యాదాద్రి, మార్చి 23 : లోకరక్షకుడు, అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహుడు బ్రహ్మోత్సవాల్లో భాగంగా మంగళవారం గరుడ వాహనంపై శ్రీమహావిష్ణువుగా దర్శనమిచ్చారు. లక్ష్మీనాథుడైన శ్రీవారు విష్ణుమూర్తి అలంకారంలో ఇష్టవాహనమైన గరుత్మంతుడిపై శ్రీమహాలక్ష్మీ సమేతంగా విహరించారు. బాలాలయంలో జరిగిన ఈ వేడుకలో అర్చకబృందం, వేదపండితులు, పారాయణందారుల వేదోక్త పఠనాలు, ఆస్థాన విద్వాంసుల మంగళవాయిద్యాల నడుమ అలంకార సేవ నేత్రపర్వంగా సాగింది. సాయంత్రం దివ్య విమాన రథోత్సవం కనులపండువగా సాగింది. అనంతరం ఉత్సవమూర్తులను అలంకారసేవపై అధిష్టించి భక్తుల దర్శనార్థం కొండకింద ప్రచార రథంలో ఈ వేడుక నిర్వహించారు.
నేడు చక్రతీర్థం.. దేవతోద్వాసన
యాదాద్రి శ్రీలక్ష్మీ నరసింహుడి బ్రహ్మోత్సవాల్లో భాగంగా బుధవారం ఉదయం మహాపూర్ణాహుతి, చక్రతీర్థం, సాయంత్రం 6 గంటలకు శ్రీపుష్ప యాగం, దేవతోద్వాసన, దోపు ఉత్సవం నిర్వహించనున్నారు. ఉత్సవాలు చివ రిదశకు రావడంతో భక్తులు నిత్యం భారీగా తరలివచ్చి స్వామివారిని దర్శించుకుంటున్నారు.
వైభవం.. దివ్యవిమాన రథోత్సవం
లోకకల్యాణం, విశ్వశాంతి కోసం నిర్వహిస్తున్న బ్రహ్మోత్సవాల్లో భాగంగా సాయంత్రం దివ్యవిమాన రథోత్సవా న్ని ఆగమ నియమాలకనుగుణంగా బాలాలయంలో నిర్వహించారు. నిత్యారాధనలు, చతుస్థానార్చనలు, మంటపారాధనలు, మూలమంత్రజపాలు, ద్వారతోరణ పూజలు, దివ్యప్రబంధ పారాయణాదులు, మహామంత్ర పుష్ప పఠనాలు, పురాణ, ఇతిహాస విజ్ఞాపనలు నిర్వహించారు. విభిన్న పుష్పాలు, మామిడి, అరటి ఆకుల తోరణాలతో స్వామివారి రథాన్ని సుందరంగా అలంకరించారు. అర్చకస్వాములు విశ్వక్సేన పూజలతో రథాంగబలి, దిష్టికుంభ పూజలు నిర్వహించారు. పట్టువస్ర్తాలు, బంగారం, వెండి, ముత్యాల ఆభరణాలతో మనోహరంగా అలంకరించి కల్యాణ దంపతులు శ్రీలక్ష్మీనరసింహులను ప్రత్యేక రథంపై అధిష్టింపజేశారు. వేదమంత్రాలతో ఆలయ అర్చకులు రథాంగహోమం చేపట్టారు. అర్చకులు, రుత్వికులు, యజ్ఞిక బృందం, పారాయణదారులు మూలమంత్ర జపపఠనం, వేదపారాయణాలు పఠించి హారతినివేదన చేశారు. అనంతరం రథాంగ రూఢుడైన లక్ష్మీనృసింహుడిని భక్తజనులు దర్శించుకున్నారు. అనంతరం యాదాద్రి కొండ కింద పాత జిల్లాపరిషత్ హైస్కూల్ నుంచి ప్రచార రథంలో శ్రీస్వామివారి రథోత్సవం ఘనంగా జరిగింది. స్థానిక తిరువీధుల్లో భక్తుల కోలాటాలు, భజనల మధ్య వేడుకగా సాగింది. కార్యక్రమంలో సమాచార హక్కు చట్టం తాత్కాలిక ముఖ్య కమిషనర్ బుద్ధ మురళి దంపతులు, ఆలయ ఈవో ఎన్.గీత, అనువంశిక ధర్మకర్త బి.నరసింహమూర్తి, ప్రధానార్చకులు నల్లందీగల్ లక్ష్మీనారసింహచార్యులు, మోహనాచార్యులు, ఉప ప్రధానార్చకులు సరేంద్రాచార్యులు, రంగాచార్యులు, వెంకటాచార్యులు, శ్రీధరాచార్యులు, అధికారులు దోర్బాల భాస్కర్శర్మ, శ్రవణ్కుమార్, రమేశ్బాబు తదితరులు పాల్గొన్నారు.