న్యూఢిల్లీ: ప్రముఖ గోల్డ్ అండ్ ఫైనాన్సియల్ సంస్థ ముత్తూట్ గ్రూప్ చైర్మన్ ఎంజీ జార్జ్ ముత్తూట్ (71) శుక్రవారం కన్నుమూశారు. ఇంట్లో మెట్లపై నుంచి జారిపడటంతో ఆయనను చికిత్స కోసం ఢిల్లీలోని ఎస్కార్ట్స్ దవాఖానకు తరలించారు. దవాఖానలో ఆయన చికిత్స పొందుతూ సాయంత్రం 6:58 గంటలకు చనిపోయారు. జార్జ్ నాయకత్వంలో ముత్తూట్ ఫైనాన్స్ లిమిటెడ్.. ముత్తూట్ గ్రూప్ ప్రతిష్ఠాత్మక సంస్థగా అవతరించింది.
దేశంలోని బ్యాంకింగేతర ఆర్థిక సంస్థ (ఎన్బీఎఫ్సీ)ల్లో అతిపెద్ద గోల్డ్ ఫైనాన్సింగ్ కంపెనీగా ముత్తూట్ ఎదిగింది. ఇక ముత్తూట్ గ్రూప్.. ప్రపంచవ్యాప్తంగా 5,500లకుపైగా శాఖలను విస్తరించింది. 20కిపైగా విభిన్న వ్యాపారాల్లోకీ అడుగుపెట్టింది. గతేడాది ఫోర్బ్స్ ఆసియా మ్యాగజైన్ సంపన్నుల జాబితాలో భారత్ తరఫున జార్జ్ ముత్తూట్ 44వ స్థానంలో నిలిచారు.
దేశంలోనే ధనవంతుడైన మలయాళీగా కూడా జార్జే ఉన్నారు. కాగా, ఆయనకు ముగ్గురు కుమారులు, రెండో కుమారుడు 2009లో హత్యకు గురయ్యారు. పెద్ద కుమారుడు జార్జ్ ఎం జార్జ్ గ్రూప్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా ఉండగా, చిన్న కుమారుడు అలెగ్జాండర్ జార్జ్ డైరెక్టర్గా కొనసాగుతున్నారు. భార్య సారా జార్జ్ ముత్తూట్ ఢిల్లీలోని సెయింట్ జార్జ్ హై స్కూల్ డైరెక్టర్గా ఉన్నారు.