లక్నో: కేంద్రంలో, రాష్ట్రంలో సంకుచిత మనస్తత్వాలు కలిగిన వ్యక్తులు పరిపాలన కొనసాగిస్తున్నారని ఉత్తరప్రదేశ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, బీఎస్పీ అధినేత్రి మాయావతి విమర్శించారు. కేంద్ర, రాష్ట్ర పాలకులు ప్రతి సమావేశంలో, సభలో కాన్షీరామ్ గురించి, బాబాసాహెబ్ అంబేద్కర్ గురించి మాట్లాడుతారు కానీ దళిత, బహుజనుల ఆర్థిక, సామాజిక స్థితిగతుల్లో ఎలాంటి పురోగతి తీసుకురాలేకపోయారని ఆమె విమర్శించారు.
బీఎస్పీ వ్యవస్థాపకుడు కాన్షీరాం జయంతి సందర్భంగా ఏర్పాటు చేసిన ఒక సభలో మాట్లాడిన మాయావతి.. దళితులు, అణగారిన వర్గాలు, గిరిజనులు, వెనుకబడిన తరగతులు, ముస్లింలు, ఇతర మైనారిటీల అభివృద్ధి కోసం కేవలం తమ సర్కారు మాత్రమే చేయగలిగినంత చేసిందని మాయావతి చెప్పారు. బీఎస్పీ హయాంలో మాత్రమే ఆయా వర్గాలవారు గౌరవప్రదమైన జీవనం సాగించారని తెలిపారు. దళిత, బహుజనుల అభ్యున్నతి కోసం బీఎస్పీ కఠోర కృషి చేస్తున్నదని పేర్కొన్నారు.