వారంతా పాలమూరు జిల్లాకు చెందిన సైనికులు. అంతకుముందు నిరుపేదలు. రెక్కాడితేగానీ డొక్కాడని కుటుంబాల నుంచి వచ్చిన వాళ్లు. ఎన్నో ఆటుపోట్లను ఎదుర్కొని ఆర్మీలో ఉద్యోగాలు సంపాదించారు. అందుకే ఇప్పటికీ వారు పేదరికాన్ని మర్చిపోలేదు. నిరుపేదలు, అన్నార్థులకు అండగా ఉండాలనుకున్నారు. ‘పాలమూరు సైన్యం’ పేరుతో వాట్సప్ గ్రూప్ ఏర్పాటు చేసి, అభాగ్యులకు సాయంగా నిలుస్తున్నారు. దేశంతోపాటు పేదలకూ సేవ చేస్తున్నారు.
మహబూబ్నగర్ పట్టణానికి చెందిన ఆంజనేయులు చిన్నతనంలోనే తల్లిదండ్రులను కోల్పోయాడు. ఎన్నో కష్టాలు పడి చదువుకున్నాడు. పట్టుదలతో శ్రమించి ఆర్మీ ఉద్యోగం సాధించాడు. ఈ క్రమంలోనే ప్రభుత్వమిచ్చిన స్థలంలో ఓ ఇంటిని నిర్మించుకోగా, కొందరు దానిని అన్యాయంగా కూల్చేశారు. ఆ సమయంలో ఆంజనేయులు ఎంతో బాధపడ్డాడు. స్నేహితుల సహకారంతో ఆ సమస్యనుంచి బయటపడ్డాడు. అప్పుడే తనలా అన్యాయానికి గురైనవారు, నిరుపేదలు, అనాథలకు అండగా నిలువాలని సంకల్పించాడు. అందుకోసం తన మిత్రులతో కలిసి ‘పాలమూరు సైన్యం’ పేరుతో ఓ వాట్సాప్ గ్రూపు ఏర్పాటు చేశాడు. వివిధ పత్రికలు, టీవీ చానెళ్లు, సామాజిక మాధ్యమాల ద్వారా కష్టాల్లో ఉన్నవారి వివరాలు తెలుసుకుంటూ, వారిని ఆదుకునేందుకు కృషి చేస్తున్నాడు.
మొదట్లో చిన్నచిన్న కార్యక్రమాలు చేపట్టిన ఆంజనేయులు, ఆ తర్వాత ‘పాలమూరు సైన్యం’ సేవా కార్యక్రమాలను మరింతగా విస్తరించారు. ఆయనతోపాటు ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాకు చెందిన రమేశ్ కుమార్, కుర్మత్రెడ్డి, వీడీ నాయక్, పార్పల్లి రాము, సాయికుమార్, ఉమ్మడి వరంగల్కు చెందిన బద్దుల సుధాకర్, బోడ మల్సూర్, ఏపీ ప్రకాశం జిల్లాకు చెందిన అంకిరెడ్డి, బీఎన్ రెడ్డిసహా అనేకమంది సేవా కార్యక్రమాలకు ముందుకొచ్చారు. వీరంతా సైన్యంలో పనిచేస్తున్నవారే. సరిహద్దుల్లో దేశానికి సేవ చేస్తూ, స్వస్థలంలో పేదలకు సహాయం అందిస్తున్నారు. సెలవులకు సొంత ఊళ్లకు వచ్చినప్పుడు సేవా కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. కష్టాల్లో ఉన్నవారి గురించి తెలుసుకొని సాయం చేస్తున్నారు. ఆర్థికంగా ఇబ్బంది పడుతూ, ఉన్నత చదువులకు దూరమవుతున్న పేద విద్యార్థులకు ఫీజులు కడుతున్నారు. క్రీడల్లో రాణిస్తున్న పేద చిన్నారులకు ఆర్థిక సాయం చేస్తున్నారు. ఆకలితో ఉన్నవారికి నిత్యావసర సరుకులు అందిస్తున్నారు. ప్రాణాపాయంలో ఉన్న వారికి రక్తదానం చేస్తూ, ప్రాణాలు కాపాడుతున్నారు. సరిహద్దుల్లో దేశసేవ చేస్తూ ప్రాణాలు కోల్పోయిన సైనికుల కుటుంబాలకూ అండగా నిలుస్తున్నారు. వీర సైనికుల విగ్రహాలు ఏర్పాటు చేసి, తగిన విధంగా గౌరవించుకుంటున్నారు.
నేనూ ఎన్నో కష్టాలుపడి ఈ స్థాయికి వచ్చా. అందుకోసమే పేదవాళ్లకు అండగా ఉండాలని నిర్ణయించుకున్నా. స్నేహితుల సాయంతో ‘పాలమూరు సైన్యం’ ఏర్పాటు చేశా. నాతోపాటు సైన్యంలో పనిచేసే ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాకు చెందిన వెయ్యిమంది వరకూ ఇందులో సభ్యులుగా ఉన్నారు. ఓవైపు దేశాన్ని కాపాడుతూనే, అవసరమైన వారికి సాధ్యమైనంత సాయం చేయాలన్నదే మా లక్ష్యం. పేదరికం కారణంగా చదువుకోలేని వారికి సాయం అందిస్తున్నాం. ఏ దిక్కూలేని అనాథలకు అండగా నిలుస్తున్నాం. వాట్సాప్ గ్రూపుతోపాటు ఓ ఫౌండేషన్ ఏర్పాటు చేసి, సేవా కార్యక్రమాలను మరింత విస్తరించాలని అనుకుంటున్నాం.
ఆంజనేయులు,సైనికుడు, మహబూబ్నగర్.
మాదీ నిరుపేద కుటుంబమే. కష్టం అంటే ఏమిటో చిన్నప్పటి నుంచే తెలుసు. 15 ఏండ్లుగా సైన్యంలో పనిచేస్తూ, దేశసేవ చేస్తున్నా. ఈ ఉద్యోగం లేకుంటే ఎలా ఉండేవాళ్లమో ఊహించగలను. అందుకే ఉద్యోగం వచ్చిన తర్వాత పేదలకు చేతనైనంత సాయం చేసేందుకు సిద్ధంగా ఉంటున్నా. తోటి సైనికుడు ఆంజనేయులు నిబద్ధతతో మాలాంటి వాళ్లందర్నీ ఏకం చేశాడు. అవసరం ఉన్నవారికి సాయం చేస్తున్నాం. ఈ ఖర్చులను మేం ఎప్పుడూ భారంగా భావించం. మా కుటుంబాలను చూసుకుంటూనే, సేవా కార్యక్రమాలను నిర్వహిస్తున్నాం. కష్టాల్లో ఉన్నవారి గురించి తెలుసుకొని, వాస్తవాలను నిర్ధారించుకొని సాయం అందిస్తున్నాం.
రమేశ్ కుమార్, సైనికుడు, చిన్న రాజమూరు.
-పెద్ది విజయ భాస్కర్ ,మహబూబ్నగర్, నమస్తే తెలంగాణ ప్రతినిధి