ఆయన.. తెలంగాణ పదాల సొబగును తన కలానికెక్కించుకున్నారు. పరవళ్లు తీసే జానపద గీతాలను గళానికెక్కించుకున్నారు. అక్షరసిరులతో లక్షలాదిమందిని అలరింపజేస్తున్నారు. ‘మాయదారి మైసమ్మో.. మైసమ్మా.. మనం మైసారం బోదమే మైసమ్మా!’ అంటూ ఒక తరం
మొత్తాన్నీ ఉర్రూతలూగించారు.. కవి, సినీ గేయ రచయిత గుండేటి రమేశ్.
కవిగా, జానపద గాయకుడిగా, గీత రచయితగా, నటుడిగా సినీరంగంలో ప్రత్యేక స్థానం సంపాదించుకున్న రమేశ్ది కరీంనగర్ జిల్లా చామనపల్లి గ్రామం. తల్లిదండ్రులు గుండేటి లక్ష్మి, వెంకటేశం. వీరిది చేనేత కుటుంబం. 1969 నవంబర్ 7న జన్మించిన రమేశ్, కరీంనగర్లోని రాజరాజేశ్వర ప్రభుత్వ కళాశాల నుంచి బీఏ పట్టా అందుకున్నారు. విద్యార్థి దశనుంచే కవితలు, పాటలు రాయడం ప్రారంభించారు. పేదరికం వెంటాడుతున్నా, కష్టాల కడగండ్లు ఎదురైనా అన్నిటినీ ఛేదించుకుంటూ ముందుకు సాగారు. 18 ఏండ్లకే ‘యువశక్తి’ పేరిట పాటల సంపుటిని ప్రచురించారు. ఆయన రాసిన ‘చుట్టు చుక్కలా చూడు నడుమ సంద్రున్ని చూడు’ అనే ప్రైవేటు గీతం ఎంతో గుర్తింపు నిచ్చింది. జానపదం, భక్తి, చేనేత వృత్తి నేపథ్యం మొదలైన అంశాలతో 200కు పైగా ప్రైవేటు గీతాలు రాశారు. ‘జాబిలమ్మ పదాలు’, ‘కరీంనగర్ జిల్లా ఆణిముత్యాలు’, ‘చేనేత చంద్రిక’ మొదలైన పుస్తకాలు వెలువరించారు.
తొలిపాటతోనే..
సినిమాల్లో పాటలు రాయాలన్న సంకల్పంతో ఎన్నో ప్రయత్నాలు చేశారు రమేశ్. చివరికి 1998లో ‘జై భజరంగ భళి’లో తొలి అవకాశం దక్కించుకున్నారు. ఈ సినిమాలో ఆయన రాసిన ‘వెండి వెన్నెల్లలోన అమ్మడూ.. పండిపోదాము రావే గుమ్మడు’ పాట ప్రముఖుల ప్రశంసలు అందుకున్నది. ఇందులో ప్రయోగించిన సరికొత్త పదబంధాలు, పోలికలు పాటకు వన్నెను తీసుకొచ్చాయి. తొలి పాటతోనే తన కలం బలమేంటో చూపించాడు.
యువత ఉర్రూతలు
‘కాలేజ్'(2000) సినిమాలో రాసిన ‘మాయదారి మైసమ్మో.. మైసమ్మా మనం మైసారం బోదమే మైసమ్మా’ పాట ఒక సంచలనం. అప్పట్లో ఏ వేదిక మీద అయినా వినిపించాల్సిందే. ముసలివాళ్ళతోనూ చిందులేయించిన గీతం ఇది. ఆకట్టుకునే పదాల సొబగు, యాస
ప్రధాన ఆకర్షణ. ‘జర’, ‘పరేషాన్’, ‘మైసారం’(మైసూర్), ‘జర్రంత’, ‘గాయబు’ వంటి పదబంధాలన్నీ తెలంగాణలో వాడుకలో ఉన్నవే. అచ్చమైన తెలంగాణతనాన్ని పాటలో ప్రతిఫలింపజేశారు రమేశ్. ఈ పాట వచ్చి రెండు దశాబ్దాలు గడుస్తున్నా ఇప్పటికీ ఎక్కడో ఒకచోట వినిపిస్తూనే, అలరిస్తూనే ఉంటుంది. ‘లవ్'(2001)లోనూ ‘వచ్చింది వచ్చింది చోరీ.. నైజాం పోరీ’ అనే పాట మాస్ మాస్గా మత్తెక్కిస్తూ సాగుతుంది. యువత హృదయాలను కొల్లగొట్టే టెక్నిక్ గుండేటి రమేశ్ కలానికున్నదని చాటి చెప్పింది. ‘కల్లు మత్తు కన్న పిల్ల లవ్వు మత్తు కిక్కురా కిస్సుమాయ తెలుసుకుంటే నిషా నీకు ఎక్కురా’ అంటూ అమ్మాయి ప్రేమ మత్తును, ముద్దులోని గమ్మత్తును మించింది లేనేలేదని యువకులకు వలపు సందేశాన్నిచ్చారు రమేశ్.
మనసెరిగిన పాటలు
‘నా మనసిస్త్తా రా!’ (2001)లో రాసిన ‘సక్కుబాయి సక్కుబాయి.. నువ్వే నాకు దిక్కుబాయ్’ పాట కథానాయకుడి మనసును, ప్రేమతీరును తెలుపుతుంది. సినిమాలోని సన్నివేశానికి తగినట్లుగా పాటను ఎంతో అద్భుతంగా మలిచారు. ‘నన్ను చూసి పాట రాసే ఆత్రేయ లేడులే.. రాసినా పాడేందుకు ఘంటసాల రాడులే’ తరహా వాక్య ప్రయోగాల తీరు వినూత్నంగా అనిపిస్తుంది. మనసు పాటలకు చిరునామాగా ఉన్న ఆత్రేయను గుర్తుచేస్తూ, తన మనసు భాషను, ప్రేమ గోసనూ తెలియజేయడం బాగుంది. ‘జోరుగా హుషారుగా’(2002)లోనూ ‘ఓ పిల్లా నీ నవ్వులు.. అరే.. మల్లె వాసన పువ్వులు’ పాట ఎంతో హుషారుగా, శృంగారభరితంగా సాగుతుంది. యువతకు హుషారు పంచే రీతిలో వైవిధ్యంగా ఈ పాటను తీర్చిదిద్దారు రమేశ్. ‘కుర్ కురే’(2008) సినిమాలోని మొత్తం ఆరు పాటలనూ ఈయనే రాశారు. ఇందులోని
‘వారెవ్వా వారెవ్వా మగువా’ పాటలో ప్రేయసిని పరువాల గువ్వగా భావించిన తీరు బాగుంది. రమేశ్ కలంలో గులాబీల ప్రేమ భాష ఎంత బాగా పండుతుందో, విప్లవ పదజాలమూ అంతే తీవ్రంగా భాస్వరమై మండుతుంది.
భక్తి.. రక్తి..
‘మేడారం జాతర’(2014)లో రమేశ్ రాసిన ‘అమ్మా సమ్మక్కతల్లి కోటొక్క దండాలే.. మాయమ్మ సారక్క నీకు నూటొక్క పూలదండలే’ పాట సమ్మక్క సారక్కల మహిమల్ని కీర్తిస్తూ సాగుతుంది. మేడారం మహత్తును, జాతర వైశిష్ట్యాన్ని ఎంతో వైభవోపేతంగా వివరిస్తుంది. ఆదిశక్తి స్వరూపాలుగా గిరిదేవతలు వెలసిన తీరును ఈ పాట ఎంతో ఘనంగా చాటింది. ‘పుత్రుడు’(2009)లో
‘చికెన్ ముక్కలాంటి పిల్లదానయ్యో’ అనే శృంగార గీతాన్ని నాటుగా, ఘాటుగా రాశారు రమేశ్. ఎంతో సరసంగా జానపదగతిలో దీన్ని ఆవిష్కరించారు. వీటితోపాటు ‘నేను నిన్ను ప్రేమిస్తున్నాను’, ‘తాజ్ మహల్’ వంటి పలు సినిమాల్లోనూ రమేశ్ పాటలు రాశారు. తెలంగాణ యాసను, పదాల పరిమళాల్ని తన పాటల్లో పొదిగారు గుండేటి రమేశ్. కవిత్వం, పాట రెండు కండ్లుగా ముందుకు సాగుతున్నారు ఈ జనం నాడి తెలిసిన గాయకుడు.
ఉద్యమాల పాట
‘లెనిన్'(2013)లోని ‘ఉద్యమాల బాట నడిచే తమ్ముడా! నీ బతుకుపై మమకారమేలర తమ్ముడా!’ అనే పాట, పోరుబాటను ఎంచుకుని సాగే యువకులనుద్దేశించి రాసింది. బంధాలన్నిటినీ విడిచిపెట్టి, ఆకలిదప్పులతో అడవుల్లో తిరిగే యువవీరుల జీవితాల గురించి ఇందులో కరుణ రసాత్మకంగా వర్ణించారు. ఆశయాల కోసం ఉద్యమాల్లో తిరిగే యువతకు బందూకే బంధువని, సూర్యుడే చుట్టమని చెప్పిన తీరు ఎంతో ఉన్నతంగా ఉంది. ‘విప్లవాగ్ని జ్వాలవైతివి ఉద్యమించే సూర్యుడైతివి నిశ్శబ్ద క్రాంతిరేఖ వైతివి’ అనే పంక్తుల్లో పోరుజేసే వీరుల పౌరుష పరాక్రమాలను తెలియజెప్పారు. విప్లవాగ్ని, జ్వాల, నిశ్శబ్ద క్రాంతిరేఖ వంటి పదబంధాలు పాటకు ఆవేశాన్ని అద్దాయి. ఈ సినిమాలోని ‘ఘల్లు ఘల్లు గజ్జెగట్టి గంతులెయ్యరో’ పాటకూడా రమేశ్కు మంచి పేరు తీసుకొచ్చింది.