జనగామ చౌరస్తా, మార్చి 16 : హరితహారం కార్యక్రమంలో నాటిన మొక్కలకు నీళ్లు పోసి సంరక్షించాలని, ఆ దిశగా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ కే నిఖిల అధికారులను ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఆయా శాఖల అధికారులతో ఆమె సమీక్ష నిర్వ హించారు. నర్సరీలు, వైకుంఠధామాలు, సెగ్రిగేషన్ షెడ్లు, రైతు కల్లాలు, గ్రామాల్లో పన్నుల వసూలు, పారిశుధ్య పను లపై చర్చించారు. నిఖిల మాట్లాడుతూ మండల ప్రత్యేక అధికారులు, ఎంపీడీవోలు, ఎంపీవోలు తమ పరిధిలోని నర్సరీలను సందర్శించి మొలకెత్తిన విత్తనాలపై నివేదిక సమర్పించాలన్నారు. ఏ నర్సరీలోనైనా 75 శాతానికి తక్కువ ఉంటే బాధ్యులపై చర్యలు తీసుకుంటామని ఆమె హెచ్చరించారు. వాచర్లతో ఏయే ప్రాంతాల్లో, ఏయే రోజుల్లో మొక్కలకు నీరు పెట్టాలో కార్యాచరణ రూపొందించాలన్నారు. వాచ్ అండ్ వార్డు చెల్లింపులను ఆన్లైన్లో ఎప్పటికప్పుడు అప్లోడ్ చేయాలన్నారు. ఆవాసాల్లో పల్లెప్రకృతి వనాలను పూర్తి చేయాలని కోరారు. పల్లె ప్రకృతి వనానికి ప్రతిరోజు నీరు పట్టాలని, పచ్చగా, ఆకర్షణీయంగా కనిపించేలా పనులు చేయాలని సూచించారు. జాతీయ గ్రామీణ ఉపాధిహామీ పథకంలో కూలీల సంఖ్య పెంచాలని, ప్రతి గ్రామంలో కనీసం 50 మందికి తక్కువ లేకుండా చూడాలని కలెక్టర్ సూచించారు. లేబర్ ఎఫ్టీవోలు ఏ రోజుకారోజు అప్లోడ్ చేయాలన్నారు.
మిగులు పనుల పురోగతి ఫొటోగ్రాఫ్లు ప్రతిరోజు వాట్సాప్ గ్రూపులో పెట్టాలన్నారు. మిషన్ భగీరథ ద్వారా వైకుంఠధామాలకు నీటి సరఫరా విషయమై నివేదిక పంపాలని సంబంధిత అధికారులను ఆమె ఆదేశించారు. ఎన్ని చోట్ల పనులు పూర్తయ్యాయి, ఇంకా ఎన్ని చోట్ల పూర్తి కావాల్సి ఉంది, వీటిలో ఏమైనా సమస్యలున్నాయా అనే అంశాలను మండల ప్రత్యేక అధికారులు, ఎంపీడీవోలు, ఎంపీవోలు పరిశీలించి నివేదిక సమర్పించాలన్నారు. సెగ్రిగేషన్ షెడ్లు వంద శాతం ఉపయోగంలోకి తేవాలని, తడి పొడి చెత్త సేకరణ జరగాలని నిఖిల కోరారు. జిల్లాలో 607 కల్లాల నిర్మాణం పూర్తయిందని తెలిపారు. గ్రామాల్లో వంద శాతం పన్నుల వసూలుకు ప్రణాళికాబద్ధంగా చర్యలు తీసుకోవాలన్నారు. వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణం పూర్తి చేయాలన్నారు. టీమ్ ఏర్పాటు చేసి మంజూరైన వాటిలో రద్దు చేయాల్సినవి ఉంటే రద్దు చేయ డం, ప్రతిపాదనలు మంజూరు చేయడం వెంటనే చేపట్టాలన్నారు. గ్రామాల్లో పారిశుధ్యం నిరంతరం నిర్వహించాలని, ప్రతిరోజు దీనిపై నివేదిక సమర్పించాలని ఆమె కోరారు. లక్ష్యం మేరకు పనులు పూర్తి కాని చోట బాధ్యులపై చర్యలు తప్పవని కలెక్టర్ కే నిఖిల అధికారులను హెచ్చరించారు. ఈ సమావేశంలో జిల్లా అదనపు కలెక్టర్ అబ్దుల్ హమీద్, డీఆర్డీవో రాంరెడ్డి, జిల్లా పరిషత్ సీఈవో రమాదేవి, జిల్లా వ్యవసాయ అధికారి నర్సింగం, జిల్లా పంచాయతీ అధికారి రంగాచారి, పీఆర్ ఈఈ రఘువీరారెడ్డి, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.