కొత్త ధారావాహిక
జరిగిన కథ
వేదాలకు మూలమైన దేవుడు.. కథా నాయకుడై పురాణాలను నడిపించిన పరంధాముడు.. మనిషిలోని మృగ ప్రవృత్తిని పోగొట్టడానికి నరమృగావతారం ఎత్తిన మహా విష్ణువు.. తాను యాదాద్రి మీద కొలువు దీరానంటూ పరమభక్తుడైన గుళ్లపల్లి రామభట్టుకు స్వప్నంలో తెలియజేస్తాడు. ఆ ఆనంద పారవశ్యంలో మైమరచి పోతాడు రామభట్టు. దట్టమైన అడవి మధ్యలో, ఓ కొండ మీది ప్రాచీన ఆలయంలో వెలిసిన స్వామి గురించి సార్వభౌముడికి తెలియజేయడానికి భువనగిరి కోటకు బయల్దేరుతాడు. అదే సమయంలో రారాజు ్రత్రిభువన మల్లుడు మంత్రి, సామంత, దండనాయకులతో తన మనసులోని భయాలను పంచుకుంటూ ఉంటాడు.
భువనగిరి సభా ప్రాంగణం..
నిండుసభలో సమ్రాట్ త్రిభువనమల్లుడి ప్రసంగం.. ముఖ్యంగా- ఆయన నోటివెంట వచ్చిన ప్రమాద సూచికలు సభలో ఉన్న వారిని ఎంతో కలవరానికి గురిచేశాయి.“సామ్రాజ్యం సువిశాలమైనది. సుభిక్షమైనది. ఇంతకాలం మనకు ఎదురేలేదని, పట్టిందల్లా బంగారమని భావిస్తూ వచ్చాము. రాత్రయినా, పగలయినా, సభా ప్రాంగణమైనా- ఆంతరంగిక మందిరమైనా- ఎక్కడున్నా- ఏ స్థితిలో ఉన్నా- మాకు ఒకటే ఆలోచన. సామ్రాజ్య పరిరక్షణ, సామాన్య పౌరులు సైతం సంతోషంగా ఉండగలిగే సంక్షేమ కార్యాచరణం! ఇన్నాళ్లూ, ఈ రెండూ బాగున్నాయనే ధైర్యంతో ఉన్నాము. కానీ కన్నడ దేశం నుండి ఆపద ముంచుకొస్తున్న విషయం ముందుగా తెలుసుకోలేకపోయాం. కన్నడ రాజ్యాధీశుడు విష్ణువర్ధనుడు- మనపైన దండయాత్రకు వస్తున్నాడని తెలిసింది.అనివార్యమైతే తప్ప యుద్ధం కోరుకోదగింది కాదు. అన్ని మార్గాలూ పరిశీలించాం. యుద్ధాన్ని నివారించాలని శతవిధాలా ప్రయత్నించాం. సాధ్యం కాలేదు. సంక్షేమ కార్యాచరణలో శాంతి భద్రతలు చాలా ముఖ్యం. యుద్ధం అనేది భద్రతను ప్రమాదంలో పడేస్తుంది. ఎవరికీ శాంతి లేకుండా చేస్తుంది”. ఒక్క క్షణం సభలో అందరినీ చూసి, వారి వారి మనః స్థితిని అంచనా వేయడానికా అన్నట్టు సాలోచనగా తలపంకించాడు. కవి విద్యాపతికి ఈ పరిస్థితి ఏమీ అర్థం కాలేదు.. ‘త్రిభువన మండలేశ్వరుడు, మూడు లోకాలను జయించగలిగే శక్తి వున్నవాడు అయిన త్రిభువన చక్రవర్తి యుద్ధానికి ఆందోళన చెందడమా? ఉనికిని కాపాడుకునే ప్రయత్నంలో- ఊహలోనైనా పిరికితనాన్ని తను సహించలేడు. చక్రవర్తి మనోగతానికి ఎదురుమాట్లాడటం ధిక్కారమౌతుంది కానీ, ఈ సమయంలో తను మౌనం వహించడం అర్థం లేని పని అవుతుంది’. “సౌర్వభౌములు మన్నించాలి” … విద్యాపతి తను కూర్చున్న ఆసనం నుండి లేచి, వినయంగా కొనసాగించాడు.
“కష్టానికి భయపడే కర్షకుడూ, కానుపుకు భయపడే ఇల్లాలు, యుద్ధానికి భయపడే చక్రవర్తీ ఎప్పుడూ ముందుకు పోలేరు. రాజ్య పరిరక్షణ, దానిలో భాగమైన యుద్ధ సంసిద్ధత రాజ లక్షణం. మీకు తెలియనిది కాదు. శాంతి భద్రతలు సుస్థిరంగా ఉన్నంత కాలం ప్రతి పౌరుడూ శ్రామికుడే. పంటలు పండించే రైతులు, వ్యవస్థను నడిపే అధికారులు, సమాజానికి అవసరమైన నిపుణులు- అందరూ ఎవరి పని వారు చేసుకుంటూ, అందరి పనీ సకాలంలో జరిగేటట్టు చూస్తారు. కానీ యుద్ధం మాత్రం మీతోపాటు మీ సారథ్యంలో అందరూ చేస్తారు- ప్రత్యక్షంగా, పరోక్షంగా! భయపడవలసిందీ, వెనుకడుగు వేయవలసింది ఏమీ లేదు – అని మా విన్నపం!”విద్యాపతి మహా పండితుడు. అన్ని శాస్ర్తాలూ చదివినవాడు. ముఖ్యంగా చక్రవర్తి మనసెరిగిన మంత్రాంగంలో ముఖ్యుడు. విద్యాపతి మాటలు త్రిభువనమల్లుడికి కోపం తెప్పించాయి. ఆపదలో ఉన్నప్పుడు, ఆవేదనలో ఉన్నప్పుడు- ఆవేశం హానికారకమవుతుంది.మహారాణి చంద్రలేఖ ఆందోళనగా భర్తకేసి చూసింది. చక్రవర్తి ఏ సమయంలోనూ, ఏ సందర్భంలోనూ ‘అవిధేయత’ను సహించడు. వరాలు ఇచ్చినా, తలలు తీసేయాల్సి వచ్చినా ఒక్క క్షణం ఆలోచించడు. తనవారు- వేరేవారు అనే భేదం పాటించడు. వేటు వేసేస్తాడు. అటువంటిది విద్యాపతి ములుకుల వంటి పలుకులకు- మౌనంగా వుంటాడా?ఇది ఏ పరిణామాలకు దారి తీస్తుందో అన్న భయం కలిగింది- అయితే చక్రవర్తి ‘స్పందన’ ఎలా ఉంటుందా అనుకుంటూ చూసింది.చక్రవర్తి వదనంలో ఆగ్రహావేశాలు ఉప్పొంగినా, పాలపొంగులా చప్పున చల్లారిపోయాయి.
చిరునవ్వు మొలకెత్తింది.“మిత్రమా, విద్యాపతీ! కవులు, కళాకారులు భావోద్వేగ భరితులు. కానీ ప్రజలను కాపాడవలసిన పాలకుడు ఎన్నడూ ఆవేశకావేషాలకు లోను కాకూడదు. వీరఖడ్గాన్ని హస్తాభరణంగా మార్చుకున్న మాకా యుద్ధమంటే భయం. నిజానికి యుద్ధానికే మేమంటే భయం. ఎందుకంటే, ఎదురువస్తే ఎదుర్కొంటాం. తలపడితే తలతీస్తాం. త్రిభువనమల్లుడు అన్నపేరు మాకు బిరుదుకాదు. మా తల్లిదండ్రులు పెట్టిన పేరు కాదు. యుద్ధాలలో గెలిచి, శత్రురాజుల తలలు నరికి భువనగిరి కోట ద్వారబంధాలకు వేలాడదీశాం కనుకనే- త్రిభువన మల్లుడు అనే కీర్తిని నామవాచకంగా ధరించాం. ఇది లోక విదితం!ఇప్పుడు యుద్ధానికి వస్తున్నది సాధారణ రాజ వంశీయుడు కాదు. అసాధారణ ధీమంతుడు విష్ణువర్ధనుడు. ఇప్పుడిప్పుడే మన సామ్రాజ్యంలో శాంతిభద్రతలు స్థిరపడుతున్నాయి. గ్రామసీమలు హరితసీమలుగా కళకళలాడుతున్నాయి. సంగ్రామ ఉన్మాదం గ్రామసీమలను తొక్కివేస్తుంది. హరితాన్ని హరించి, రక్తాలను పారించే యుద్ధాన్ని ప్రస్తుత తరుణంలో మాత్రమే మేం వద్దంటున్నాం- అంతే!”ఇంక మాట్లాడేదేమీ లేదన్నట్లుగా సింహాసనం పైనుండి ధిగ్గున లేచాడు. మెట్లుదిగి చరచరా ఆంతరంగిక మందిరంలోకి వెళ్లిపోయాడు.మహారాణి అయోమయ స్థితిలో ఆయనను అనుసరించింది. సభాసదులు ఏం జరుగుతున్నదో అర్థం కాక దిగ్భ్రాంతిలో మునిగిపోయారు.
“అత్యవసరంగా చక్రవర్తులవారిని కలవాలి.”
ద్వారం దగ్గర కాపలావారిని వేడుకుంటున్నాడు- రాజవైద్యుడు.
“ఒక ముఖ్యమైన విషయం వారికి మనవి చేయాలి. తక్షణమే నేను కలవాలనుకుంటున్న విషయమైనా వారికి చేరవేయండి.”
“స్వామీ, మీరు ఎన్ని విధాలుగా చెప్పినా, మేము చేయగలిగింది ఏమీలేదు. ఎవరినీ లోపలికి పంపరాదని మహారాణి వారి ఆజ్ఞ!” – కఠినమైన నియమ నిబంధనలను వినయంగా మనవి చేశాడు భద్రతాధికారి.
వెంటనే ఆ భద్రతాధికారి చేతిలోని చురకత్తిని లాక్కొని తన మణికట్టును కోసుకున్నాడు రాజవైద్యుడు. ఒక్కసారిగా రక్తం చిప్పిల్లింది.
ఈ హఠాత్ పరిణామానికి నిశ్చేష్టుడైన భద్రతాధికారి ఒక్కకేకవేసి లోపలికి పరుగెత్తాడు.
దీర్ఘాలోచనలో ఉన్న చక్రవర్తి ఆ కేక విని ఉన్నపాటున బయటికి వచ్చాడు.
ఎదురుగా రాజవైద్యుడు. మణికట్టు కోసుకుపోయి రక్తం పొంగుతూ వస్తున్నది.
“మిమ్మల్ని హెచ్చరించడానికి ఇంతకుమించి మార్గం దొరకలేదు” అంటూ తన జోలెలోంచి ఒక మూలిక తీసి నోటితో తుంచి తన గాయంపైన రాశాడు. వెంటనే రక్తస్రావం ఆగిపోయింది. ఆ మూలిక మహిమ ఏమోగానీ కత్తితో ఏర్పడిన గాటు కూడా పూడుకుపోయింది. ఆశ్చర్యపోయాడు చక్రవర్తి. కత్తులతో రక్తాలు పారించడమే తనకు తెలుసు. పారుతున్న రక్తధారను మూలికలతో ఆపడం ఇప్పుడే చూస్తున్నాడు.
“చెప్పండి, ఏమిటిదంతా?” అధికార స్వరంతో అడిగాడు.
“ప్రభువులు క్షమించాలి. ఓ ముఖ్యమైన విషయం మీ దృష్టికి తీసుకురావాలని ఈ పని చేశాను.”
“సమాచారం నాకు చేరవేయడానికి- మీ రక్తం ధారపోయాలా?”
“ప్రభూ- ఇక్కడ ఆలోచించవలసింది నా రక్తం గురించి కాదు. మీ రక్తం గురించి..” దృఢ స్వరంతో అన్నాడు రాజవైద్యుడు.
“అంటే?”
“మీ రక్తానికి రక్తమైన యువరాజు సోమేశ్వరుల వారి గురించి. యువరాజుకు రానున్న ఆపద గురించి మనం ఆలోచించాలి.”
అప్పుడు గుర్తుకువచ్చింది చక్రవర్తికి. వారం రోజుల క్రితం అనుచరులతో కలిసి యుద్ధవిద్యలు నేర్చుకుంటున్న రాజకుమారుడు అకస్మాత్తుగా కిందపడిపోయాడు. అది తాత్కాలిక రుగ్మత అనుకున్నాడు తను. కానీ- కాదా?
“ప్రభూ, అది సాధారణ వ్యాధికాదు. అరుదైనది. అంతుపట్టనిది. ఈ అయిదు రోజులూ అతి జాగ్రత్తగా వ్యాధి తీవ్రతనూ, గమనాన్నీ పరిశీలించాం. ఒక విధంగా చెప్పాలంటే యువరాజువారు…” చెప్పలేనన్నట్టుగా తల అడ్డంగా ఊపి- ఆపేశాడు రాజవైద్యుడు.
“చెప్పండి- చెడు అయినా, చేదు అయినా వాస్తవాన్ని తెలుసుకోక తప్పదు.”
“ఇకపైన యువరాజుగారి జీవితంలో గడిచే ఒక్కోరోజూ- అయిదేళ్ళ ఆయుష్షుతో సమానం.” చెప్పలేక చెప్పలేక చెప్పాడు రాజవైద్యుడు.
కాళ్ళకిందనున్న భూమి ముక్కలై తాను అందులో కూరుకుపోతున్న భావన కలిగింది.
“యువరాజు వయసు ఇప్పుడు పది సంవత్సరాలు. గడిచే ఒక్కరోజు అయిదేళ్ళ ఆయుష్షుతో సమానం- అంటే రాబోయే పద్దెనిమిది దినాలు- తొంభై ఏళ్ళ ఆయుష్షుతో సమానమా? యువరాజు మరొక పద్దెనిమిది రోజులకు మించి బతకడా?” సర్వశక్తులూ కూడదీసుకుంటూ అడిగాడీ ప్రశ్న!
“ప్రభూ ఎవరు ఎంతకాలం జీవించాలో నిర్ణయించేది భగవంతుడే కానీ, మానవ మాత్రులైన మా వంటి వైద్యులు కాదు.”
“మా ప్రయత్నం మేము చేస్తాం. మీరు ధైర్యంగా ఉండండి.”
ఆ మాట ఇంకా పూర్తి కాలేదు. ఫెళఫెళమంటూ శబ్దం వినబడింది. అప్రమత్తమైన చక్రవర్తి అంగరక్షకులు ఆయన చుట్టూ వలయంలా నిలబడ్డారు. ద్వారబంధంపైన అలంకారం కోసం చెక్కిన శిల్పం తలభాగం పెద్ద శబ్దం చేసుకుంటూ నెమ్మది నెమ్మదిగా విచ్ఛిన్నమైంది. అయితే, కిందపడుతుండగా అంగరక్షకులు పట్టుకోగలిగారు. వారి చేతుల్లో పడిన శిలాభాగాన్ని చూశాడు చక్రవర్తి.
అది సింహం శిరోభాగం! శిల్పి ఎంత సహజంగా చెక్కాడంటే, ఆ సింహం కళ్లు తననే సజీవంగా చూస్తున్నట్టుగా వున్నాయి. ఎందుకో తెలియని బెదురు కలిగింది. అసంకల్పితంగా ఒక అడుగు వెనక్కి వేశాడు త్రిభువన మల్లుడు.
ఇంతలో పరుగు పరుగున వచ్చాడు సేనాధిపతి.
“ప్రభూ! ఒక అనుకోని సంఘటన జరిగింది. రామభట్టు అనే ఒక వ్యక్తి గత అయిదురోజులుగా మీ దర్శనం ఇప్పించమంటూ మమ్మల్ని వేధిస్తున్నాడు. చక్రవర్తులవారు నాకు దర్శనం ఇవ్వకపోయినా అభ్యంతరం లేదు. కనీసం జీవితకాలంలో వీరి దర్శనం చేసుకోమని చెప్పు- అని ఈ వస్త్రం ఇచ్చి వెళ్ళిపోయాడు.”
ఏమున్నదా వస్త్రంలో?
తీసి చూశాడు రాజవైద్యుడు. ఆ అంగవస్త్రంపైన రుధిరాక్షరాలతో ఇలా రాసుంది-
“ఓమ్ నమో నారసింహాయ”
(ఇంకా ఉంది)
‘త్రిభువన మండలేశ్వరుడు, మూడు లోకాలను జయించగలిగే శక్తి వున్నవాడు అయిన త్రిభువన చక్రవర్తి యుద్ధానికి ఆందోళన చెందడమా? ఉనికిని కాపాడుకునే ప్రయత్నంలో- ఊహలోనైనా పిరికితనాన్ని తను సహించలేడు. చక్రవర్తి మనోగతానికి ఎదురుమాట్లాడటం ధిక్కారమౌతుంది కానీ, ఈ సమయంలో తను మౌనం వహించడం అర్థం లేని పని అవుతుంది’.
-అల్లాణి శ్రీధర్