షోరూమ్లో మెగాసేల్ ఆఫర్లకన్నా.. ఫుట్పాత్పై రీసేల్ ప్రకటనలు ఆకట్టుకుంటాయి. బ్రాండెడ్ వస్తువులు కారుచౌకగా లభిస్తాయనే ఉద్దేశంతో రీసేల్ వస్తువుల కొనుగోలుకు జనం ఎగబడుతుంటారు. వినియోగదారుల నాడిని వ్యాపార సూత్రంగా మలుచుకొంటున్నారు ఆంత్రప్రెన్యూర్స్. చీరలు మొదలు జువెలరీ వరకు రీసేల్ చేస్తున్నారు. ఆ జాబితాలో బ్రాండెడ్ స్నీకర్స్ వచ్చి చేరాయి. ‘స్నీకర్స్ రీసెల్లింగ్’ బిజినెస్ ప్రపంచవ్యాప్తంగా జోరుగా నడుస్తున్నది.
స్నీకర్స్ను ఇష్టపడేవారు, నిత్యం వాడేవారు చాలామందే ఉంటారు. వీటి ధర ఐదువేల రూపాయల నుంచి లక్షన్నర వరకూ ఉంది. బ్రాండెడ్ స్నీకర్స్ కొనడం అన్నది కామన్మ్యాన్కు కష్టంతో కూడుకున్న వ్యవహారమే. ఆ కల రీసెల్లర్స్ పుణ్యమాని నెరవేరుతున్నది. స్నీకర్స్ రీసెల్లింగ్ ఎప్పట్నుంచో ఉన్నదే. కానీ, కరోనా తర్వాత రీసెల్లర్స్ సంఖ్య ప్రపంచవ్యాప్తంగా వంద రెట్లు పెరిగింది. మనదేశంలోనూ వెయ్యిమందికిపైగా రీసెల్లర్లు స్నీకర్స్ను విక్రయిస్తున్నారు. వాళ్లకు రిజిస్టర్డ్ కంపెనీలు మంచి డీల్ ఇస్తున్నాయి.
మిలియన్ డాలర్ల వ్యాపారం
ఆన్లైన్ మార్కెట్లో స్నీకర్స్ విక్రయాలు ఊపందుకుంటున్నాయి. ప్రస్తుతం లిమిటెడ్ ఎడిషన్ స్నీకర్స్ విక్రయాలు మిలియన్ డాలర్ల మార్క్ దాటిందని చెబుతున్నాడు స్నీకర్స్ రీసెల్లర్ కపిల్. అతను ఈజీస్ స్నీకర్స్ కోసం వెతుకుతున్న క్రమంలోనే.. బ్యాండ్వేగన్ రీసెల్లింగ్లో చేరాడు. ‘ఆసియాలోని అతికొద్ది కంపెనీల్లో క్రెప్డాగ్ ఒకటి. దానికి మాత్రమే డెడ్స్టాక్ షూతో డీలింగ్స్ ఉన్నాయి. దాంతో మేం డీల్ కుదుర్చుకున్నాం. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 130 నగరాల్లో నెలకు 300 జతల స్నీకర్స్ విక్రయిస్తున్నాం. అలా నెలకు రూ.40 లక్షల దాకా రాబడి వస్తున్నది’ అంటున్నాడు కపిల్. గోవాకు చెందిన 19 ఏండ్ల రిహబ్కు స్నీకర్స్ అంటే ప్రాణం. అప్పటికే అతని దగ్గర ‘ఎయిర్ జార్డన్ 1’, ‘డార్క్ మోచా’, ‘ఈజీ ైస్లెడ్స్’, ‘ఫోమ్ రన్నర్’ వంటి బ్రాండెడ్ స్నీకర్స్ ఉన్నాయి. అయితే, గత ఏడాది ఇన్స్టాగ్రామ్లో రిహబ్ రీసెల్లింగ్ గురించి తెలుసుకున్నాడు. హై ఎండ్ స్నీకర్స్ రీసేల్ చేస్తే మంచి లాభాలు వస్తాయని అనుకున్నాడు. అలా మొదలైన రీసెల్లింగ్ బిజినెస్ ఇప్పుడు మూడు పువ్వులు, ఆరు కాయలుగా నడుస్తున్నది. ఎక్స్క్లూజివ్ స్నీకర్స్ అందించడంలో రిహబ్ ముందుంటాడు.
ఉభయ కుశలోపరి
ప్రస్తుతం కోపింగ్ పద్ధతి బాగా నడుస్తున్నది. అంటే మార్కెట్లో రిలీజైన బ్రాండెడ్ స్నీకర్స్ని కొన్ని క్షణాల్లో కస్టమర్లకు అందించడం. దీన్ని త్వరగా అందిపుచ్చుకున్నాడు రిహబ్. కస్టమర్ల నుంచి సర్వీస్ రిక్వెస్ట్ రాగానే, తక్షణం స్పందించేలా బోట్ అనే టెక్నాలజీని ఉపయోగిస్తున్నాడు. ‘ఈ బోటింగ్ టెక్నాలజీతో లిమిటెడ్ ఆఫర్స్ను వెంటనే అందిపుచ్చుకోవచ్చు. చాలామంది బ్రౌజర్ ఎక్స్టెన్షన్లను ఉపయోగిస్తుంటారు. కానీ, ఈ బోట్ టెక్నాలజీతో బుకింగ్స్ మెరుపువేగంతో చేయొచ్చు’ అంటాడు రిహబ్. ఈ సాంకేతికతను రీసెల్లర్స్కు అందించాలని అనుకుంటున్నాడు రిహబ్. ఇన్స్టాగ్రామ్, వాట్సాప్ ద్వారా కూడా, ఇప్పుడు స్నీకర్స్ రీసెల్లింగ్
జరుపుతున్నారు.