6 నెలల్లోనే విద్యుత్ సమస్య తీర్చిన ఘనత సీఎం కేసీఆర్దే
రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్రెడ్డి
సూర్యాపేటలో విద్యుత్ స్టోర్స్ ప్రారంభం
అన్ని రంగాలకు 24 గంటల కరంట్ ఇస్తున్నది తెలంగాణే
ఉమ్మడి రాష్ట్రంలో వారాల తరబడి చీకట్లో మగ్గినం
కిరోసిన్ బుడ్లు, కొవ్వొత్తుల వెలుగుల్లో చదువుకున్నం
సూర్యాపేట టౌన్, జూలై 15 : రైతాంగానికి నిరంతర ఉచిత విద్యుత్ అందించడంలో యావత్ దేశంలోనే మనం ముందున్నామని.. అన్ని రంగాలకు 24 గంటల కరంట్ అందిస్తున్న ఏకైక రాష్ట్రంగా తెలంగాణ సరికొత్త రికార్డులు సృష్టిస్తున్నదని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డి అన్నారు. సూర్యాపేట జిల్లా కేంద్రంలోని జమ్మిగడ్డలో రూ.2 కోట్లతో ఏర్పాటు చేసిన విద్యుత్ స్టోర్స్ను రాజ్యసభ సభ్యుడు బడుగుల లింగయ్య యాదవ్, టీఎస్ ఎస్పీడీసీఎల్ సీఎండీ రఘుమారెడ్డితో కలిసి గురువారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ అభివృద్ధిలో తెలంగాణతో పోటీ పడే స్థితిలో ఏ రాష్ట్రమూ లేదన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో కరంట్ ఉంటే వార్త అయ్యేదని, ప్రస్తుతం కరంట్ పోతే వార్త అని పేర్కొన్నారు. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడితే తెలంగాణ చీకటి మయమవుతుందని నాడు ఎద్దేవా చేసిన నాయకుల దిమ్మ తిరిగేలా నిరంతర విద్యుత్ అందిస్తున్నామన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో విద్యుత్ సరఫరా సరిగ్గా ఉండక వారాల తరబడి చీకట్లో మగ్గిన సందర్భాలు అనేకమంటూ కిరోసిన్ బుడ్లు, కొవ్వొత్తుల వెలుగుల్లో చదువుకున్న రోజులను గుర్తు చేశారు.
మరణం చివరి అంచుల వరకూ వెళ్లి పోరాడి సాధించిన రాష్ట్రంలో 6 నెలల కాలంలోనే విద్యుత్ సమస్యలను పరిష్కరించిన ఘనత సీఎం కేసీఆర్దేనన్నారు. అందుకే అన్నిరాష్ర్టాలు ఆయన లాంటి నాయకత్వాన్ని కోరుకుంటున్నాయన్నారు. కేవలం ఏడేండ్లలోనే అన్ని రంగాలను అభివృద్ధి పథంలో నడుపుకుంటూ ఎంతో ప్రగతి సాధించుకున్నామని చెప్పారు. విపక్షాలు ఎప్పటికీ వాస్తవాలను ఒప్పుకోవని.. ఇంత అభివృద్ధి జరిగినా.. జీర్ణించుకోలేక ఇంకా ఆంధ్రా నాయకులకు తొత్తులుగా ఉంటూ అర్థంలేని ఆరోపణలు చేస్తూ ప్రజల దృష్టిలో మరింత దిగజారుతున్నారని పేర్కొన్నారు. ప్రపంచంలోని ఏ పారిశ్రామిక వేత్త అయినా మన దేశానికి రావాలన్నా ముందుగా చూసేది తెలంగాణ వైపే అన్నారు. రాష్ట్రంలో విద్యుత్ పుష్కలంగా అందడమే ఇందుకు ప్రధాన కారణమన్నారు. నాడు తెలంగాణకు పరిశ్రమలేవీ రావని విపక్ష నాయకులు నవ్వితే.. నేడు 50 వేలకు పైగా పరిశ్రమలు రావడంతో అంతా ముక్కున వేలేసుకుంటున్నారని అన్నారు. విద్యుత్ శక్తిని అందరికీ అందించడంలో లైన్మెన్ నుంచి సీఎండీల వరకు చేస్తున్న కృషి అద్భుతమన్నారు.
ఈ సందర్బంగా అందరికీ ప్రత్యేక అభినందనలు తెలిపారు. జిల్లా ప్రజలకు విద్యుత్ సేవలు మరింత చేరువ చేయడంతో పాటు సకాలంలో సమస్యలు తీర్చాలనే లక్ష్యంతో సూర్యాపేట జిల్లా కేంద్రంలో రూ. 2 కోట్ల వ్యయంతో ప్రత్యేక స్టోర్ ఏర్పాటు చేసినట్లు మంత్రి తెలిపారు. అంతకు ముందు పలుచోట్ల మొక్కలు నాటి, ఇండోర్, అవుట్ డోర్ స్టోర్స్ను సందర్శించారు. జిల్లా కేంద్రంలో మరో రూ. 2 కోట్ల వ్యయంతో ఎస్ఈ కార్యాలయం కూడా త్వరలోనే ఏర్పాటు చేయనున్నట్లు మంత్రి తెలిపారు. కార్యక్రమంలో రాజ్యసభ సభ్యుడు బడుగుల లింగయ్య యాదవ్, టీఎస్ఎస్పీడీసీఎల్ సీఎండీ రఘుమారెడ్డి, డైరెక్టర్ మదన్మోహన్, మున్సిపల్ చైర్పర్సన్ పెరుమాళ్ల అన్నపూర్ణ, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ నిమ్మల శ్రీనివాస్ గౌడ్, ఎస్ఈ పాల్రాజ్, ఏ. శ్రీనివాస్, డీఈలు, ఏఈలు పాల్గొన్నారు.