నూతనకల్, జూలై 16 : ప్రభుత్వ దవాఖానల్లోప్రసవాల సంఖ్యపెంచాలని వైద్యాధికారి కోటాచలం సూచించారు. మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని శుక్రవారం ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. పరీక్షలు, వ్యాక్సినేషన్, ల్యాబ్, లేబర్ రూమ్, రికార్డులను పరిశీలించారు. అనంతరం గుండ్లసింగారం గ్రామంలో డీఈసీ మాత్రల పంపిణీని పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం అందిస్తున్న కేసీఆర్ కిట్, ఇతర రాయితీలు పొందాలంటే ప్రభుత్వ దవాఖానల్లోనే కాన్పులు జరిపించాలన్నారు. వైద్య సిబ్బంది ప్రతి ఇంటికీ వెళ్లి డీఈసీ, ఆల్బెండజోల్ మాత్రలు పంపిణీ చేయాలని సూచించారు. బోదకాలు వ్యాధి నిర్మూలనకు ప్రతిఒక్కరూ కృషి చేయాలన్నారు. కార్యక్రమంలో జిల్లా మలేరియా అధికారి సాహితి, మండల వైద్యాధికారి త్రివేణి, సీహెచ్ఓ శ్రీనివాస్, వైద్య సిబ్బంది పాల్గొన్నారు.
డీఈసీ, ఆల్బెండజోల్ మాత్రలు వేసుకోవాలి
తుంగతుర్తి : ప్రతిఒక్కరూ డీఈసీ, ఆల్బెండజోల్ మాత్రలు వేసుకోవాలని జిల్లా వైద్యాధికారి డాక్టర్ కోటాచలం అన్నారు. కర్విరాల కొత్తగూడెంలో డీఈసీ, ఆల్బెండజోల్ మాత్రలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మండలంలో 50,460 మందికి మాత్రలు పంపిణీ చేయనున్నట్లు తెలిపారు.