ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటుతో పెరిగిన ప్రాభవం
వృద్ధ కళాకారులకు పింఛన్లు
షాద్నగర్లో రూ.5 కోట్లతో ఆడిటోరియం నిర్మాణం
ప్రభుత్వ చేయూతతో గత వైభవాన్ని పొందుతున్న కళాకారులు
షాద్నగర్రూరల్, మార్చి 26: ప్రత్యేక రాష్ట్రం ఏర్పడ్డాక తెలంగాణ కళలకు ప్రాధాన్యం పెరుగడంతోపాటు కళాకారుల్లో ఆత్మ విశ్వాసం పెరిగింది. జానపదం, నృత్యం, సంగీతం, యక్షగానం, బుర్రకథ, హరికథ, రంగస్థల నాటకాలు ఇలా అన్ని కళారూపాలకు సర్కారు ప్రాధాన్యమిస్తున్నది. రాష్ట్ర సంగీత నాటక అకాడమీని ఏర్పాటు చేసి రంగస్థల కళలకు ప్రాణం పోస్తున్నది. వేల మందికి పైగా వృద్ధ కళాకారులకు పెన్షన్ అందిస్తున్నది. అలాగే షాద్నగర్లో రూ.5 కోట్లతో ఆడిటోరియం నిర్మాణానికి శ్రీకారం చుట్టింది.
తెలంగాణ సంస్కృతి సంప్రదాయలకు జానపద కళలు అద్దం పడుతాయి. అవి అంతరించకుండా భవిష్యత్ తరాలకు అందించేలా రాష్ట్ర ప్రభుత్వం జానపద కళా ప్రావీణ్యం పెంపొందించడానికి ప్రత్యేకంగా దృష్టి సారించింది. పట్టణాల్లో నివసించే వారికి జానపద కళలు తెలియవు. గ్రామీణ ప్రాంతాల్లో కూడా జానపద కళ అంతరించిపోతున్నది. ఈ కళకు పూర్వవైభవం తీసుకొచ్చేలా రాష్ట్ర ప్రభుత్వం అడుగులు వేస్తున్నది. గ్రామీణ ప్రాంతాల్లోని కళకారులను ప్రోత్సహిస్తున్నది. జానపద కళకు ఇతర దేశాల్లో ప్రత్యేక గుర్తింపు ఉంది. జానపద కళ ప్రాధాన్యత అందరికీ తెలిసేలా పట్టణాల్లో కళాకారులతో ప్రదర్శనలు ఇచ్చేలా ప్రయత్నిస్తున్నారు. ఇందులో భాగంగానే కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో సౌత్ జోన్ కల్చర్ సెంటర్ సహకారంతో జానపద, సంస్కృతిక కళలకు పూర్వవైభవం అందించేలా ముందుకు సాగుతున్నది.
జానపద కళలు
మన రాష్ట్రంలో జానపద కళల్లో ప్రధానంగా ఒగ్గుడోలు, కోలాటం, అడుగుల భజన, పులివేషాలు, గుస్సాడి, గిరిజనుల నృత్యాలు వంటి ఎన్నో కళలున్నాయి. వాటికి ప్రత్యేక గుర్తింపు ఉండేది. మారుతున్న కాలంతో పాటు జానపద కళలు అంతరించి పోవడంతో ఎస్జడ్సీసీ సౌత్ జోన్ కల్చర్ సెంటర్ వారు ప్రతి ఏడాది జానపద కళాకారులతో ప్రదర్శనలు ఇప్పిస్తున్నారు. దీని నిమిత్తం సుమారు రూ.5 లక్షలు ప్రదర్శనలకు ఖర్చు చేస్తూ కళాకారులను ప్రోత్సహిస్తున్నారు.
షాద్నగర్లో కళాకారులకు ప్రోత్సాహం
షాద్నగర్లోని మండల పరిషత్ కార్యాలయం సమీపంలో రూ.5 కోట్లతో నూతన ఆడిటోరియం నిర్మాణ పనులను ఎమ్మెల్యే వై.అంజయ్యయాదవ్ ఇటీవలే ప్రారంభించారు. ఆడిటోరియం పనులు శరవేగంగా కొనసాగుతున్నాయి. తెలంగాణ సర్కార్ జానపద కళాకారులను ప్రోత్సహిస్తుండడంతో మారుమూల గ్రామీణ ప్రాంతాల్లో ఈ ప్రదర్శనల్లో పాల్గొనేందుకు వారు ఆసక్తి చూపుతున్నారు. ఇటీవలే షాద్నగర్లోని యోగా కేంద్రంలో మూడ్రోజుల పాటు జానపద కళాకారులతో ప్రదర్శనలు చేశారు. ఈ ప్రదర్శనలో కళాకారులు తమ ప్రతిభను చాటడంతో పూర్వ జానపద కళను పట్టణ ప్రజలు తిలకించి సంతోషం వ్యక్తంచేశారు. షాద్నగర్లో సుమారు 30 మంది కళాకారులు ఉన్నారు. ఆడిటోరియం ఏర్పాటుతో కళాకారుల్లో నూతన ఉత్తేజం నిండి ప్రదర్శనలకు సిద్ధమవుతున్నారు.
ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ కళలు అణచివేతకు గురయ్యాయి. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడ్డాక ఈ ప్రాంత కళలు, కళాకారుల్లో ఆత్మ విశ్వాసం పెరిగింది. జానపదం, నృత్యం, సంగీతం, యక్షగానం, బుర్రకథ, హరికథ, రంగస్థల నాటకాలు ఇలా అన్ని కళారూపాలకు తెలంగాణ సర్కారు ప్రాధాన్యత కల్పించడం పట్ల అందరిలోనూ ఉత్సాహం ఊపిరి పోసుకున్నది. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడ్డాక నాటక రంగ ప్రాముఖ్యతను పెంచే దిశగా.. ప్రభుత్వం చేపట్టిన ప్రత్యేక కార్యాచరణతో తెలంగాణలో నాటక రంగం తన వైభవాన్ని చాటుకుంటున్నది. నాటకరచన, కథాంశం, సంభాషణలు, వస్త్రధారణ, సాంకేతిక వినియోగంలో వినూత్న మార్పులు వచ్చాయి. తెలంగాణ రాష్ట్ర సంగీత నాటక అకాడమీని ప్రభుత్వం ప్రత్యేకంగా ఏర్పాటు చేసి రంగస్థల కళలకు ప్రాణం పోస్తున్నది. తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ, సంగీత నాటక అకాడమీ ఆధ్వర్యంలో కొత్త తరం కళాకారులను ప్రోత్సహించే దిశగా నాటకోత్సవాలు, ప్రత్యేక శిక్షణలు, నిర్వహించడంతోపాటు నాటక ప్రదర్శనలకు ప్రభుత్వం ఆర్థిక చేయూత అందిస్తూ కళాకారులను ఎంతగానో ప్రోత్సహిస్తున్నది. రాష్ట్రవ్యాప్తంగా 4వేల మందికి పైగా వృద్ధ కళాకారులకు పింఛన్ అందిస్తూ వారి సేవలకు ప్రత్యేక గుర్తింపు కల్పించింది. తెలంగాణ ఉద్యమ నేత కేసీఆర్ సీఎం కావడం వల్ల తెలంగాణ ప్రాంతంలోని నాటక రంగానికి అరుదైన ప్రోత్సాహం దక్కిందని పలువురు నాటక సంస్థల ప్రతినిధులు, కళాకారులు చెబుతున్నారు.
జానపద కళకు నేటికీ ఆదరణ ఉంది
జానపద కళకు నేటికీ ఎంతో ఆదరణ ఉంది. ప్రసార మాధ్యమాలు, సోషల్ మీ డియా ఎక్కువ కావడంతో జానపద కళ అంతరించిపోతున్నాయి. ఒకప్పుడు జానపద కళను తిలకించేందుకు పట్టణాల నుంచి గ్రా మీణ ప్రాంతాలకు వచ్చే వారు. అంతరించి పోతున్న ఈ కళ ను ప్రభుత్వాలు ప్రోత్సహించడం సంతోషంగా ఉంది.
-రమేశ్చారి, కళాకారుడు, షాద్నగర్