స్వరాష్ర్టాన దినదినాభివృద్ధి చెందుతున్న పట్టణం
అరవయ్యేండ్ల అభివృద్ధి కలను సాకారం చేసిన మంత్రి జగదీశ్రెడ్డి
బొడ్రాయిబజార్, జూన్ 17:అరవై ఏండ్ల పోరాట ఫలితంగా సాకారమైన ప్రత్యేక రాష్ట్రంలో సూర్యాపేట అభివృద్ధి బాట పట్టింది. జిల్లా కేంద్రంగా మారడంతోపాటు దినదినాభివృద్ధి చెందుతూ కొత్తందాలతో రూపు రేఖలు మార్చుకుంటున్నది. మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డి కృషితో అన్ని రంగాల్లోనూ అభివృద్ధి చెందుతూ రాష్ట్ర స్థాయిలో ప్రత్యేకతను చాటుకుంటున్నది. –
నాడు సమైక్య పాలకుల చేతుల్లో తీవ్ర వివక్షకు గురైన సూర్యాపేటను తెలంగాణ ప్రభుత్వం జిల్లా కేంద్రంగా చేసి అభివృద్ధికి నాంది పలికింది. 60 ఏండ్లలో ఎక్కడా అభివృద్ధి కానరాని సూర్యాపేటను జిల్లా కేంద్రంగా మార్చడమే కాకుండా సకల సౌకర్యాలు కల్పించి రాష్ట్రంలోనే ముందు వరుసలో ఉంచింది. ఇక్కడ అభివృద్ధి తెలంగాణ రాష్ట్రం రాక ముందు, వచ్చిన తర్వాత తేడా స్పష్టంగా కనిపిస్తున్నది.
మంత్రి జగదీశ్రెడ్డి అత్యధిక నిధులు తీసుకొస్తూ రాష్ట్రంలోనే ఆదర్శ పట్టణంగా తీర్చిదిద్దేందుకు చేస్తున్నారు. జిల్లా కేంద్రానికి ఉండాల్సిన సకల సౌకర్యాలను ఒక్కొక్కటిగా సమకూరుస్తూ అభివృద్ధి ఏ ఒక్క దిక్కుకో పరిమితం చేయకుండా నలుదిక్కులకూ విస్తరించారు. జిల్లా కేంద్రానికి మెడికల్ కళాశాల, ఇంటిగ్రేటెడ్ మార్కెట్, సద్దుల, పుల్లారెడ్డి చెరువులు మినీ ట్యాంక్బండ్లుగా మార్పు, డబుల్ బెడ్రూం ఇండ్లు, ఎస్పీ, కలెక్టర్ కార్యాలయాలు, జనరల్ దవాఖాన ఆధునీకరణ, విద్యుత్ స్టోర్తోపాటు కమ్యూనిటీ హాళ్లు, వైకుంఠధామాలు, పార్కులు, ఎస్సీ స్టడీ సర్కిల్ ఏర్పాటు అభివృద్ధ్ది చరిత్రలో మైలురాళ్లుగా చెప్పవచ్చు. 30 ఏండ్లు పాలకుల చేతుల్లో నలిగిపోయిన ప్రధాన రహదారి వెడల్పు పనులను సైతం చేయించి పట్టణాన్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తున్నారు. ఇలా ఎన్నో అభివృద్ధి పనులను చేపట్టి జిల్లా కేంద్రానికి ఉండాల్సిన సకల హంగులను సమకూర్చుకోవడం మంత్రి జగదీశ్రెడ్డితోనే సాధ్యమైంది.
ఆహ్లాదం పంచుతున్న మినీ ట్యాంక్బండ్
సూర్యాపేట జిల్లా కేంద్రంలోని సద్దుల చెరువు (చౌదరి చెరువు) అంటే తెలియని వారుండరు. అది జిల్లా కేంద్రానికి నడిబొడ్డున హిందూ శ్మశాన వాటికను ఆనుకుని ఉంటుంది. రాష్ట్రం ఏర్పడక ముందు చెరువు కట్ట చుట్టూ ముళ్ల కంచెలు అల్లుకుపోవడం, పక్కనే శ్మశానవాటిక ఉండడంతో పగటిపూట సైతం అటు వైపుగా ఒంటరిగా వెళ్లేందుకు భయపడేవారు. స్వరాష్ట్రంలో మంత్రి జగదీశ్రెడ్డి ప్రత్యేకంగా రూ.19కోట్ల నిధులు తీసుకొచ్చి మినీ ట్యాంక్బండ్గా మార్చి సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు. కట్ట చుట్టూ సుమారు 3 కి.మీ. మేర సీసీ రోడ్డు, స్టీల్ రెయిలింగ్ ఏర్పాటు చేయడంతో నాడు పగటి పూట ఒంటరిగా వెళ్లేందుకు భయపడినవారు.. నేడు చీకటి పడినా ధైర్యంగా వెళ్తున్నారు. ఈ మినీ ట్యాంక్బండ్పై ఉదయం, సాయంత్రం వేళల్లో పట్టణ ప్రజలు ఆహ్లాదకర వాతావరణంలో ప్రకృతిని ఆస్వాదిస్తూ వాకింగ్, వ్యాయామాలు చేస్తున్నారు. పుల్లారెడ్డి చెరువును కూడా మినీ ట్యాంక్బండ్గా మార్చేందుకు రూ.17.50కోట్లు కేటాయించగా, పనులు పురోగతిలో ఉన్నాయి. గత ప్రభుత్వాలు చేయలేని ఎన్నో పనులను స్వరాష్ట్రంలో చేసి చూపుతుండడంపై ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.