కరోనాతో పెరిగిన కేంద్రాలు
10 జూనియర్ కాలేజీల ఎంపిక
52 జోన్లు, 132 కేంద్రాలు, 17,623 మంది స్టూడెంట్స్
20 స్కూళ్లలో 100 మందికిపైగా విద్యార్థులు
ఉన్నతాధికారులకు నివేదించిన జిల్లా విద్యాశాఖ
ఖమ్మం ఎడ్యుకేషన్, మార్చి 31: మే నెలలో జరుగనున్న పదోతరగతి పరీక్షలకు విద్యాశాఖ ఖమ్మం జిల్లావ్యాప్తంగా 132 కేంద్రాలను ఏర్పాటు చేయనుంది. కొవిడ్ నిబంధనల నేపథ్యంలో గతంలో కంటే ఎక్కువ పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నారు. గతంలో 89 కేంద్రాలు ఏర్పాటు చేయగా ఈ సారి వాటి సంఖ్యను పెంచారు. అధికారులు ప్రభుత్వ పాఠశాలలు, జిల్లా పరిషత్ పాఠశాలలు, మోడల్ స్కూల్స్, కస్తూర్బా బాలికల పాఠశాలలు, రెసిడెన్షియల్ పాఠశాలలు, సంక్షేమ పాఠశాలలను కేంద్రాలుగా ఏర్పాటు చేయనున్నారు. కేంద్రాలకు 122 పాఠశాలలు, 10 జూనియర్ కళాశాలలను ఎంపిక చేశారు. కొవిడ్ నేపథ్యంలో విద్యార్థులు మాస్క్లు ధరించి భౌతికదూరం పాటిస్తూ పరీక్షలు రాసేలా ఏర్పాట్లు చేస్తున్నారు. కేంద్రాల్లో శానిటైజర్లను అందుబాటులో ఉంచనున్నారు.
52 జోన్లుగా విభజన..
పది పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులకు విద్యాశాఖ అధికారులు జంబ్లింగ్ విధానంలో కేంద్రాలు కేటాయించారు. జిల్లాలోని 496 పాఠశాలలను 52 జోన్లుగా విభజించారు. పరీక్షా కేంద్రాలను ఏ, బీ, సీ కేంద్రాలుగా విభజించారు. జిల్లాకేంద్రం, మండల కేంద్రాల్లో ఉన్న స్కూల్స్ను ‘ఏ’ సెంటర్స్గా, పోలీస్ స్టేషన్కు 8 కిలోమీటర్ల పరిధిలో ఉండే పరీక్ష కేంద్రాలను ‘బీ’ కేంద్రాలుగా గుర్తిస్తారు. పోలీస్స్టేషన్కు ‘8’ కిలోమీటర్ల కంటే దూరంగా ఉండే కేంద్రాలను ‘సీ’ కేంద్రాలుగా గుర్తిస్తారు. జిల్లాలో ‘ఏ’ విభాగంలో 91, ‘బీ’ విభాగంలో 18, ‘సీ’ విభాగంలో 23 కేంద్రాలు ఉన్నాయి.
జిల్లావ్యాప్తంగా 17,623 మంది విద్యార్థులు..
జిల్లాలోని 496 ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల్లో 17,623 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరుకానున్నారు. వీరిలో బాలురు 8,902 మంది, బాలికలు 8,721 మంది ఉన్నారు. జిల్లాలో అత్యధికంగా న్యూవిజన్ స్కూల్ నుంచి 465 మంది, శ్రీచైతన్య ఇంటర్నేషనల్ స్కూల్ నుంచి 351మంది, త్రివేణి స్కూల్ నుంచి 212 మంది, కూసుమంచి జడ్పీహెచ్ఎస్ నుంచి 163 మంది, సెయింట్ జోసెఫ్ స్కూల్ నుంచి 159 మంది, గ్రేస్ స్కూల్ నుంచి 148 మంది, విన్ఫీల్డ్ నుంచి 141 మంది, న్యూఇరాలో 134 మంది, నిర్మల్ హృదయ్లో 123 మంది, శ్రీచైతన్య కాన్సెప్ట్ స్కూల్లో 114 మంది, ఎన్ఎస్ కెనాల్లో 111 మంది, హార్వెస్ట్లో 109 మంది, బేబీమూన్లో 108 మంది, జడ్పీఎస్ఎస్ గంగారంలో 110 మంది, జీహెచ్ఎస్ కల్లూరులో 106 మంది, కేపీఆర్ గౌతమ్లో 102 మంది, కారేపల్లి మోడల్ స్కూల్, కల్లూరు ప్రతిభ విద్యాలయం నుంచి 100 మంది పరీక్షలకు హాజరుకానున్నారు.
ఇవి కూడా చుడండి
పాలు తాగించి.. పసిబిడ్డపై పిడిగుద్దులు
మందుబాబు అతి వేగానికి ఏఎస్సై బలి
మిక్సీగ్రైండర్లలో బంగారం స్మగ్లింగ్