నల్లగొండ, మార్చి 10: ‘సీఎం కేసీఆర్ ఉద్యమ నేతగా ఉద్యోగులకు ఎంతో దగ్గరయ్యారు. ఆయనకు ఉద్యోగులకు మధ్య ఉన్నది పేగు బంధం. ఆయన తండ్రి అయితే ఉద్యోగులు పిల్లలు.. పిల్లలు అప్పుడప్పుడు అలక పూనటం సహజమే. అయినా మళ్లీ దగ్గరకు తీసేది తండ్రే కదా.. ఇదొక వసుదైక కుటుంబం. ఈ కుటుంబాన్ని ఎవరు ఎన్ని కుట్రలు చేసినా విడదీయలేరు’ అని వరంగల్-ఖమ్మం- నల్లగొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ టీఆర్ఎస్ అభ్యర్థి పల్లా రాజేశ్వర్రెడ్డి అన్నారు. సీఎం కేసీఆర్ సైనికుడిగా ఎమ్మెల్సీ బరిలోకి దిగిన తనకు అందరూ అండగా ఉన్నారని చెప్పారు. ఈ నెల 14న జరిగే ఎన్నికల్లో తొలి ప్రాధాన్యత ఓట్లతోనే గెలుస్తానని ధీమా వ్యక్తంచేశారు. బుధవారం నల్లగొండలోని ఎంఎన్ఆర్ ఫంక్షన్హాల్లో నల్లగొండ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్రెడ్డితో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు. సీఎం కేసీఆర్పై కొందరు బురదజల్లే ప్రయత్నం చేసినప్పటికీ ఉద్యోగులు మాత్రం ప్రభుత్వాన్ని విశ్వసిస్తూనే ఉన్నారని చెప్పారు. ఈ విశ్వాసాన్ని తండ్రి పాత్రలో ఉండి ఆయన ఎప్పుడూ పోగొట్టుకోలేదని అన్నారు. 29 శాతం పీఆర్సీ, రిటైర్మెంట్ వయస్సు మూడేండ్లు పెంచుతామని ఉద్యోగ సంఘాల నేతలతో సీఎం అన్నట్టు స్వయంగా ఉద్యోగులే వెల్లడించారని గుర్తుచేశారు. వాస్తవంగా ఈ బెనిఫిట్స్ 18 నెలల కిందనే రావాల్సి ఉండగా.. కరోనా ప్రభావం, ఎన్నికల కోడ్ మూలంగా ఆలస్యమైందే తప్ప ఇందులో ఎలాంటి దురుద్దేశం లేదని స్పష్టంచేశారు. 2015లో తనను ఎమ్మెల్సీగా ఇదే పట్టభద్రుల స్థానం నుంచి ఎమ్మెల్సీగా గెలిపిస్తే ఆరేండ్లలో ఎంతో సంతృప్తిగా పనిచేశానని చెప్పారు. ఓ వ్యక్తిలా కాకుండా నిత్యం అందుబాటులో ఉంటూ ఓ శక్తిలా పనిచేస్తున్నానని పేర్కొన్నారు. నల్లగొండ యవతకు సీఎం కేసీఆర్ చొరవ వల్ల మరింత ఉపాధి లభించనున్నదని పల్లా వెల్లడించారు. ఉమ్మడి జిల్లాలో మూడు మెడికల్ కాలేజీల వల్ల 15 వేల ఉద్యోగాలు, దామరచర్లలోని యాదాద్రి పవర్ప్లాంట్ ప్రాజెక్టు వల్ల మరో 15 వేల ఉద్యోగాలు రానున్నాయని చెప్పారు. దండు మల్కాపురంలో 458 కంపెనీల ఏర్పాటు పనులు జరుగుతున్నందున అక్కడ త్వరలో స్కిల్ డెవలప్మెంట్ కార్యక్రమాలు కొనసాగనున్నాయని తెలిపారు. దీంతో 2.11 లక్షల మందికి ఉపాధి లభించే అవకాశం ఉన్నదని పేర్కొన్నారు.
టీఆర్ఎస్ కార్యకర్తలు కొన్ని ఫేక్ ఓట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్నారని ఆరోపిస్తున్న ప్రతిపక్షాలపై పల్లా మండిపడ్డారు. ఇతర ప్రాంతాల్లో ఉద్యోగాలు చేస్తున్నవారు తమ సొంతూర్లో ఓట్లు రిజిస్ట్రేషన్ చేసుకుంటే ఫేక్ ఓట్లు ఎలా అవుతాయని ప్రశ్నించారు. ఇవాళ అనేక మంది ఏదో ఒక ప్రాంతంలో ఉద్యోగం చేస్తున్నారని, అలాంటివారు అక్కడే ఓటు వేయాలనేది ఉందా? వారి సొంతూర్లో కూడా ఓటు రిజిస్ట్రేషన్ చేసుకొని వేసుకొనే హక్కులేదా అని ప్రశ్నించారు. కార్యక్రమంలో నల్లగొండ మున్సిపల్ చైర్మన్ మందడి సైదిరెడ్డి, వైస్ చైర్మన్ అబ్బగోని రమేశ్, గ్రంథాలయ చైర్మన్ రేఖల భద్రాద్రి, ఐసీడీఎస్ ఆర్వో మాలె శరణ్యారెడ్డి తదితరులు పాల్గొన్నారు.
ఖమ్మం ఎడ్యుకేషన్, మార్చి 10: పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థి పల్లా రాజేశ్వర్రెడ్డిని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని మంత్రి పువ్వాడ అజయ్కుమార్ కోరారు. బుధవారం ఖమ్మంలో ఆర్యవైశ్యులు, పీఆర్టీయూ, మైనార్టీ వర్గాలతో నిర్వహించిన ఆత్మీయ సమావేశంలో ఆయన మాట్లాడారు. గతంలో ఏ ప్రభుత్వమూ చేయని విధంగా టీఆర్ఎస్ ఉద్యోగుల సంక్షేమానికి కృషిచేస్తున్నదని చెప్పారు. పల్లా రాజేశ్వర్రెడ్డి గెలిస్తే ఉపాధ్యాయ, విద్యార్థి, ఉద్యోగుల సమస్యలను పరిష్కరిస్తారని పేర్కొన్నారు. టీఆర్ఎస్ గెలుపు.. అభివృద్ధికి మలుపు అన్నారు. ఆయా కార్యక్రమాల్లో మాజీ ఎమ్మెల్సీ పూల రవీందర్, సుడా చైర్మన్ బచ్చు విజయ్కుమార్, ఆర్జేసీ కృష్ణ, పీఆర్టీయూ నేతలు మోత్కూరి మధు, కనకదుర్గ, రమణ, సర్వర్మియా, రవాన్, వై వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.
బీజేపీవన్నీ మోసపూరిత రాజకీయాలు. కేంద్ర ప్రభుత్వం వల్ల అదానీ, అంబానీల ఆస్తులు పెరిగాయి తప్ప ఒక్క హామీ అయినా నెరవేరిందా? మాయమాటలు చెప్పి అధికారం చేపట్టిన నాటినుంచి కొత్త ఉద్యోగాల మాట దేవుడెరుగు, ఉన్న ఉద్యోగాలను ఊడగొట్టి వేల మందిని నిరుద్యోగులుగా మార్చి రోడ్డున పడేసింది. గ్యాస్, డీజిల్, పెట్రోల్ ధరలు ఇష్టాను సారంగా పెంచి పేద, మధ్య తరగతి ప్రజలపై మరింత భారం పెంచింది. బీజేపీ నేతలు తమ స్థాయిని మరిచిపోయి వీధి రౌడీల్లా ప్రవర్తిస్తున్నారు. తెలంగాణలో ఉన్నన్ని సంక్షేమ పథకాలు గుజరాత్లో ఉన్నాయో, లేదో తెలుసుకొని మాట్లాడితే మంచిది. అజ్ఞానంతో ఇక్కడి బీజేపి నాయకులు రాజకీయ లబ్ధి కోసం చిల్లర వేశాలు వేస్తున్నారు. వారిని ప్రజలే తరిమికొట్టే పరిస్థితి వస్తుంది. పల్లా రాజేశ్వర్రెడ్డికి పూర్తి మద్దతు ప్రకటిస్తూ అన్ని సంఘాల వారు స్వచ్ఛందంగా ఆత్మీయ సమావేశాలు ఏర్పాటు చేసుకోవడం అభినందనీయం.
– జగదీశ్రెడ్డి, విద్యుత్తుశాఖ మంత్రి