అక్రమ నల్లా కనెక్షన్లపై జల మండలి ఉక్కుపాదం మోపుతుంది. వరుస తనిఖీలు చేస్తూ తాగునీటి చౌర్యానికి పాల్పడుతున్న వ్యక్తులపై, అందుకు సహకరించిన జలమండలి సిబ్బందిపై చర్యలు తీసుకుంటున్నది. దీంతో ఒకవైపు అక్రమ నల్లా కనెక్షన్లు చేపట్టిన యజమానులతోపాటు ఔట్ సోర్సింగ్ సిబ్బంది వెన్నులో వణుకుపుడుతున్నది.
సిటీబ్యూరో, మార్చి 31 (నమస్తే తెలంగాణ): తాగునీటి చౌర్యానికి పాల్పడుతున్న వారిపై జలమండలి అధికారులు కఠిన చర్యలు తీసుకుంటున్నారు. ప్రభుత్వ సూచనలు, జలమండలి ఎండీ ఆదేశాల మేరకు విజిలెన్స్ అధికారులు వరుస తనిఖీలు చేపడుతున్నారు. తాగునీటిని చౌర్యం చేస్తున్న వ్యక్తులపై క్రిమినల్ కేసులు నమోదు చేయడంతోపాటు అందుకు సహకరించిన జలమండలి ఔట్ సోర్సింగ్ సిబ్బందిపై కూడా కేసులు నమోదు చేసి ఉద్యోగం నుంచి తొలగిస్తున్నది. నాలుగైదు రోజుల్లోనే సుమారు 7-8 ప్రాంతాల్లో అక్రమ కనెక్షన్లను గుర్తించి వాటిని తొలగించామని జలమండలి విజిలెన్స్ అధికారులు తెలిపారు. జలమండలి తాగునీరు సరఫరా చేస్తున్న అన్ని ప్రాంతాల్లో విజిలెన్స్ విభాగం అధికారులు ఆకస్మిక తనిఖీలు చేస్తారని ఉన్నతాధికారులు పేర్కొన్నారు.
అధికారుల అనుమతి లేకుండా అక్రమంగా నల్లా కనెక్షన్లు పొందిన వారు, డొమెస్టిక్ కనెక్షన్ను తీసుకొని కమర్షియల్ అవసరాలకు వినియోగిస్తున్న వ్యక్తులు మీ సమీపంలో ఉంటే తమకు ఫిర్యాదు చేయాలని జలమండలి విజిలెన్స్ విభాగం అధికారులు కోరుతున్నారు. సమాచారం ఇచ్చిన వారి వివరాలను గోప్యంగా ఉంచుతామని, సమాచారం ఇవ్వాలనుకునే వారు 9989998100, 9989992268 నెంబర్లకు ఫోన్ చేయాలని సూచించారు. అక్రమంగా నల్లా కనెక్షన్లు తీసుకున్న వ్యక్తులను గుర్తించి క్రిమినల్ కేసులను నమోదు చేస్తామని హెచ్చరిస్తున్నారు.