హైదరాబాద్, మార్చి 18 (నమస్తే తెలంగాణ): పేదలకు గౌరవప్రదమైన నివాసాన్ని ఉచితంగా అందించే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన రెండు పడకల ఇండ్ల పథకానికి ఈ ఏడాది బడ్జెట్లో రూ.11వేల కోట్లు కేటాయించింది. సొంత స్థలం కలిగిన పేదలకు రెండు పడకగదుల ఇంటిని నిర్మించుకునేందుకు ఆర్థిక సాయం అందజేస్తామని ప్రకటించింది. ఈ మేరకు బడ్జెట్లో భారీగా నిధులు కేటాయించింది. ఇప్పటికే గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో కలిపి 52,456 డబుల్ బెడ్రూం ఇండ్ల నిర్మాణం పూర్తయింది. రూ.11 వేల కోట్ల నిధుల్లో ప్రగతిపద్దులో రూ.7,219.70 కోట్లు, నిర్వహణ పద్దులో రూ.1,529.68 కోట్లుగా చూపించింది. ప్రగతి పద్దు నుంచి పట్టణ పేదల కోసం రూ.2,625 కోట్లు, గ్రామీణుల కోసం రూ.4,469 కోట్లతో ఇండ్లు నిర్మించనున్నది. పీఎంఏవై కింద రూ.143.52 కోట్లు కేటాయించింది.