ఆత్మకూర్.ఎస్, జూలై 18 : 60 ఏండ్ల సమైక్య పాలనలో మండలాన్ని ఏ మాత్రమూ అభివృద్ధి చేయలేకపోయారు. కానీ రాష్ట్రం ఏర్పడిన ఆరేళ్లలోనే మండల అభివృద్ధి పథంలో పయనిస్తున్నది. గతంలో ప్రతి గ్రామంలోనూ తాగునీటి సమస్య అధికంగా ఉండేది. నీటి కోసం ధర్నాలు, రాస్తారోకోలు చేసేవారు. గ్రామస్తులు వ్యవసాయ బోర్లను ఆశ్రయించేవారు. ఈ సమస్యను విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డి శాశ్వతంగా పరిష్కరించారు. ఏపూరు, పాతర్లపహాడ్ గ్రామాల యేటిలో బావులను తవ్వించి తాగునీటి సమస్యను తీర్చారు. అలాగే మండలంలో ఉన్న 30 గ్రామ పంచాయతీల్లో మిషన్ భగీరథ ద్వారా ప్రతి ఇంటికీ తాగునీరు అందిస్తున్నారు. గతంలో గ్రామాల్లో ఏ వీధి చూసినా గుంతలమయంగా ఉండేది. ఇప్పుడు ప్రతి వార్డుకు సీసీ రోడ్డు వేశారు. గతంలో రైతుల ఆత్మహత్యలు అధికంగా ఉండేవి. వ్యవసాయానికి కనీసం ఐదు గంటలు కూడా కరెంటు ఇవ్వలేదు. నేడు 24గంటలు ఉచితంగా వ్యవసాయం, ముచ్చటించుకోవడానికి రైతు వేదికలను ఏర్పాటు చేశారు.
పరిశుభ్రంగా గ్రామాలు
గతంలో ఎక్కడ పడితే అక్కడ చెత్తా చెదారం ఉండి విష జ్వరాలు వ్యాప్తి చెందేవి. ఇప్పుడు ప్రతి గ్రామ శివారులో డంపింగ్ యార్డులు ఏర్పాటు చేసి అక్కడకు చెత్తను తరలిస్తున్నారు. దీంతో గ్రామాలు పరిశుభ్రంగా దర్శనమిస్తున్నాయి. ప్రతి గ్రామంలోనూ ప్రతి స్తంభానికీ ఎల్ఈడీ లైట్లను ఏర్పాటు చేశారు. పల్లె ప్రగతి ద్వారా గ్రామాల్లో ఉన్న సమస్యలన్నీ పరిష్కారమవుతున్నాయి. అన్ని గ్రామాలు అభివృద్ధ్ది పథంలో పయనిస్తున్నాయి.