ప్రత్యేక ప్రతినిధి, మార్చి 10 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగులకు వేతన సవరణ అనంతరం ఏడాదికి అదనంగా కనీసం రూ.10వేల కోట్లు అవసరమవుతాయని ఆర్థికశాఖ అంచనా వేస్తున్న ది. కనీసం 29 శాతం ఫిట్మెంట్ ఇచ్చినా ఏ మేరకు నిధులు సమకూర్చుకోవాలన్నదానిపై అధికారులు కసరత్తు చేస్తున్నారు. అసెంబ్లీలో సీఎం కేసీఆర్ చేయబోయే ప్రకటన ఆధారంగా బడ్జెట్ లెక్కలు మారిపోనున్నాయి. కరోనా కారణంగా గతేడాది రాష్ట్రం ఆర్థికపరంగా తీవ్ర సంక్షుభిత పరిస్థితినెదుర్కొన్నది. జీతాలపెంపుతో రెవెన్యూ వ్య యం పెరుగనున్న నేపథ్యంలో వ్యయం, ఆదాయాన్ని సమతుల్యం చేయడం అధికారులకు సవాలుగా మారింది. అసెంబ్లీలో బడ్జెట్ ప్రతిపాదనలకు సిద్ధమవుతున్న ఆర్థికశాఖ ఇప్పటివరకూ ఉన్న అంచనాలను భారీగా సవరించాల్సి వస్తున్నది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2020-21)లో రెవె న్యూ రాబడులు రూ.1,43,151కోట్లుగా ఉంటుందని, ఖర్చులు రూ.1,38,669 కోట్లు ఉండవచ్చని బడ్జెట్లో అంచనా వేశారు. కానీ కరోనా కారణంగా రాబడులు 60 శాతానికే పరిమితమయ్యాయి. దీనికితోడు కేంద్రం నుంచి రావాల్సిన పన్నుల వాటాలో భారీగా గండిపడటం, సేవా రం గాలు దెబ్బతినడంతో ఆర్థిక పరిస్థితి సంకటంగా మారింది. ప్రస్తుత రెవెన్యూ వ్యయం లో ఉద్యోగుల జీతభత్యాలకే రూ.35 వేల కోట్ల వరకు వెచ్చిస్తున్నారు. వీటిలో వేతనాలు రూ.24,896 కోట్లు కాగా, పెన్షన్ చెల్లింపులు రూ.10,065 కోట్లు ఉన్నాయి. తాజాగా వేతనాలను సవరిస్తే అదనంగా మరో రూ.10వేల కోట్ల వరకు అవసరమవుతాయని అంచనా వేస్తున్నారు. ఇవికాకుండా ప్రభుత్వం ఈ ఏడాది కొత్తగా మరో 50వేల మందికి ఉపాధి కల్పించాలని భావిస్తున్నది. ఆర్థికంగా గడ్డు పరిస్థితిని ఎదుర్కొంటున్న సమయంలోనూ ఉద్యోగులకు వేతనాలు పెంచడం, కొత్త ఉద్యోగాలు భర్తీ చేయాలన్న ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయం సాహసోపేతమేనని ఆర్థికనిపుణులు వ్యాఖ్యానిస్తున్నారు.
కరోనాతో ఆర్థిక వ్యవస్థ దెబ్బతిన్నది. ఇలాంటి పరిస్థితుల్లో ప్రభుత్వ ఉద్యోగులకు పీఆర్సీ 29 శాతం వరకు ఫిట్మెంట్ ప్రకటించడానికి సీఎం కేసీఆర్ తీసుకున్న నిర్ణయం సాహసోపేతం. దీంతో అవుట్సోర్సింగ్, చిరుద్యోగులకు కూడా ఎంతో లబ్ధి చేకూరుతుంది. ప్రభుత్వ ఉద్యోగుల పదవీ విరమణ వయసును 58 నుంచి 61 ఏండ్ల వరకు పెంచి నెలాఖరు నుంచి అమల్లోకి వస్తుందని ప్రకంటించడంపై ఉద్యోగులందరూ ఆనందం వ్యక్తంచేస్తున్నారు. – మల్లేశ్, ఎంపీడీవో, నిజామాబాద్ రూరల్ మండలం
ముఖ్యమంత్రి కేసీఆర్ ఉద్యోగుల వెంటే ఉన్నారు. ఆయనకు ఉద్యోగుల సాదక బాధకాలు అన్నీ తెలుసు. ఫిట్మెంట్, రిటైర్మెంట్ వయసు పెంపు సంతోషకరం. ఆయన ఉద్యోగుల పక్షపాతని మరోసారి రుజువైంది. ముఖ్యమంత్రి కేసీఆర్కు ఉద్యోగుల పక్షాన ప్రత్యేక ధన్యవాదాలు. కేసీఆర్ చేస్తున్న మేలు మరువలేనిది.
– జీ వెంకటరమణ, నయాబ్ తాసిల్దార్, వెల్దండ మండలం, నాగర్కర్నూల్ జిల్లా
రాష్ట్రమంతటా ఉద్యోగులు, ఉపాధ్యాయులు హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తున్నారు. చర్చలకు పిలిచి ఆప్యాయంగా మాట్లాడటం చాలా సంతోషాన్నిచ్చింది. కాంట్రాక్ట్, ఔట్సోర్సింగ్ ఉద్యోగుల క్రమబద్ధీకరణకు ప్రయత్నిస్తే కొంతమంది రాజకీయ ప్రయోజనాల కోసం అడ్డుకున్నారు. అడ్డుకున్నవారి భరతం పట్టాలి. సీఎం కేసీఆర్ నేతృత్వంలో ప్రతి సమస్యకు పరిష్కారం దొరుకుతుంది.
– కారం రవీందర్రెడ్డి, టీఎన్జీవో మాజీ అధ్యక్షుడు
పీఆర్సీ, ఉద్యోగుల పదవీ విరమణ వయసును పెంపు నిర్ణయాన్ని అసెంబ్లీలోనే ప్రకటిస్తామని సీఎం కేసీఆర్ క్లియర్గా చెప్పారు. అన్ని వస్తువుల ధరలు భారీగా పెరిగినందున .. జీతం కూడా ఎక్కువగా ఉండాలని ఆరోజు నుంచి ఈ రోజు వరకు వెనక్కు చూసుకోకుండా కుటుంబసభ్యులందరికీ సరిపోయేంత జీతాలు పెంచారు. అందరు సౌకర్యంగా ఉద్యోగాలు చేసుకునే అవకాశాన్ని కల్పించారు.
– మమత, టీజీవో అధ్యక్షురాలు
సీఎం కేసీఆర్ తీసుకున్న నిర్ణయంపై ఉద్యోగులందరూ సంతోషాన్ని వ్యక్తంచేస్తున్నారు. ఉద్యోగులంతా ప్రతి సంక్షేమ పథకాన్ని నెత్తిన పెట్టుకొని గడపగడపకు తిరిగినం. ప్రభుత్వానికి అండగా ఉంటాం. మాట ఇస్తున్నాం. టీఆర్ఎస్ అభ్యర్థులను గెలిపించుకొంటాం. – ముజీబ్, టీఎన్జీవో హైదరాబాద్ జిల్లా అధ్యక్షుడు