న్యూఢిల్లీ, సెప్టెంబర్ 13: ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్ను ఆవిష్కరించడమేకాదు.. మరో సంచలన విషయాన్ని బయటపెట్టింది. తమ ఎలక్ట్రిక్ స్కూటర్ ఫ్యాక్టరీని పూర్తిగా మహిళలే నడుపుతారని ఓలా సహ వ్యవస్థాపకుడు భవిష్ అగర్వాల్ వెల్లడించారు. ఈ ప్లాంటులో పూర్తిస్థాయిలో 10,000 మహిళల్ని నియమించనున్నట్లు ఆయన ప్రకటించారు. ‘ఆత్మనిర్భార్ భారత్కు ఆత్మనిర్భార్ మహిళలు కావాలి! ఓలా ఫ్యూచర్ ప్లాంట్ను పూర్తిగా మహిళలే నడుపుతారు. పూర్తిస్థాయిలో 10,000+ మహిళల నియామకం. మొత్తం మహిళలే నిర్వహించే ఫ్యాక్టరీల్లో ప్రపంచంలోకెల్లా ఇదే పెద్దదవుతుంది’ అంటూ సోమవారం భవిష్ ట్వీట్చేశారు. ప్లాంట్లో నియమితులైన మొదటిబ్యాచ్ మహిళలున్న వీడియోను ఆయన షేర్చేశారు.
ఈ తొలిబ్యాచ్కు ఆయన స్వాగతం చెపుతూ, అంతర్జాతీయంగా మహిళలతో నడిచే ఆటోమొబైల్ ప్లాంట్ ఇదే అవుతుందని తెలిపారు. వారిలో ఉత్పత్తి నైపుణ్యాల్ని పెంపొందించేందుకు, శిక్షణ ఇచ్చేందుకు కంపెనీ గణనీయమైన పెట్టుబడులు చేస్తున్నదని, ఓలా ఫ్యూచర్ఫ్యాక్టరీలో ప్రతీ వాహనాన్నీ మహిళలే ఉత్పత్తిచేస్తారని వెల్లడించారు. తమిళనాడులో తొలి ఎలక్ట్రిక్ స్కూటర్ ఫ్యాక్టరీని రూ.2,400 కోట్ల పెట్టుబడితో నెలకొల్పనున్నట్లు గతేడాది ఓలా ప్రకటించింది. తొలుత 10 లక్షల యూనిట్ల వార్షిక సామర్థ్యంతో ప్లాంటు పనిచేస్తుందని, తదుపరి 20 లక్షలకు పెంచుతామని, పూర్తిస్థాయిలో 1 కోటి స్కూటర్లను తమ ప్లాంటు ఉత్పత్తి చేస్తుందని ఓలా ఎలక్ట్రిక్ తెలిపింది. ఓలా ఎస్1 ఎలక్ట్రిక్ స్కూటర్ రెండు వేరియంట్లలో ఆగస్టు 15న ఓలా ఆవిష్కరించింది. వీటి ధరల్ని రూ. 99,999, రూ.1,29,999గా ప్రకటించింది. ఈ స్కూటర్ విక్రయాలు సెప్టెంబర్ 8 నుంచి ప్రారంభంకావాల్సిఉండగా, వెబ్సైట్లో సాంకేతిక సమస్యల కారణంగా విక్రయ ప్రక్రియను సెప్టెంబర్ 15కు వాయిదా వేసింది.