హైదరాబాద్, మార్చి 18 (నమస్తే తెలంగాణ): విద్యుత్తు రంగంలో తెలంగాణ రాష్ర్టానికి గొప్ప విజయగాథ. రాష్ట్రం ఏర్పడిన అనతి కాలంలోనే విద్యుత్తు కష్టాలను అదిగమించిన తీరు దేశానికే ఆదర్శం. ఏటా విద్యుత్తు రంగానికి బడ్జెట్లో రాష్ట్రప్రభుత్వం ఆగ్రాసనమే వేస్తున్నది. 2021-22 బడ్జెట్లో విద్యుత్తుశాఖకు రూ.11,046 కోట్లు కేటాయిస్తున్నట్టు ఆర్థికమంత్రి హరీశ్రావు బడ్జెట్ ప్రసంగంలో ప్రకటించారు. ఇందులో ప్రగతి పద్దు కింద రూ.7,811.19 కోట్లు ప్రతిపాదించారు. వ్యవసాయం, ఇతర రంగాలకు విద్యుత్తు సబ్సిడీ కోసం రూ.7,665 కోట్లు కేటాయించారు. గతేడాదితో పోల్చితే సబ్సిడీలకు అదనంగా రూ.120 కోట్లు ఇచ్చారు.
రాష్ట్రం ఏర్పడిన 2014లో తెలంగాణలో తలసరి విద్యుత్తు వినియోగం 1,110 యూనిట్లు ఉండగా, 2020-21 నాటికి 2,071 యూనిట్లకు చేరడం రాష్ట్ర ప్రగతికి ప్రతిబింబంగా నిలిచింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో రాష్ట్ర గరిష్ఠ డిమాండ్ 13,162 మెగావాట్లు కాగా.. ఇటీవలే తెలంగాణ రాష్ట్రంలో ఆ రికార్డును అధిగమించి 13,468 మెగావాట్లు గరిష్ఠ డిమాండ్ నమోదవ్వడం విశేషం.
పరిశ్రమల శాఖకు రాష్ట్ర వార్షిక బడ్జెట్ 2021-22లో రూ.3,077 కోట్లు కేటాయించారు. గ్రామీణ, చిన్న పరిశ్రమలకు రూ.1,379.78 కోట్లు, పెద్ద, మధ్య తరహా పరిశ్రమలకు రూ.1,141కోట్ల బడ్జెట్ను ప్రతిపాదించారు. 2020-21 ఏడాది బడ్జెట్లో ఈ శాఖకు రూ.1,570 కోట్లు కేటాయించగా, ఈసారి బడ్జెట్ రెట్టింపయ్యింది. టీఎస్-ఐపాస్ ద్వారా గడచిన ఆరేండ్లలో 15,252 పరిశ్రమల స్థాపనకు అనుమతులు జారీచేశారు. దీనివల్ల రూ.2.13 లక్షల కోట్ల పెట్టుబడులు రాగా, 15.51 లక్షల మందికి ఉద్యోగావకాశాలు లభించాయి. ఎస్సీ, ఎస్టీ మహిళా పారిశ్రామికవేత్తలకు 2014 నుంచి ఇప్పటివరకు పరిశ్రమల స్థాపన కోసం ప్రభుత్వం రూ.1,919 కోట్లు సబ్సిడీ ఇచ్చింది. గనులు, ఖనిజాల అభివృద్ధికి రూ.127 కోట్లు కేటాయించారు.
చేనేత కార్మికుల సంక్షేమానికి ప్రభుత్వం బడ్జెట్లో రూ.338 కోట్లు కేటాయించింది. నేతన్నలను ఆదుకొనేందుకు ప్రభుత్వం పెద్దఎత్తున చర్యలు తీసుకున్న విషయం విధితమే. రుణాలు మాఫీ చేయడమేకాకుండా వారికి కావాల్సిన నూలు, రసాయనాలను సగం ధరకే అందిస్తున్నది. 95.25 లక్షల బతుకమ్మ చీరలు, స్కూల్ యూనిఫాం అర్డర్లను ఇవ్వటం ద్వారా సుమారు 20 వేలమంది నేత కార్మికులకు ప్రత్యక్ష ఉపాది కల్పిస్తున్నది. చేనేత కార్మికులకు ఇప్పటికే ప్రభుత్వం నుంచి రూ.461 కోట్ల విలువైన ఆర్డర్లు అందాయి. పవర్లూం కార్మికుల ఆదాయం నెలకు రూ.16 వేల నుంచి రూ.20 వేలకు పెరిగింది. నేతన్నకు చేయూత పథకం కింద వేతనంలో 8 శాతం పొదుపు చేసుకున్నవారికి ప్రభుత్వం మరో 8 శాతం జమచేస్తున్నది.