ప్రపంచవ్యాప్తంగా పురుషులతో సమానంగా స్త్రీలు అన్నిరంగాల్లో రాణిస్తున్నా, చాలా విషయాల్లో ఇప్పటికీ వివక్ష తప్పడంలేదని తాజా అధ్యయనం చెబుతున్నది. నేషనల్ బ్యూరో ఆఫ్ ఎకనమిక్ రీసెర్చ్ ప్రచురించిన అధ్యయనం ప్రకారం.. పురుషులతో పోలిస్తే మహిళా ఆర్థికవేత్తలు, విద్యావేత్తలు సెమినార్లలో ఎక్కువ ప్రశ్నలను ఎదుర్కొంటున్నారు. ఈ అధ్యయనంలో భాగంగా 32 విశ్వవిద్యాలయాల్లో 115 మంది మహిళలు, 223 మంది పురుషులు.. మొత్తంగా 338 మంది పాల్గొన్న 462 సెమినార్లను పరిశీలించారు. ప్రతిచోటా, మూడింట రెండువంతుల ప్రశ్నలు మహిళలనే అడిగారని తేలింది. మహిళల ప్రతిభను ఓర్వలేకపోవడమే ఇలాంటి పరిస్థితికి కారణమని భావిస్తున్నారు పరిశోధకులు. ఉన్నతస్థితికి చేరుకోవడానికి పురుషులతో పోలిస్తే, మహిళలే ఎక్కువ ఆటంకాలను ఎదుర్కోవలసి వస్తున్నది. అంతేకాదు, పురుషులను అడిగిన ప్రశ్నలతో పోలిస్తే.. కఠిన ప్రశ్నలను అడగటమే కాకుండా, మహిళలను నిరుత్సాహపరిచే విధంగా ట్రైనర్లు ప్రవర్తించారని ఈ అధ్యయనం ద్వారా తెలిసింది. ఇటువంటి చర్యల వల్ల 8-12 శాతం మంది మహిళలు ఆత్మవిశ్వాసాన్ని కోల్పోయారు. మిగతావారు మాత్రం మరింత పట్టుదలగా వ్యవహరించారు. బ్యాంకింగ్, బీమా తదితర రంగాల్లో కూడా ఇదే పరిస్థితి. మహిళలు తీవ్ర వివక్షను భరిస్తున్నారు. స్త్రీలను తోటి నిపుణులుగా మోదించడానికి పురుషుడికి ధైర్యం చాలడం లేదు.