ఏడో విడుత లక్ష్యంలో 21లక్షలు పూర్తి
క్షేత్రస్థాయిలో కలెక్టర్ ఆకస్మిక తనిఖీలు
నేడు మంత్రి గుంటకండ్లకు బర్త్ గిఫ్ట్గా
2 లక్షల మొక్కలు నాటేందుకు ఏర్పాట్లు
సూర్యాపేట, జూలై 17 (నమస్తే తెలంగాణ): అటవీ శాతాన్ని పెంచడంతోపాటు పర్యావరణ పరిరక్షణే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న హరిత హారం కార్యక్రమం జిల్లా అంతటా ఉద్యమంలా సాగుతున్నది. ప్రజాప్రతినిధులు, అధికారుల నుంచి సామాన్యుల వరకు ఈ మహా క్రతువులో భాగస్వాములు అవుతున్నారు. కలెక్టర్ వినయ్కృష్ణారెడ్డి నిత్యం క్షేత్రస్థాయికి వెళ్లి ఆకస్మిక తనిఖీలు చేస్తున్నారు. ఆగస్టు చివరి నాటికి జిల్లావ్యాప్తంగా 83 లక్షల మొక్కలు నాటాలన్నది ఏడో విడుత లక్ష్యం కాగా, ఇప్పటివరకు 21లక్షలు పూర్తయినట్లు అధికారిక లెక్కలు చెప్తున్నాయి. అందులో పంచాయతీల్లో 16 లక్షలు, మున్సిపాలిటీల్లో 5 లక్షల మొక్కలు నాటారు. జిల్లా మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డి పుట్టిన రోజు సందర్భంగా ఆదివారం జిల్లావ్యాప్తంగా 2 లక్షల మొక్కలు నాటుతుండగా, అందులో ఒక్క సూర్యాపేట నియోజకవర్గంలోనే 60వేలకుపైగా వేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.మంత్రి జగదీశ్రెడ్డి పుట్టిన రోజు సందర్భంగా దురాజ్పల్లిలోని లక్ష్మీనగర్ టౌన్షిప్లో గతేడాది నాటిన మొక్కలు పెరిగి ప్రస్తుతం ఇలా చిట్టడవిని తలపిస్తున్నాయి.
‘మొక్కలు నాటండి.. నాటించండి.. నాటిన ప్రతి మొక్కనూ సంరక్షించండి’ నినాదంతో తెలంగాణకు హరితహారంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములవుతున్నారు. ప్రభుత్వ సంకల్పానికి తోడు అందివచ్చిన ప్రతి సందర్భాన్నీ మొక్కలు నాటేందుకు వినియోగించి మధుర జ్ఞాపకంగా మిగుల్చుకుంటున్నారు. అటవీ శాతాన్ని పెంచాలనే లక్ష్యంతో ఇప్పటికే గడిచిన ఆరు విడుతల్లో సుమారు 5.76కోట్ల మొక్కలు నాటగా వాటిలో 70శాతం బతికాయి. ప్రతి గ్రామంలో స్థలం సేకరించి పల్లె ప్రకృతి వనం పేరిట పండ్లు, పూల మొక్కలు నాటడంతో పచ్చదనం వికసిస్తున్నది.
జోరుగా ఏడో విడుత…
రాష్ట్రవ్యాప్తంగా ఈ నెల 1న ప్రారంభమైన ఏడో విడుత హరితహారం ఉద్యమంలా కొనసాగుతున్నది. జూలై 1 నుంచి 10వరకు పల్లె, పట్టణ ప్రగతిలో భాగంగా నిత్యం మొక్కలు నాటుకున్నాయి. ప్రజాప్రతినిధులు, అధికారులు, అన్ని పార్టీల నాయకులతో పాటు సాధారణ ప్రజలు సైతం పాల్గొని మొక్కలు నాటుతున్నారు. జిల్లా కలెక్టర్ వినయ్కృష్ణారెడ్డి జిల్లా వ్యాప్తంగా పర్యటిస్తూ నాటిన మొక్కలు, నాటబోతున్న మొక్కల కోసం గుర్తించిన స్థలాలు, నర్సరీల్లో ఉన్న మొక్కలను ఆకస్మికంగా పరిశీలించారు. జిల్లా వ్యాప్తంగా ఈ ఏడాది 87లక్షల మొక్కలు లక్ష్యం పెట్టుకోగా ఇప్పటికే 21 లక్షల మొక్కలు నాటారు. వీటిలో 16లక్షలు పంచాయతీల్లో నాటగా మరో 5లక్షల మొక్కలు మున్సిపాలిటీల్లో నాటారు. ఆగస్టు చివరి వరకు లక్ష్యం చేరుకుంటామని కలెక్టర్ తెలిపారు.
ఒక్కరోజే 2లక్షల మొక్కలు..
జిల్లా మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డి పుట్టిన రోజును పురస్కరించుకొని ఈ నెల 18న జిల్లా వ్యాప్తంగా రెండు లక్షల మొక్కలు నాటేందుకు ప్రణాళికలు సిద్ధమయ్యాయి. ఒక్క సూర్యాపేట నియోజకవర్గంలోనే 60వేల మొక్కలు నాటేందుకు రహదారుల వెంట, ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలు, కార్యాలయాలు, రైతుల వ్యవసాయ గట్ల వెంబడి మొక్కలు నాటడానికి గుంతలు సిద్ధం చేశారు. అదే విధంగా పురపాలక, ఐటీ శాఖల మంత్రి కేటీఆర్ పుట్టిన రోజును పురస్కరించుకొని ఈ నెల 24న ముక్కోటి వృక్షార్చనలో భాగంగా పెద్ద ఎత్తున మొక్కలు నాటేందుకు చర్యలు చేపట్టారు.
ఘనమైన జ్ఞాపకం
మంత్రి జగదీశ్రెడ్డి జన్మదినం సందర్భంగా గతేడాది సూర్యాపేట జిల్లా కేంద్రంలోని 5వ వార్డు ప్రజలు మియావాకి ఫారెస్ట్ తరహాలో రెండు ఎకరాల్లో 10వేల మొక్కలు నాటారు. జగదీషన్న పట్టణ ప్రకృతివనంగా నామకరణం చేశారు.