దిగ్గజ సంస్థల రాకతో రాష్ట్రంలో వస్త్ర పరిశ్రమకు ఊపు
దేశంలో మొదటి టెక్నికల్ టెక్స్టైల్ టెస్టింగ్ ల్యాబ్ ఇక్కడే
హైదరాబాద్, ఏప్రిల్ 5 (నమస్తే తెలంగాణ): మనదేశంలో వస్త్ర పరిశ్రమ అనగానే గుర్తొచ్చేది మహారాష్ట్ర, గుజరాత్, తమిళనాడు రాష్టాలే. త్వరలోనే ఈ పరిస్థితి మారిపోనున్నది. రాష్ట్రంలోని కాకతీయ మెగా టెక్స్టైల్ పార్కు (కేఎంటీపీ) దేశ వస్త్ర పరిశ్రమలో గేమ్-చేంజర్ కానున్నది. యంగ్వన్ వంటి ప్రపంచ దిగ్గజ టెక్స్టైల్స్ సంస్థల రాకతోపాటు దేశంలో మొట్టమొదటి టెక్నికల్ టెక్స్టైల్ టెస్టింగ్ ల్యాబ్ను ఇక్కడ ఏర్పాటుచేస్తుండటంతో వస్ర్తాలను టెస్టింగ్కోసం విదేశాలకు పంపే అవసరం ఉండదు. ఇతర రాష్ర్టాల సంస్థలు కూడా టెస్టింగ్ కోసం మన దగ్గరకే పంపాల్సి ఉంటుంది. రాష్ట్రంలో వస్త్రపరిశ్రమ అభివృద్ధికి 1,200 ఎకరాల విస్తీర్ణంలో కాకతీయ మెగా టెక్స్టైల్ పార్కును వరంగల్లో ప్రభుత్వం ఏర్పాటుచేసింది. దీనిని పూర్తి పర్యావరణహితంగా అభివృద్ధి చేశారు. ఇప్పటికే భూసేకరణ పూర్తికాగా యంగ్వన్, గణేశా ఇకోస్పేర్ సంస్థలకు 350 ఎకరాలు కేటాయించారు. యంగ్వన్కు 300 ఎకరాలు ఇవ్వటంతో ఇక్కడ ఎనిమిది కర్మాగారాలను ఆ సంస్థ నెలకొల్పుతున్నది. ఐదు కర్మాగారాల నిర్మాణం పూర్తికావచ్చాయి. వచ్చే ఆరునెలల్లో ఉత్పత్తి కూడా ప్రారంభమవుతుంది. గణేశా సంస్థ ఈ ఏడాది చివరికల్లా ఉత్పత్తి ప్రారంభించే అవకాశముంది. అతిపెద్ద ఇఫ్లూయెంట్ ట్రీట్మెంట్ ప్లాంటును కూడా నెలకొల్పుతున్నారు.
ముడి సరుకు లభ్యత.. అనుకూల విధానాలు
ప్రాచీనకాలం నుంచి వస్త్రపరిశ్రమకు తెలంగాణ పెట్టింది పేరు. రాష్ట్రంలో నాణ్యమైన వస్త్ర కార్మికులకు కొదవలేదు. ఈ పరిశ్రమకు అత్యంత ప్రధానమైన ముడిసరుకు పత్తి ఉత్పత్తిలోనూ తెలంగాణ ముందున్నది. రాష్ట్రప్రభుత్వం కూడా ఈ రంగంలో భారీ పరిశ్రమలను ఆకర్షించేందుకు అనేక సంస్కరణలు చేపట్టింది. పెట్టుబడులు పెటేందుకు వచ్చే కంపెనీలకు అనేక ప్రయోజనాలు, రాయితీలు కల్పిస్తున్నది. పరిశ్రమల స్థాపనకు సులువైన విధానాలు అమలుచేస్తున్నది. దాంతో అంతర్జాతీయ దిగ్గజ సంస్థలు కూడా రాష్ర్టానికి క్యూ కడుతున్నాయి. కేంద్రప్రభుత్వం కూడా టైక్స్టైల్ రంగాన్ని ప్రోత్సహించే చర్యలు చేపట్టింది. 2020-21 బడ్జెట్లో కేంద్రం రూ.1,480 కోట్లతో నేషనల్ టెక్నికల్ టెక్స్టైల్ మిషన్ను ప్రతిపాదించింది. అంతర్జాతీయ వస్త్ర మార్కెట్లో మనదేశానికి ఐదుశాతం వాటా ఉన్నది. దేశ వస్త్ర పరిశ్రమలో 35.44 లక్షలమంది చేనేత కార్మికులుసహా మొత్తం దాదాపు 4.5 కోట్లమంది ఉపాధి పొందుతున్నారు. భారతీయ వస్త్ర పరిశ్రమ విలువ 2021లో 223 బిలియన్ డాలర్లకు చేరుతుందని అంచనా.