ఏదో ముఖ్యమైన పని. త్వరగా పూర్తి చేసుకోవాలనే తాపత్రయం. ఇంట్లో భోంచేయకుండానే బయల్దేరుతాం. పనయ్యాక ఏదైనా తినాలని అనిపిస్తుంది. కానీ, దగ్గర్లో హోటల్స్ ఉండకపోవచ్చు. ఉన్నా ఖరీదైన వ్యవహారం కావచ్చు! అలాంటి పరిస్థితుల్లో ఆకలిదూపలను తీర్చే కేఫ్ ఒకటి ఉంది. అదే ‘టీ-కేఫ్’. సామాన్యుడికి సంపూర్ణ భోజనం వడ్డించే అన్నపూర్ణ.
బంజారాహిల్స్, రోడ్ నంబర్-12. మొక్కులు తీర్చుకునేందుకు జగన్నాథ స్వామి ఆలయానికి భక్తులు తరలివస్తుంటారు. జగన్నాథుడి గుడి మెట్లెక్కే ప్రతి ఒక్కరూ మానసిక ప్రశాంతతతో తిరిగి వెళ్తారని ఓ నమ్మకం.
ఆ పరిసరాల్లో ఇంకో భవనం.. తెలంగాణ భవన్! తెలంగాణ తల్లి దీవెనలతో, కార్యకర్తలకు భరోసా ఇస్తున్న టీఆర్ఎస్ పార్టీ కార్యాలయం. ఈ భవంతి మెట్లెక్కే ప్రతి ఒక్కరికీ భరోసా దొరుకుతుందన్న విశ్వాసం.
జగన్నాథ స్వామి ఆలయం సమీపంలో, తెలంగాణ భవన్ ఆవరణలో.. అన్నపూర్ణ లాంటి ‘టీ-కేఫ్’ ఉంది. ఈ క్యాంటీన్ నిత్యం వందలమంది కడుపు నింపుతుంది. తీరొక్క పదార్థాలు, తీరొక్క మనుషులతో కిటకిటలాడే టీ-కేఫ్లో కొత్తగా వచ్చినవాళ్లకైతే, ‘బంతి భోజనం’ తిన్నంత సంతృప్తి కలుగుతుంది. కాంపౌండ్ దాటొచ్చి అందరినీ ఆహ్వానిస్తాయి కమ్మటి ఘుమఘుమలు. చిరునవ్వుతో స్వాగతం పలుకుతున్నట్టు ఉంటుంది కేసీఆర్ చిత్రపటం. ఆ ఫొటో ఉన్న టేబుల్పై తినేందుకైతే జనాలు పోటీ పడుతుంటారు. కడుపునిండా భోంచేసి, ఆ చిత్రం ముందు సెల్ఫీ తీసుకుని మరీ వెళ్తారు. ఆ సమయానికి, సాక్షాత్తు కేసీఆర్తో కలిసి భోంచేసినంత ఆనందం!
ఉదయాన్నే టీ-కేఫ్ ద్వారం తెరుచుకుంటుంది. ఆరు గంటలకు ఇరానీ చాయ్ సిద్ధం అవుతుంది. ఏడు, ఎనిమిది గంటలకల్లా టిఫిన్లు అందుబాటులో ఉంచుతారు. పదకొండు దాటితే ఘుమఘుమలాడే వంటలు తయార్. మధ్యాహ్నానికి సందడి పెరుగుతుంది. దావత్ వాతావరణం
కనిపిస్తుంది. అన్నం, కూరలు, చికెన్, పప్పు, సాంబారు, తొక్కులు, పచ్చి పులుసు, వేపుడు, పాపడాలు, పెరుగు.. బ్రహ్మాండమైన విందు. భోజనం బాగుంటుందనే విషయాన్ని చాలామంది సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తుండటంతో టీ-కేఫ్ వంటకాలు మరింత ఫేమస్ అవుతున్నాయి. తెలంగాణ భవన్ సందర్శకులే కాకుండా, బయటి వాళ్లూ తింటున్నారు. బంజారాహిల్స్లోని ఇతర హోటల్స్లో అయితే, ఇలాంటి నాణ్యమైన ఐటమ్స్తో భోజనం అంటే.. రూ.250 పైనే ఉంటుంది. కానీ టీ-కేఫ్లో వెజ్ రూ.80 మాత్రమే. నాన్వెజ్ కావాలంటే ఇంకో ఇరవై రూపాయలు చెల్లించాలి. టీఆర్ఎస్ కార్యకర్తలు మాత్రం పార్టీ ఆఫీసు నుంచి టోకెన్ తెచ్చుకుంటే సరిపోతుంది.ఎవరైనా ఆకలితో వచ్చినవారికి కడుపు నిండా రుచికరమైన భోజనం అందించాలన్న కేసీఆర్ ఆలోచనకు అనుగుణంగా, కేటీఆర్ ప్రోత్సాహంతో టీ-కేఫ్ నడుస్తున్నది. ఇక్కడ తెలంగాణ పిండివంటలు కూడా లభిస్తున్నాయి. గారెలు, మురుకులు, గరిజలు వంటివన్నీ దొరుకుతున్నాయి. పచ్చిపులుసు, సర్వపిండి తదితర తెలంగాణ బ్రాండ్ ఐటమ్స్కు మంచి గిరాకీ ఉంటున్నది. ఒకవైపు సంపూర్ణ భోజనంతో, మరోవైపు నోరూరించే పిండివంటలతో టీ-కేఫ్ రా రమ్మని పిలుస్తుంది.
తెలంగాణ భవన్ సందర్శకులు, పార్టీ కార్యకర్తలు భోజనం కోసం ఇబ్బంది పడుతున్నారని కేసీఆర్ దృష్టికి వెళ్లింది. దీంతో, తెలంగాణ భవన్కు ఎవరు వచ్చినా కడుపు నిండా భోజనం పెట్టించాలని నిర్ణయించారు.‘టీ-కేఫ్’ నిర్మాణానికి ముగ్గుపోసి శంకుస్థాపన చేశారు. నిర్మాణ పనుల్ని పరిశీలించి వెళ్లారని కూడా నిర్వాహకులు చెబుతున్నారు. హైదరాబాద్కు వచ్చినవాళ్లు చార్మినార్ ఎక్కాలనీ, గోల్కొండను చూడాలని ఎలా అనుకుంటారో ‘తెలంగాణ భవన్’ను సందర్శించాలనీ ఆశిస్తారు. ఎవరొచ్చినా అన్నపూర్ణలా కొసరి కొసరి వడ్డిస్తుంది.. టీ-కేఫ్.
-చిన్న యాదగిరి గౌడ్