నైపితా: మయన్మార్లో ఓ క్రైస్తవ సన్యాసి చూపిన తెగువ ఇప్పుడు అందర్నీ అట్రాక్ట్ చేస్తున్నది. సైనిక తిరుగుబాటును వ్యతిరేకిస్తూ కాచిన్ రాష్ట్ర రాజధాని మిట్కినాలో నిరసన చేపడుతున్న వారిపై సైనిక దళాలు తుపాకులు ఎత్తిపెట్టారు. ఆ సమయంలో అక్కడ ఉన్న క్రైస్తవ సన్యాసిని ఆన్ రోజ్ ను తవాంగ్.. ఆ సాయుధ సైనికులను అడ్డుకున్నది. మోకాళ్లపై నిలబడి.. ఆ చిన్నారులను వదిలేయండి.. కావాలంటే మీరు నన్ను కాల్చేయండి అంటూ ఆమె దళాలతో వేడుకున్నది. క్యాథిలక్ నన్ అయిన ఆన్ రోజ్.. తెల్లటి దుస్తుల్లో పోలీసుల్ని అభ్యర్థిస్తున్న ఫోటో ఇప్పుడు ఇంటర్నెట్లో వైరల్గా మారింది. బౌద్ధ దేశమైన మయన్మార్లో ఆ సన్యాసిపై ప్రశంసలు కురుస్తున్నాయి. ఫిబ్రవరి ఒకటో తేదీ మయన్మార్కు చెందిన జుంటా సైన్యం ప్రభుత్వాన్ని ఆధీనంలోకి తీసుకున్నది. ఆంగ్ సాన్ సూకీతో పాటు దేశాధినేతలను నిర్బంధించింది. ఆ తిరుగుబాటును వ్యతిరేకిస్తూ మయన్మార్లో ఇప్పుడు దేశమంతా నిరసనలు హోరెత్తుతున్నాయి. మిట్కినా నగరంలోనూ ప్రదర్శలు జరిగాయి. ఆ ప్రదర్శనకారులను చెదరగొట్టేందుకు భారీ స్థాయిలో సైనిక బలగాలు వచ్చాయి. ఆందోళనకారులపై ఫైరింగ్ జరపకుండా ఆ సన్యాసిని అడ్డుకున్నది. కానీ ఆమె కళ్ల ముందే అప్పటికే సైనికులు ఇద్దర్ని షూట్ చేసి చంపేశారు. నా కళ్ల ముందు ఏది జరిగినా చూస్తూ ఉండలేను, ఆ ఘటనలను అడ్డుకుంటాని నన్ ఆన్ రోజ్ తెలిపింది. సైనిక తిరుగుబాటును వ్యతిరేకిస్తూ ఇప్పటికే మయన్మార్లో 60 మందికిపైగా ప్రాణాలు కోల్పోయారు.