హైదరాబాద్, మార్చి 23 (నమస్తే తెలంగాణ): తెలంగాణకు రూ.25 వేల కోట్ల ప్రత్యేక ప్యాకేజీ ఇవ్వాలని రాజ్యసభ ఎంపీ సంతోష్కుమార్ కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. 13, 14 ఆర్థిక సంఘాల కేటాయింపుల్లో తెలంగాణకు రావాల్సిన బకాయిలను వెంటనే విడుదలచేయాలని డిమాండ్చేశారు. కేంద్రం ప్రతిపాదించిన బడ్జెట్ దేశాన్ని కరోనా కష్టాల నుంచి గట్టెక్కించేలా సానుకూలంగా ఉన్నదని పేర్కొన్నారు. మంగళవారం రాజ్యసభలో కేంద్ర బడ్జెట్పై జరిగిన చర్చలో ఎంపీ సంతోష్కుమార్ పాల్గొన్నారు. బడ్జెట్లో తెలంగాణకు అవసరమైన మేర నిధులు కేటాయించకపోవడంపై ఆందోళన వ్యక్తంచేశారు. కేంద్రం 2.8 కోట్ల కుటుంబాలకు నల్లాల ద్వారా సురక్షిత తాగునీరు అందించేందుకు జల్జీవన్ మిషన్ కింద రూ.2.87 లక్షల కోట్లు కేటాయించిందని, దీనికి మిషన్ భగీరథే స్ఫూర్తి అని పేర్కొన్నారు. తెలంగాణలో సీఎం కేసీఆర్ నేతృత్వంలో ఇంటింటికి తాగునీరు అం దించి దేశానికే రోల్మోడల్గా నిలిచారని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం సొంత నిధులతోపాటు రుణాలు సేకరించి మిషన్ భగీరథ కోసం రూ.30 వేల కోట్లు ఖర్చుచేశామని, 98% పనులు పూర్తయ్యాయని వెల్లడించారు. పెండింగ్ పనులను పూర్తిచేయడానికి కేంద్ర ప్రభుత్వం జల్జీవన్ మిషన్ కింద నిధులు కేటాయిస్తుందని ఆశించామని, కానీ కేంద్రం నిరాశకు గురిచేసిందని తెలిపారు.
నిధులు విడుదలచేయండి
వివిధ పద్దుల కింద తెలంగాణకు రూ.25,105 కోట్ల ప్రత్యేక ప్యాకేజీ ఇవ్వాలని పలు సంస్థలు కేంద్రానికి సిఫారసు చేసిన విషయాన్ని ఎంపీ గుర్తుచేశారు. రాష్ట్ర విభజనచట్టం ప్రకారం వెనుకబడిన ప్రాంతాల అభివృ ద్ధి నిధులు, 13, 14 వ ఆర్థిక సంఘం బకాయిలు, స్పెసిఫిక్ గ్రాంట్లను వెంటనే విడుదలచేయాలని కోరారు. కరోనా ప్రజల జీవనోపాధిని తీవ్రంగా ప్రభావితంచేసిందని, ఇటువంటి క్లిష్ట సమయంలో బడ్జెట్ కూర్పు సాహసోపేతచర్య అని పేర్కొంటూ కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ను అభినందించారు. దేశంలో రైతు ఆందోళనలు జరుగుతున్న నేపథ్యంలో ఎరువుల సబ్సిడీలకు సంబంధించి ఎలాంటి విప్లవాత్మక సంస్కరణలు ప్రతిపాదించకపోవడం ఆశ్చర్యం కలిగించలేదని తెలిపారు. కరోనా నేపథ్యంలో వైద్య రంగానికి రూ.2.23 లక్షల కోట్లను కేటాయించటాన్ని ఎంపీ సంతోష్కుమార్ స్వాగతించారు. ఉపాధిహామీ పథకానికి నిధులను రూ.1.11 లక్షల కోట్ల నుంచి రూ.73 వేల కోట్లకు తగ్గించడాన్ని ఎంపీ సరికాదన్నారు.15 ఆర్థిక సంఘం సిఫారసుల మేరకు రాష్ట్రాలకు పన్నుల వాటాను తగ్గించడం సరికాదని, దీంతో ఆయా రాష్ట్రాల ఆర్థిక ప్రణాళికలు దెబ్బతిన్నాయని ఎంపీ సంతోష్కుమార్ అన్నారు.