వర్షపు నీటితో నిండిన రైల్వే అండర్పాస్
అవస్థలు పడుతున్న ప్రజలు
మాడ్గులపల్లి, జూలై 31 : ప్రజలు రైలు ప్రమాదాల బారిన పడకుండా ఉండేందుకు రైల్వే క్రాసింగ్ల వద్ద అండర్పాస్ను నిర్మిస్తున్నారు. కానీ వర్షం కురిసినప్పుడు నీరు బయటకు వెళ్లేందుకు సరైన ఏర్పాట్లు చేయక పోవడంతో అవి కాల్వలను తలపిస్తున్నాయి. మార్గంలోనే సుమారు 7 నుంచి 8 ఫీట్ల మేర నీరు నిల్వ ఉండడంతో రాకపోకలు నిలిచి పోతున్నాయి. ఆయా గ్రామాల వారు మండల కేంద్రానికి రావాలంటే చుట్టూ తిరిగి వెళ్లాల్సిన దుస్థితి నెలకొంది.
ప్రయాణం మరింత దూరం
కుక్కడం నుంచి అభంగాపురం వెళ్లే రోడ్డులో రైల్వే క్రాసింగ్ వద్ద నిర్మించిన అండర్ పాస్లో ప్రస్తుతం 5 ఫీట్ల మేర నీళ్లు నిలిచి ఉన్నాయి. ఇటీవల కురిసిన వర్షాలకు అందులో చేరిన నీరు బయటకు వెళ్లే మార్గం లేకపోవడంతో అందులోనే ఉండిపోయాయి. ఫలితంగా ఈ మార్గంలో రాకపోకలు నిలిచిపోయాయి. అభంగాపురం గ్రామస్తులు పెద్దదేవులపల్లి మీదుగా త్రిపురారం వెళ్లాలంటే మరో 5కిలోమీటర్లు అధికంగా ప్రయాణించాల్సి వస్తున్నది. దీంతో పాటు గజలాపురం, పూసలపహాడ్ గ్రామాలకు వెళ్లేవారు, ఆయా గ్రామాల నుంచి కూలి వెళ్లే వారు నిత్యం మూడు కిలోమీటర్లు అదనంగా ప్రయాణించాల్సి వస్తున్నది. మాడ్గులపల్లి, కుక్కడం గ్రామాలకు రావాలంటే రైల్వే ట్రాక్ వెంట ఉన్న మట్టిరోడ్డే దిక్కవుతున్నది. అది కూడా గుంతలమయంగా ఉండడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు.
అంబులెన్స్కూ దారి కరువు
అండర్పాస్ పూర్తిగా నీటితో నిండిపోవడంతో కార్లు, బస్సులు, ఆటోలు కనీసం ఆంబులెన్స్ వెళ్లేందుకు కూడా దారి లేకుండా పోయింది. ఆయా గ్రామాలకు వెళ్లాలన్నా, ఆయా గ్రామాల వారు ఇతర ప్రాంతాలకు రావాలన్నా 12 కిలోమీటర్ల దూరం ప్రయాణించి అద్దంకి నార్కట్పల్లి హైవేలో ఉన్న అన్నపరెడ్డిగూడెం వరకు వెళ్లాల్సి వస్తున్నది. మాడ్గులపల్లికి రావడానికి 21 కిలోమీటర్ల దూరం ప్రయాణించాల్సి వస్తున్నది.
పట్టించుకోని రైల్వే అధికారులు
వర్షం కురిసినప్పుడు ఆ నీరు బయటకు వెళ్లేందుకు సరైన మార్గం ఏర్పాటు చేయడం లేదు. అందులో చేరిన నీటిని బయటకు తోడి వేయడం వంటి పనులు చేపట్టడంలో రైల్వేశాఖ అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారు. స్థానిక ప్రజాప్రతినిధులు ఈ విషయాన్ని అనేక సందర్భాల్లో రైల్వేశాఖ దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకునే వారు కరువయ్యారు. దీంతో వర్షం కురిసిన నెల రోజుల వరకు కూడా అండర్పాస్లో నీరు నిల్వ ఉంటున్నాయి. ఈలోపు గ్రామంలో ఏదైన ప్రమాదం జరిగి కనీసం అంబులెన్స్ రావాలన్నా అదనంగా 15 కిలోమీటర్లు ప్రయాణించాల్సిందే.
చాలా ఇబ్బందిగా ఉంది
అండర్ పాస్ సమస్యని పలుమార్లు రైల్వే అధికారుల దృష్టికి తీసుకెళ్లాం. అయినా పట్టించుకోవడం లేదు. వర్షం వచ్చిన ప్రతి సారీ ఇదే పరిస్థితి. గ్రామానికి అబులెన్స్ కూడా రాని పరిస్థితి. అధికారులు అండర్పాస్ సమస్యను పరిష్కరించాలి. రైల్వే ట్రాక్ వెంట ఉన్న మట్టి రోడ్డును సరిచేస్తే మా సమస్య కొంత మేర తీరుతుంది.
రామచంద్రమ్మ, అభంగాపురం సర్పంచ్