కొవిడ్ నిబంధనలు పాటిస్తూ చర్చిల్లో ప్రత్యేక ప్రార్థనలు
క్రీస్తు సందేశం ఇచ్చిన పాస్టర్లు
కమాన్చౌరస్తా, ఏప్రిల్ 2: నగరంలోని చర్చిల్లో ఏసు క్రీస్తును స్మరిస్తూ శుక్రవారం గుడ్ ఫ్రైడేను కొవిడ్ నిబంధనలు పాటిస్తూ నిర్వహించారు. క్రీస్తుకు శిలువ వేసిన తర్వాత చెప్పిన ఏడు సూక్తులను గుర్తుకు చేసుకుని ఉదయం నుంచి ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొన్నారు. ప్రత్యేక గీతాలు పాడుతూ, బైబిల్ పటిస్తూ ఆధ్యాత్మిక చింతనలో గడిపారు. ఈ క్రమంలో పలువురు 40 రోజులుగా ఉపవాసం ఉండగా, దీక్ష విరమించి పేదలకు దాన ధర్మాలు, బంధువులకు, స్నేహితులకు బహుమతులు అందజేశారు. నగరంలోని పోలీస్ కమిషనరేట్ సమీపంలో గల సీఎస్ఐ వెస్లీ కెథిడ్రల్ చర్చిలో పాస్టరేట్ చైర్మన్ రెవ వీ శ్రీనివాస్ నాయక్ సందేశం ఇచ్చారు. కార్యక్రమంలో విజయ్నాయక్, పాస్టరేట్ కమిటీ సభ్యులు రెవ కే వాట్సన్, అనిల్కుమార్, విజయసాగర్ పాల్గొన్నారు. అలాగే, క్రిస్టియన్ కాలనీలోని సీఎస్ఐ సెంటినరీ వెస్లీ చర్చిలో రెవ ప్రశాంత్ సందేశం ఇవ్వగా, జీ ప్రశాంత్ కుమార్, పాస్టరేట్ కమిటీ సభ్యులు నారాయణ, సుశీల్కుమార్ తదితరులు ప్రత్యేక ప్రార్థన చేశారు. ఈ సందర్భంగా పలువురు యువతీయువకులు ప్రత్యేక గీతాలు ఆలపించారు. అలాగే, విద్యానగర్లోని చర్చిల్లో మత పెద్దలు ప్రార్థనలు చేసి, క్రీస్తు సందేశాన్ని వినిపించారు.