తెలంగాణలో నృసింహాలయాలు అనేకం. వాటిలో దేనికదే ప్రత్యేకం. ఉచ్ఛ్వాస నిశ్వాసలు కలిగిన మూలవిరాట్తో మహిమాన్వితంగావెలుగొందుతున్నది వాడపల్లి క్షేత్రం. ఇక్కడ వెలసిన నారసింహుడు శ్వాసిస్తాడని భక్తుల నమ్మకం. మూల విరాట్కు ఎదురుగా ఉన్న అఖండ జ్యోతి కదలికే ఇందుకు నిదర్శనమని అంటారు. పూర్వం అగస్త్య మహాముని శివకేశవుల విగ్రహాలను ప్రతిష్ఠించాలనుకున్నాడు. వాటిని అన్నపూర్ణ కావడిలో ఉంచుకొని, ముల్లోకాలు తిరుగుతూ భూలోకానికి వచ్చాడు. ఉత్తర కాశీకి వెళ్లే క్రమంలో కృష్ణా-మూసీ నదుల సంగమం వద్దకు చేరుకున్నాడు. సంధ్యావందనం కోసం అన్నపూర్ణ కావడిని గోవులు కాచుకొనే పిల్లవానికి అప్పగించాడు. తాను స్నానం చేసి వచ్చేంత వరకూ కింద పెట్టవద్దని జాగ్రత్తలు చెప్పాడు. సంధ్య వార్చుకొని తిరిగి వచ్చేసరికి, పిల్లవాడు కావడిని కింద పెట్టి మాయమైపోయాడు. దీంతో అగస్త్యుడు తిరిగి కావడి ఎత్తుకొనే క్రమంలో ఆకాశవాణి రూపంలో స్వామివారు పలికారు. ఈ ప్రాంతం ఎంతో పవిత్రమైనదనీ, తాను ఇక్కడే ఉంటానని పలికాడు. దీంతో అగస్త్యుడు ఇక్కడే విగ్రహాలను ప్రతిష్ఠించాడు. నల్లగొండ జిల్లా దామరచర్ల మండలం వాడపల్లి గ్రామంలోని కృష్ణా -ముచుకుందా నదుల సంగమ తీరంలోని లక్ష్మీ నర్సింహ స్వామి ఆలయ స్థలపురాణం ఇది. ఆరువేల ఏండ్ల క్రితమే అగస్త్య మహాముని ప్రతిష్ఠించిన శివకేశవుల్లో శ్రీ లక్ష్మీనృసింహస్వామి వారు ఒకరు. ఇక్కడ లక్ష్మీదేవి స్వామివారి తొడపై చిరుదరహాసంతో ఆసీనురాలై దర్శనమిస్తుంది. లక్ష్మీనారసింహుల దర్శనంతో సంసార క్లేషాలు తొలగిపోతాయని నమ్మకం.
ఆలయాల నిర్మాణం
కాలక్రమంలో అగస్త్యుడు ప్రతిష్ఠించిన శివకేశవుల విగ్రహాలు మట్టిలో కూరుకుపోయాయి. ఈ ప్రాంతం రెండు నదుల సంగమ స్థానం కావడంతో ఇరు రాజ్యాలకు హద్దుగా, శత్రుదుర్భేద్యంగా ఉండేది. ఇక్కడ కట్టడాలు, ఇండ్లు, కోటలు నిర్మిస్తే చేస్తే సురక్షితంగా ఉంటుందని
12వ శతాబ్దంలో రెడ్డి రాజులు అనవేమారెడ్డి, భీమారెడ్డి భావించారు. దీంతో ఇక్కడ భారీ నిర్మాణాలు చేపట్టారు. అప్పుడే, మట్టిలో కూరుకొని పోయిన స్వామివార్ల విగ్రహాలు బయట పడ్డారు. వెంటనే రెడ్డి రాజులు ఆలయాలను నిర్మించారు. ధూపదీప నైవేద్యాలకు 30 మట్ల భూమిని ధారాదత్తం చేశారు.
ఊపిరి తీసుకునే దేవుడు
వాడపల్లి ఆలయంలో కొలువైన లక్ష్మీ సమేత నారసింహస్వామి శ్వాసిస్తాడని భక్తులు నమ్ముతున్నారు. స్వామివారి ఎదుట ఉన్న రెండు అఖండ జ్యోతులను ఇందుకు నిదర్శంగా చూపిస్తారు. వీటిలో స్వామివారి ముఖభాగానికి ఎదురుగా ఉన్న జ్యోతి ఎప్పుడూ కదులుతూనే ఉంటుంది. కిందనున్న దీపం మాత్రం నిశ్చలంగా ఉంటుంది. ఇందుకు స్వామి వారి ఉచ్ఛ్వాస, నిశ్వాసలే కారణమని అంటారు.
కోర్కెలు తీర్చే కల్పవృక్షం..
ఆలయ ప్రాంగణంలోని ఓ చెట్టును కోర్కెలు తీర్చే కల్పవృక్షంగా భక్తులు భావిస్తారు. ఏదైనా కోర్కెను తలుచుకొని 11 ప్రదక్షిణలు చేస్తే ఆశలు నెరవేరుతాయని నమ్ముతారు. ఫలసిద్ధి తర్వాత మళ్లీ కల్పవృక్షం చుట్టూ 108 ప్రదక్షిణలు చేసి మొక్కులు చెల్లిస్తారు. చెట్టుకు ముడుపులు కడుతారు. ఈ క్షేత్ర సందర్శనం భక్తులకు ఆధ్యాత్మికా నుభూతిని కలిగిస్తుంది.
మహిమాన్వితుడు మా స్వామి
పౌరాణిక ప్రాశస్త్యం కలిగిన వాడపల్లి శ్రీలక్ష్మీ నర్సింహస్వామి ఆలయం ఎంతో మహిమాన్వితమైనది. ఉచ్ఛ్వాస, నిశ్వాసలు తీసుకొనే స్వామివారు ఇక్కడ మాత్రమే కనిపిస్తారు. ఈయనను దర్శిస్తే కోరిన కోర్కెలు నెరవేరుతాయని భక్తుల నమ్మకం. నిత్య కైంకర్యాలతోపాటు ప్రతినెలా స్వాతి నక్షత్రం రోజున కల్యాణాలు జరిపిస్తాం. ధనుర్మాసం, కార్తీక మాసంతో పాటుగా స్వామివారికి యేటా బ్రహ్మోత్సవాలను ఘనంగా నిర్వహిస్తాం. – నూగూరి రామానుజాచార్యులు ఆలయ పూజారి