న్యూఢిల్లీ: కరోనా మహమ్మారి ప్రభావం నుంచి తప్పించుకునేందుకు దేశవ్యాప్తంగా 10,113 కంపెనీలు స్వచ్ఛందంగా కార్యకలాపాలను నిలిపివేశాయని కేంద్ర కార్పొరేట్ వ్యవహారాలశాఖ సహాయ మంత్రి అనురాగ్ సింగ్ ఠాకూర్ చెప్పారు. కరోనాను నియంత్రించడానికి కేంద్ర ప్రభుత్వం లాక్డౌన్ విధించడంతో ఆ కంపెనీలు గతేడాది ఏప్రిల్ నుంచి ఈ ఏడాది ఫిబ్రవరి వరకు కార్యకలాపాలను నిలిపివేయడంతో ఆర్థిక లావాదేవీలకు తీవ్ర అంతరాయం కలిగిందన్నారు. కంపెనీల చట్టం-2013లోని 248 (2) సెక్షన్ కింద సదరు సంస్థలు ఈ కార్యకలాపాలను నిలిపివేశాయని చెప్పారు.
లోక్సభలో సోమవారం ఒక సభ్యుడు అడిగిన ప్రశ్నకు మంత్రి అనురాగ్ సింగ్ ఠాకూర్ సమాధానమిస్తూ.. అత్యధికంగా ఢిల్లీలో 2,394 కంపెనీలు, ఉత్తరప్రదేశ్లో 1,936, కర్ణాటకలో 836, చండీగఢ్లో 501, రాజస్థాన్లో 479, తెలంగాణలో 404, కేరళలో 307,జార్ఖండ్లో 137, మధ్యప్రదేశ్లో 111, బీహార్లో 104 సంస్థలు పని చేయలేదని వివరించారు.