అన్ని డివిజన్లలో విజయం సాధించేలా వ్యూహం
నగర‘పోరు’కు గులాబీ దండు సిద్ధం..
మొదలైన టీఆర్ఎస్ శ్రేణుల ప్రచారం
మంత్రి పువ్వాడ అభివృద్ధే ఆయుధంగా ముందుకు..
రిజర్వేషన్లపై కొనసాగుతున్న ఉత్కంఠ
బ్యాలెట్ పద్ధతిలో ఎన్నికల నిర్వహణ
ఖమ్మం, ఏప్రిల్ 13 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) :గులాబీ సైన్యం కదనరంగానికి సిద్ధమైంది. జిల్లాలో ఎన్నిక ఏదైనా కారు జోరు కొనసాగుతుండడం ఆనవాయితీగా వస్తోంది. అదే ఉత్సాహంతో టీఆర్ఎస్ శ్రేణులు ఖమ్మం నగరపాలక సంస్థ ఎన్నికలకు రంగం సిద్ధం చేసుకున్నారు. ఈ సారి టార్గెట్ 60.. అని మంత్రి పువ్వాడ అజయ్కుమార్ పిలుపునివ్వడంతో టీఆర్ఎస్ కార్యకర్తలు నూతనోత్తేజంతో ప్రచారపర్వానికి తెర తీశారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలు, అభివృద్ధిని ఆయుధంగా చేసుకొని ముందుకు సాగుతున్నారు. ఇప్పటివరకు జరిగిన ఎన్నికల్లో గులాబీదండు ప్రత్యర్థులను మట్టికరిపించగా.. కార్పొరేషన్లోనూ విజయకేతనం ఎగురవేసేందుకు వ్యూహప్రతివ్యూహాలకు పదును పెడుతున్నారు. అన్ని డివిజన్లలో పాగా వేసేందుకు గులాబీదళం ఉవ్విళ్లూరుతోంది.
60కి 60 గెలువాల్సిందే..
మంత్రి అజయ్కుమార్ నేతృత్వంలో నగరంలో కనీవినీ ఎరుగని రీతిలో అభివృద్ధి జరిగింది. ప్రతి డివిజన్లో ప్రజలు ప్రగతి పరిమళాలను ఆస్వాదిస్తున్నారు. టీఆర్ఎస్ కార్పొరేటర్లు ప్రజలకు అందుబాటులో ఉండి సమస్యలు పరిష్కరించేలా ప్రత్యేక చొరవ తీసుకున్నారు. 2016లో నగరపాలక సంస్థ ఎన్నికల్లో టీఆర్ఎస్ ఘన విజయం సాధించి మేయర్, డిప్యూటీ మేయర్ పదవులను కైవసం చేసుకున్నది. ఈ సారి 60కి 60 డివిజన్లలో గులాబీ జెండా ఎగురవేయాలని మంత్రి పార్టీ శ్రేణులకు దిశానిర్ధేశం చేశారు. ప్రతిపక్షానికి స్థానం లేకుండా టీఆర్ఎస్ సత్తాచాటేలా కార్యోన్ముఖులను చేస్తున్నారు.
పువ్వాడ అభివృద్ధే ఆయుధంగా..
ప్రభుత్వం ఇటీవల డివిజన్ల విభజన ప్రక్రియను పూర్తి చేసింది. గత నగరపాలక సంస్థ ఎన్నికల్లో 50 డివిజన్లు ఉండగా.. పెరిగిన ఓటర్లు, సమీప గ్రామపంచాయతీల విలీనం వంటి కారణాలతో 60 డివిజన్లుగా రూపాంతరం చెందింది. మంత్రి పువ్వాడ అజయ్కుమార్ ప్రత్యేక కృషితో నగర రూపురేఖలు పూర్తిగా మారిపోయాయి. ప్రతి డివిజన్లో అంతర్గత రహదారులు, డ్రైనేజీ వ్యవస్థ మెరుగుపడింది. ఇంటింటికీ మంచినీరు అందుతోంది. శానిటేషన్పై ప్రత్యేక దృష్టిసారించి స్వచ్ఛ నగరంగా తీర్చిదిద్దారు. నగరంలోని త్రీటౌన్ ప్రాంత ప్రజలకు గోళ్లపాడు ఛానల్ ఇబ్బందులను తొలగించారు. నగర ప్రజలకు ఆహ్లాదాన్ని పంచేందుకు పలు ప్రాంతాల్లో పార్కులు నిర్మించారు. నిత్యావసరాలు, కూరగాయలు ఒకేచోట లభించేలా సమీకృత మార్కెట్లు అందుబాటులోకి తీసుకొచ్చారు. ఖమ్మం నగరానికి తలమానికంగా ఉండేలా ఆధునిక హంగులతో ఆర్టీసీ బస్టాండ్ నిర్మించారు. నగరంలోని కాల్వొడ్డు సమీపంలోని వైకుంఠధామం ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. ఐటీ హబ్ ఉమ్మడి ఖమ్మం జిల్లా నిరుద్యోగులకు వరప్రదాయినిగా మారింది. వివిధ ప్రాంతాల్లో వాకింగ్ ట్రాక్, ఓపెన్ జిమ్లు ఏర్పాటు చేశారు. లకారం ట్యాంక్ బండ్ పర్యాటక కేంద్రంగా రూపుదిద్దుకుంటోంది. వీటితోపాటు మరెన్నో అభివృద్ధి పనులు నగరానికి వన్నెలద్దుతున్నాయి.
మొదలైన టీఆర్ఎస్ ప్రచారం..
అన్ని రాజకీయ పార్టీల కంటే ముందుగా టీఆర్ఎస్ నాయకులు ప్రచారాన్ని ప్రారంభించారు. అభివృద్ధికి పట్టం కట్టాలని ఓటర్లను అభ్యర్థిస్తున్నారు. నగరంలో అభివృద్ధి మరింత వేగవంతం కావాలంటే మరోసారి టీఆర్ఎస్కు అవకాశం ఇచ్చి తీరాలన్న అభిప్రాయం సర్వత్రా వ్యక్తమవుతున్నదని రాజకీయ విశ్లేషకులు పేర్కొంటున్నారు.
రిజర్వేషన్లపై ఉత్కంఠ
నగరపాలక సంస్థ ఎన్నికలు నిర్వహించడానికి సిద్ధంగా ఉండాలని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ పార్థసారథి ఆదేశించారు. దీంతో కలెక్టర్ ఆర్వీ.కర్ణన్, మున్సిపల్ కమిషనర్ అనురాగ్ జయంతి యుద్ధప్రాతిపదికన ఎన్నికల ఏర్పాట్లను చేస్తున్నారు. ఈ సారి కార్పొరేషన్ ఎన్నికలు బ్యాలెట్ పద్ధతిలో జరుగనున్నాయి. బ్యాలెట్ బాక్సులు, బ్యాలెట్ పేపర్లు, స్ట్రాంగ్రూమ్లు ఏర్పాటు చేశారు. రిటర్నింగ్ అధికారి, సహాయ రిటర్నింగ్ అధికారులకు శిక్షణ కూడా పూర్తయ్యింది. ఓటరు తుది జాబితా, పోలింగ్ కేంద్రాల జాబితా డివిజన్ల వారీగా వెలువడాల్సి ఉంది. ఈ ప్రక్రియ పూర్తికాగానే నగరపాలక సంస్థ పరిధిలోని 60 డివిజన్లలో రిజర్వేషన్లను ప్రకటిస్తారు. అన్ని రాజకీయ పార్టీల్లో రిజర్వేషన్లపై ఉత్కంఠ నెలకొంది.
మంత్రి కేటీఆర్ ప్రశంసతో కార్యకర్తల్లో ఉత్తేజం
నగరం నలుమూలలా అభివృద్ధి పనులు సాక్షాత్కరిస్తున్నాయి. అభివృద్ధిలో ఖమ్మం ఇతర నగరాలకు ఆదర్శంగా ఉందని ఇటీవల రాష్ట్ర ఐటీ, పురపాలకశాఖ మంత్రి కేటీఆర్ ప్రశంసించడం.. కార్యకర్తల్లో ఉత్తేజం నింపింది. అదే ఉత్సాహంతో టీఆర్ఎస్ శ్రేణులు అభివృద్ధి, సంక్షేమాన్ని ప్రజలకు వివరిస్తూ ప్రచారాన్ని కొనసాగిస్తున్నారు.
ఇవి కూడా చదవండి
రోజూ తినే ఆహారంలో ఇవి ఉంటే ఆరోగ్యం మీ వెంటే
కీరదోస తింటే 7 రోజుల్లో 7 కిలోల బరువు తగ్గుతారా?