నల్లమలలో రెండు లిఫ్ట్లు, మూడు రిజర్వాయర్లు ఏర్పాటు
సానుకూలంగా స్పందించిన సీఎం కేసీఆర్
పీఆర్ఎల్ఐ, ఎంజీకేఎల్ఐ అనుసంధానం
75 వేల ఎకరాలకు అందనున్న సాగునీరు
అచ్చంపేట రూరల్, ఏప్రిల్ 13 : టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత బీడు భూములన్నీ పచ్చబడుతున్నాయి. ప్రజల సంక్షేమం, అభివృద్ధే ధ్యేయంగా సీఎం కేసీఆర్ అడుగులేస్తున్నారు. ప్రతి సెంటు, గుంటకు సాగునీరందించే దిశగా ప్రభుత్వం ముందుకెళ్తున్నది. పాలమూరు-రంగారెడ్డి పనుల పురోగతి, కల్వకుర్తి ఎత్తిపోతల (ఎంజీకేఎల్ఐ) విస్తరణ మొదలైన అంశాలపై అనుసరించాల్సిన కార్యాచరణతోపాటు అచ్చంపేటకు సాగునీరందించే విషయాన్ని ఇరిగేషన్ సీఎం కేసీఆర్ ఉన్నతాధికారులతో నిర్వహించిన సమావేశంలో చర్చించారు. దీంతో నల్లమల ప్రాంతంలోని అచ్చంపేట, ఉప్పునుంతల, లింగాల, బల్మూర్, అమ్రాబాద్, పదర మండలాల ప్రజల్లో ఆశలు చిగురిస్తున్నాయి. ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలోని చివరి ఆయకట్టు వరకు సాగు నీరందించాలని చేపట్టిన పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టు పనులు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. అచ్చంపేట నియోజకవర్గంలో 75 వేల ఎకరాలకు సాగునీరందించేందుకు ఏదుల రిజర్వాయర్ నింపి 22.750 కిలోమీటర్ల గ్రావిటీ కెనాల్ ద్వారా లింగాల మండలం జినుగుపల్లి పంప్హౌస్కు రెండు పంపుల ద్వారా రోజుకు ఒక టీఎంసీ నీటిని తరలించేలా ప్రణాళిక రూపొందించారు. జినుగుపల్లి పంప్హౌస్ నుంచి 2.57 టీఎంసీల నీటిని బల్మూర్ మండలంలోని మైలారం సమీపంలో నిర్మించనున్న రిజర్వాయర్కు తరలించనున్నారు. దీంతో బల్మూర్, లింగాల, ఉప్పునుంతల మండలాలు సాగునీటితో సస్యశ్యామలం కానున్నాయి. మైలారం రిజర్వాయర్ నుంచి ఓపెన్ కెనాల్ ద్వారా చంద్రసాగర్లో 0.3 టీఎంసీలు నింపి అక్కడ మరో లిఫ్ట్ ఏర్పాటు చేసి మన్ననూర్లో నిర్మించనున్న 1.410 టీఎంసీల సామర్థ్యం కలిగిన రిజర్వాయర్కు తరలించనున్నారు. దీంతో అమ్రాబాద్, పదర మండలాల్లో చివరి ఆయకట్టుకు సాగు నీరందనున్నది. 2.540 టీఎంసీల సామర్థ్యం గల మైలారం రిజర్వాయర్ పరిధిలో 43,750 ఎకరాలు, 0.3 టీఎంసీల సామర్థ్యం గల చంద్రసాగర్ రిజర్వాయర్ పరిధిలో 6,250 ఎకరాలు, 1.410 టీఎంసీల సామర్థ్యం గల మన్ననూర్ రిజర్వాయర్ పరిధిలో 25 వేల ఎకరాలకు మొత్తం 75 వేల ఎకరాలకు సాగునీరందించేలా సంబంధిత అధికారులు సీఎం కేసీఆర్కు ప్రతిపాదనలు సమర్పించారు. ఈ మేరకు మే నెలలో ప్రాజెక్టుల నిర్మాణానికి సీఎం కేసీఆర్ స్వయంగా భూమి పూజ చేయనున్నట్లు ప్రకటించారు.
కృష్ణమ్మ నీటితో కాళ్లు కడుగుతా..
నియోజకవర్గంలోని చివరి ఆయకట్టుకు సాగునీటిని తీసుకొచ్చి అచ్చంపేట ప్రజల కాళ్లు కడుగుతా. రెండు లిఫ్ట్లు, మూడు రిజర్వాయర్ల నిర్మాణానికి సీఎం కేసీఆర్ సానుకూలంగా ఉన్నారు. పాలమూరు-రంగారెడ్డి, కల్వకుర్తి ఎత్తిపోతలను అనుసంధానం చేస్తూ చేపట్టనున్న పనులకు ఆదేశాలిచ్చారు. సీఎం కేసీఆర్పై అచ్చంపేట ప్రజలు పూర్తి విశ్వాసంతో ఉన్నారు. 2022 డిసెంబర్ వరకు చివరి ఆయకట్టుకు సాగునీరందిస్తా. భారీ నీటి పారుదల శాఖ అధికారులు, ఇంజినీర్లతో సమావేశమై చేసిన ప్రయత్నాలు ఫలించనున్నాయి. ప్రాజెక్టుల నిర్మాణం, కాల్వలు, పంప్హౌస్ల ఏర్పాటుకు విపక్షాలు, రైతులు అన్ని విధాలుగా సహకరించాలి.