ముంబై : దేశ ఆర్థిక రాజధాని ముంబైలో కరోనా వైరస్ కేసులు పెరుగుతుండటం, కఠిన నియంత్రణలు అమలవుతుండటంతో మళ్లీ గత ఏడాది పరిస్ధితులు పునరావృతమవుతున్నాయి. ముంబైలో పనిచేస్తూ పొట్టపోసుకునే యూపీ, బిహార్, బెంగాల్ సహా పలు రాష్ట్రాలకు చెందిన వలస కూలీలు తిరిగి స్వస్ధలాల బాట పడుతున్నారు.
కొవిడ్-19 కేసుల వ్యాప్తితో ముంబైలో రాత్రి వేళల్లో కర్ఫ్యూ, పాక్షిక లాక్డౌన్లను ప్రకటించడంతో పనులు లేక వలస కూలీలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కొవిడ్ నియంత్రణలతో పనులు కోల్పోయిన వలస కూలీలు స్వరాష్ట్రాలకు బయలుదేరుతున్నారు. పరిస్థితి చక్కబడిన తర్వాత తిరిగి పిలుస్తామని తమ యజమానులు చెపుతుండటంతో గ్రామాలకు తిరిగివెళ్లాలని నిర్ణయించుకున్నామని వలస కూలీలు చెబుతున్నారు. వైరస్ భయం కంటే ముంబైలో బతికేందుకు అవసరమైన రాబడి రాదేమోననే భయంతోనే వలస కూలీలు ఇండ్ల బాటపడుతున్నారు.