హైదరాబాద్, ఆట ప్రతినిధి: క్రీడలకు మహర్దశ పట్టబోతున్నది. సముచిత ప్రాధాన్యం కల్పిస్తూ 2021-22 సంవత్సరానికి తెలంగాణ ప్రభుత్వం భారీగా నిధులు కేటాయించింది. ఆర్థిక శాఖ మంత్రి హరీశ్రావు గురువారం శాసనసభలో ప్రవేశపెట్టిన వార్షిక బడ్జెట్లో క్రీడలకు రూ.113 కోట్లు ప్రకటించారు. గతేడాదితో పోల్చుకుంటే దాదాపు ఇది రూ.100 కోట్లు అధికం కావడం విశేషం. ప్రగతి పద్దులో భాగంగా కొత్త స్టేడియాల నిర్మాణం, క్రీడా వసతుల కల్పన కోసం రూ.46 కోట్లు, క్రీడా సంఘాలు, ప్లేయర్ల నగదు పారితోషకాలకు రూ.20 కోట్లు, సాట్స్కు రూ.23 కోట్లు, స్పోర్ట్స్ స్కూల్స్ వరంగల్, కరీంనగర్కు రూ.14 కోట్లు, స్టేట్ స్పోర్ట్స్ స్కూల్కు రూ.9 కోట్లు కేటాయింపులు చేశారు. దేశంలోనే అత్యుత్తమ క్రీడా పాలసీని తీసుకొచ్చే ప్రయత్నంలో ఉన్న రాష్ట్ర ప్రభుత్వం అందుకు అనుగుణంగా క్రీడలకు తగిన రీతిలో నిధులు కల్పించింది.