవిధంగా దశాబ్దాలుగా ఎన్ఎస్పీ క్వార్టర్ట్స్లో నివాసం ఉంటున్నవారికే అవి కేటాయించేలా సీఎం పేర్కొనడంపై కృతజ్ఞతలు చెప్పారు.