జరిగిన కథ : కాశీయాత్ర చేస్తున్న మణిసిద్ధుడు అనే యతి.. గోపాలకునితో చెప్పిన కథలే కాశీమజిలీలు. 1930వ దశకంలో మధిర సుబ్బన్న దీక్షిత కవి వీటిని సృజించారు. పండిత పామరులందరినీ రంజింప చేసిన కథలివి. వీటిలో స్థూలంగా జానపదాలు, చారిత్రకాలు, పౌరాణికాలు కూడా ఉన్నాయి. ఈ అనుసృజనలో మీరు వరుసగా జానపద గాథలను చదువుతున్నారు. కృష్ణదేవరాయలి కథను మినహాయించగా.. ఇది తొలిభాగంలోని చివరి కథ.
కళింగ దేశాన్ని సింహధ్వజుడనే రాజు పాలిస్తున్నాడు. అతడికి వింత వస్తువులను సేకరించడం, వాటి గురించి తన మంత్రి ప్రభుకీర్తితోనూ ఇతర పండితులతోనూ చర్చించి.. వినోదించడం అలవాటు. ఎవరైనా వింతవస్తువులు చూపిస్తే పెద్దపెద్ద బహుమానాలు ఇస్తాడు. అతడిచ్చే బహుమానంపై మోజుకొద్దీ ఒకరోజు కొందరు జాలరివాళ్లు అద్భుతమైన చేపను తీసుకువచ్చారు. అదేం చిత్రమో కానీ.. ఆ చేప నీళ్లలోనుంచి బయటికి తీసిన చాలా సేపటివరకూ బతికే ఉంది. దాన్ని చూసి ముచ్చటపడిన రాజు వాళ్లకు గొప్ప బహుమానం ఇవ్వాలని నిశ్చయించుకున్నాడు. మిత్రులను, సామంతులను పిలిపించి ఆ వింతచేపను చూపించాడు. వాళ్లంతా తమ జీవితకాలంలో అటువంటి చేపను చూడలేదని చెప్పారు. అలా కొంతసేపు దానితో వినోదించిన తరువాత, ఆ చేపను తన భార్యలకు చూపడం కోసం అంతఃపురానికి పంపాలనుకున్నాడు సింహధ్వజుడు.
జాలరివాళ్లను పిలిచి..
“ఒరేయ్! ఇంతకీ ఈ చేప ఆడదా? మగదా?” అని అడిగాడు.
సింహధ్వజునికి యవ్వనంలో ఉన్న చక్కని భార్యలున్నారు. వారి శుద్ధాంతాలలోకి పోతుటీగనైనా పోనివ్వకుండా కట్టుదిట్టాలు చేశాడు. ఆ చేప మగదే అయితే దాన్ని, భార్యలు చూడకూడదనే అలా అడిగాడు.
“రాజా! చేపలలో ఆడ, మగ తేడాలు కనిపెట్టడం కష్టం. మాకు తెలియదు” అని చెప్పారు జాలరివాళ్లు.
అప్పుడు ఉన్నట్లుండి ఆ చేప ఫక్కుమంటూ నవ్వింది. కొంతసేపు గిలగిల కొట్టుకుని ప్రాణాలు విడిచిపెట్టింది.
ఆ వింతను చూసి, సింహధ్వజునితో పాటు సభాసదులంతా ఆశ్చర్యపడ్డారు.
రాజు తన మంత్రిని ఉద్దేశించి..
“ప్రభుకీర్తీ! ఈ చేప ఎందుకు నవ్విందో నువ్వు చెప్పగలవా?” అని ప్రశ్నించాడు.
అందుకు ప్రభుకీర్తి..
“మహారాజా! నీటినుంచి బయటపడిన చేప చాలాసేపు బతికి ఉండటమే వింత. మీరా చేప ఆడదో మగదో చెప్పమని అడగడం మరో వింత. ఇంకా ఆ చేప ఎందుకు నవ్విందో చెప్పమంటే నా తరమా?!” అన్నాడు.
మంత్రి మాటలు వింటూనే రాజు మండి
పడ్డాడు.
“చేప ఊరికే నవ్వదు. ఏదో ఓ కారణం ఉండకపోదు. నీకు సరిగ్గా ఆరుమాసాలు గడువిస్తున్నాను. ఆలోపు అదేమిటో చెప్పకపోతే, నిన్ను ఉరి తీయిస్తాను. నీ ఆస్తి ప్రభుత్వపరం చేస్తాను. నీ కుటుంబానికి నా రాజ్యంలో నిలువ నీడైనా లేకుండా చేస్తాను” అని కఠినంగా పలికాడు.
చేసేది లేక మౌనంగా ఇంటికి వెళ్లాడు ప్రభుకీర్తి. మధ్యాహ్న సమయం కావడంతో ఆయన భార్య, భోజనానికి లెమ్మని పిలిచింది. కానీ,
“నాకు వద్దు. మీరు తినండి” అని చెప్పాడు ప్రభుకీర్తి. ఎంత బతిమాలినా కారణం ఏమిటో చెప్పలేదు.
ప్రభుకీర్తికి ప్రద్యుమ్నుడనే కొడుకు, లవంగి అనే కూతురు ఉన్నారు.
తండ్రి భోజనానికి రాని కారణంగా, పిల్ల
లిద్దరూ తండ్రి వద్దకు చేరారు.
“నాన్నగారూ! ఏదో కారణం లేకుండా మీరు భోజనం మానేయరు. ఆరోగ్యం బాగాలేదా? మరేదైనా సమస్య ఉందా?!” అని అడిగారు.
అప్పుడు ప్రభుకీర్తి ఆనాడు రాజసభలో జరిగినదంతా పిల్లలతో చెప్పాడు.
ప్రద్యుమ్నుడు తండ్రిని ఊరడిస్తూ..
“నాన్నా! మనకు ఆరునెలలు గడువుంది. ఆలోపుగా దేవుడే ఏదైనా దారి చూపిస్తాడు. నేను రేపే దేశాటనకు బయల్దేరుతాను. ఎవరైనా పండితులను కలిసి, ఈ గడ్డు సమస్యకు సమాధానం తెలుసుకుంటాను” అన్నాడు.
“అన్నా! నేను కూడా నీతో వస్తాను” అడిగింది లవంగి.
“ఆడపిల్లవు నువ్వెందుకులేమ్మా!” అని ప్రద్యుమ్నుడు వారించబోయాడు.
కానీ, లవంగి పట్టుబట్టింది. ప్రద్యుమ్నునికి తప్పలేదు. గుర్రపు స్వారీలో మిక్కిలి నైపుణ్యం కలిగిన అన్నాచెల్లెళ్లిద్దరూ తక్కువకాలంలోనే ఎక్కువ దూరం ప్రయాణించారు. కళింగ రాజధాని ధర్మాపురం నుంచి బయల్దేరి, ఆ సాయంత్రానికే అమరావతి నగరానికి చేరుకున్నారు.
* * *
బుద్ధిమంతుల్లా కనిపించిన వారినందరినీ ‘చేప నవ్విన కారణం ఏమై ఉంటుంది?’ అంటూ ఆరా తీశారు. వాళ్ల ప్రశ్న తెలుసుకున్న వాళ్లంతా పరిహాసం చేశారు కానీ, సమాధానం చెప్పలేకపోయారు. అన్నాచెల్లెళ్లు కొంతకాలం అక్కడే ఉండి ప్రయత్నించారు. అయినా, లాభం లేకపోయింది. ఒకనాడు ప్రద్యుమ్నుడు చెల్లెలిని పిలిచి..
“అమ్మాణీ! మనం అనుకున్నంత బుద్ధిబలం కలిగినవాళ్లెవరూ ఈ నగరంలో ఉన్నట్లు కనిపించడం లేదు. మనం వేరే నగరానికి వెళ్లడం మంచిది. అయితే ఈవేళ కోటగోడ మీద ఒక శాసనం చూశాను. ఈ నగరపు యువరాణి ప్రభావతి సకల విద్యల్లోనూ ఆరితేరినదట. వరుసగా మూడు ఆటలు ఆమెతో చదరంగం ఆడి, గెలిచినవారికి ఆమెనిచ్చి పెళ్లి చేస్తారట. గెలవలేకపోతే ఉరి తీస్తారట. మనిద్దరికీ చదరంగం బాగా వచ్చు కదా! నేను వెళ్లి ఆ అమ్మాయిని ఓడించి వద్దునా?!” అని అడిగాడు.
“అన్నా! మనం వచ్చిన పని మరిచిపోయి, వేరే పనులమీద దృష్టి పెట్టడం మంచిది కాదు. ఆటలో గెలుపు ఓటములు ముందుగా నిర్ణయించలేం కదా! అందుచేత ఈ పని తలపెట్టక
పోవడమే మంచిది” అన్నది లవంగి.
అతడు చెల్లెలి మాటను పాటించలేదు. మరునాడే కోటవద్దకు వెళ్లి అక్కడి ఉద్యోగస్తులతో.. తాను ప్రభావతితో చదరంగం ఆడటానికి వచ్చానని తెలియచేశాడు.
అందుకా ఉద్యోగులు..
“అయ్యో కుమారా! చూడబోతే పాలుగారే పసివాడిలా ఉన్నావు. నీకు బతుకుమీద ఆశ లేదా ఏమిటి? నీవంటి వారెందరో ప్రభావతి చేతిలో ఓడి, ఉరికంబం ఎక్కారు. మా మాట విను. వెనక్కి తిరిగి చూడకుండా ఇక్కడినుంచి వెళ్లిపో” అన్నారు.
కానీ ప్రద్యుమ్నుడు పట్టుబట్టేసరికి, రాకు
మారికి ఆ వార్త తెలియచేయక తప్పలేదు. తనతో చదరంగం ఆడటానికి ఇటీవలి కాలంలో ఎవరూ రాకపోవడం వల్ల, ప్రభావతి ఉత్సాహంగా అంగీకరించింది.
ప్రద్యుమ్నుడు కేళీగృహంలోకి ప్రవేశించాడు. అతని ముందు ఒక బంగారు బల్లపై చందరంగం అమర్చి ఉన్నది. మరికొంతసేపటికి పురుష
మోహన సౌందర్యంతో, అతిశయ లావణ్యం ఉట్టిపడే రూపంతో చెలికత్తెలతో కూడినదై
ప్రభావతి మందగమనంతో వచ్చి కూర్చుంది.
ఆమె తళుకులు చూసిన ఏ కుర్రవాడికైనా మతిపోవడం ఖాయమే. మెదడు మొద్దుబారి
పోవడం సామాన్యమే. ఆమె కదలికలు అతి సమీపంనుంచి చూసిన తరువాత ఎంతటి రుషులైనా జావగారి పోవాల్సిందే.
ప్రద్యుమ్నుడు పాపం రెప్పలార్పడం కూడా మర్చిపోయాడు. ఆటంతా తప్పు ఎత్తులే వేశాడు. మొదటి రెండు ఆటల్లోనూ ప్రభావతి చేతిలో చిత్తుచిత్తుగా ఓడిపోయాడు.
అప్పటికి అతనికి ఒంటిమీద తెలివి వచ్చింది. చివరి ఆటను పట్టుదలగా ఆడి, కేవలం ఆరంటే ఆరే ఎత్తుల్లో ప్రభావతి ఆట కట్టివేశాడు.
“ఇతడు రెండు ఆటలు ఓడిపోయాడు. తీసుకుపోయి ఉరి తీయించండి” అని కఠినంగా ప్రకటించి, ప్రభావతి అక్కడినుంచి వెళ్లిపోయింది.
రాజభటులు ప్రద్యమ్నుడిని తీసుకుపోయి, రాజు ముందు నిలబెట్టారు.
“మహారాజా! నేను ఒక ఆట గెలిచాను. ప్రభావతి నన్ను రెండు ఆటల్లో మాత్రమే గెలిచింది. మీ శాసనం ప్రకారం ఆమెతో వరుసగా మూడు ఆటల్లో ఓడినవారిని మాత్రమే ఉరి తీయించాలి. కనుక ఈ శిక్ష నా విషయంలో చెల్లుబడి కాదు” అని వాదించాడు ప్రద్యుమ్నుడు.
రాజు సంకటంలో పడ్డాడు. మంత్రులతో చర్చించాడు. రెండాటలు గెలిచినవాళ్లను ఏం చేయాలో శాసనంలో లేదు కనుక, ధర్మనిర్ణయం జరిగేవరకూ ఉరిని వాయిదా వేయించాడు.
* * *
ప్రభావతితో ఆటకోసం వెళ్లిన తన అన్నయ్య భంగపాటుకు గురికావడం లవంగికి తెలిసింది. ఆమె పురుష వేషం ధరించింది. ‘రాకుమారితో చదరంగం ఆడటానికి వచ్చాను’ అని అధికారులకు తెలియచేసింది.
“నిన్ననే ఒకడికి కొద్దిలో ఉరి తప్పింది. కుర్రాడా! మా మాట విని వెనక్కుపో” అన్నారు అధికారులు.. పురుషవేషంలో ఉన్న లవంగితో.
కానీ, లవంగి వినిపించుకోలేదు. కేళీగృహంలోకి ప్రవేశించి, ఆటకు ఉద్యుక్తురాలైంది.
ఎప్పటిలానే వయ్యారాలు ఒలకబోస్తూ ప్రభావతి వచ్చి కూర్చుంది.
‘ఈమె అందం చూస్తే నాకే మోహం కలుగుతున్నది. ఇక మగవాళ్లు మోసపోవడం ఒక లెక్కా!’ అనుకున్నది లవంగి.
ఆట ప్రారంభమైంది. వరుసగా రెండు ఆటలు లవంగి గెలిచింది. తనముందు కూర్చుని ఉన్నది పురుషుడు కాదు.. స్త్రీ అని ప్రభావతికి తెలియదు. ‘నా అందాన్ని చూసి మతులు పోగొట్టుకున్న మగవాళ్లెందరో ఉన్నారు. ఇటువంటివాడు ఇప్పటివరకూ తారసపడలేదు’ అనుకున్నది ప్రభావతి.
పట్టుదలతో ఎంత జాగ్రత్తగా ఆడినా, మూడో ఆటలో కూడా లవంగిపై గెలవలేకపోయింది.
సుదీర్ఘ నిరీక్షణ తరువాత తన కూతురికి సరైన వరుడు లభించాడని తెలిసిన మహారాజు చాలా సంతోషించాడు. అయితే ఉరి తీయకుండా చెరలో ఉండిపోయిన ప్రద్యుమ్నుడిని ఏం చేయాలో అతడికి తోచింది కాదు.
లవంగినే పిలిచి..
“ఏం చేయమంటావ్?!” అని సలహా
అడిగాడు.
“శాసనంలో దీనికి తగిన సూచనలు లేని
కారణంగా, అతడిని విడిచిపెట్టేయాలి” అని లవంగి సమాధానమిచ్చింది. ప్రభావతి వరమాలను పురుషవేషంలోని లవంగి మెడలో వేసింది.
ప్రద్యుమ్నుడు చెరనుంచి విడుదలయ్యాడు. లవంగి ఎలాగో అన్నను ఒంటరిగా కలుసుకుని, తన పురుష వేషం తీసివేసింది. అన్నను పెళ్లి
కొడుకుగా సిద్ధం చేసింది. వాళ్లిద్దరి పోలికలు ఒకేలా ఉండటంతో, ఎవరూ ఈ సంగతిని కని
పెట్టలేకపోయారు.
ప్రద్యుమ్నుడికి ప్రభావతితో అంగరంగ వైభవంగా వివాహం జరిగింది. కొంతకాలం కొత్త
భార్యతో ప్రద్యుమ్నుడు అత్తవారింట సుఖాలను అనుభవించాడు.
* * *
ఇలా ఉండగా ఒకరోజు..
“మనం ఇక్కడికి వచ్చి, అప్పుడే నెల దాటి
పోయింది. సంసారంలో పడి, నాన్నమాటే మరిచిపోయావు. నువ్వంతగా పెళ్లాన్ని విడిచిరాలేకపోతే నేను ఒక్కదాన్నే వెళ్లి, నాన్నను రక్షించుకుంటాను” అని అన్నను హెచ్చరించింది లవంగి.
“నన్ను పితృద్రోహిని అనుకున్నావా?! పద నేనూ వస్తున్నాను” అన్నాడు ప్రద్యుమ్నుడు.
ఆనాటి అర్ధరాత్రి ఎవరితోనూ చెప్పకుండా అన్నాచెల్లెళ్లిద్దరూ కాలినడకనే బయలుదేరారు. తెల్లవారేదాకా నడిచి ఒకానొక అడవిలోని తటాకం వద్దకు చేరుకున్నారు. మార్గాయాసం తీర్చుకుని, తటాకంలో స్నానం చేశారు. తమతోపాటు తెచ్చుకున్న ఆహారాన్ని భుజించారు.
సాయంకాలం లోపుగా ఏదైనా గ్రామం చేరుకోవాలని మళ్లీ బయలుదేరారు. చీకటి పడుతున్నా తల దాచుకోవడానికి వారికో చిన్నపల్లె కూడా కనిపించలేదు. చేసేదేమీ లేక ఒక మర్రిచెట్టు కింద ఆ రాత్రి తలదాచుకోవాలని నిర్ణయించుకున్నారు. చెల్లెలిని పెందలకడనే తెచ్చుకున్న తిండితిని నిద్రపొమ్మన్నాడు ప్రద్యుమ్నుడు.
పగలంతా నడిచి, చాలా శ్రమపడటం వల్ల లవంగి త్వరగానే నిద్రపోయింది. వెన్నెల విరగకాస్తున్నది. ప్రద్యుమ్నుడు ఆయుధం ధరించి కాపలా కాయసాగాడు.
ఒళ్లెరగకుండా నిద్రపోతున్న చెల్లెలి పాదాలను గమనించి..
‘చిగురుటాకుల కన్నా మెత్తనివైన ఈమె పాదాలెంతగా కందిపోయాయో! అయ్యో నేనెంత కఠినాత్ముణ్ని?! వెంట వస్తాననగానే వద్దని చెప్పకుండా తీసుకొచ్చి, కష్టాలపాలు చేశాను. ఈ చుట్టుపక్కల ఒక్క చిన్నపల్లె కూడా లేదు. తినడానికి సరైన తిండి లేదు. ఒకవేళ ఏ నడిరాత్రిలోనో ఈ పసిదానికి దాహం వేస్తే ఏం చేయాలి?’ అనుకున్నాడు ప్రద్యుమ్నుడు.
వెంటనే మర్రిచెట్టు కొమ్మలపైకి ఎక్కి, చుట్టు
పక్కల ఏదైనా తటాకం ఉందేమోనని పరికించ సాగాడు. ఇంతలో ఆ చెట్టుతొర్రనుంచి మూడుబారల పొడవున్న కృష్ణసర్పం ఒకటి జరజర పాకుతూ వచ్చింది. ప్రద్యుమ్నుని చూసి, పడగ విప్పి బుసలు కొట్టసాగింది. ప్రద్యుమ్నుడు వెంటనే తన ఒరనుండి సర్రున కత్తిలాగి ఆ సర్పం తల నరికేశాడు. అది చెట్టుకింద పడి, ప్రాణాలు విడిచింది.
ఆ మాను చివర రెండు భైరవపక్షులు గూడు కట్టుకుని కాపురం చేస్తున్నాయి. అవి ఆరునెలలకు ఓసారి గుడ్లు పెడుతుంటాయి. ఆ గుడ్లన్నిటినీ ఈ కృష్ణసర్పం తినేస్తూ వచ్చింది. ఇలా అనేకమార్లు జరిగింది. నేటికి ఆ పాముకు కాలం తీరి, ప్రద్యుమ్నుని చేతిలో చచ్చింది.
అది చూసిన ఆడపక్షి..
“నాథా! మన వంశం అభివృద్ధి చెందకుండా చేస్తున్న దొంగపామును ఆ మహావీరుడు వధించాడు. అతనికి మనమేదైనా ప్రత్యుపకారం చేయాలి” అన్నది.
అందుకు మగ భైరవపక్షి..
“మనకంటే అధికులైన మానవులకు మనమేం సాయం చేయగలం? ఉపకారం చేయలేకపోయినా కనీసం, కృతజ్ఞత అయినా చూపించి వస్తాను” అని ఎగురుతూ వెళ్లి ప్రద్యుమ్నుని ముందు వాలింది. తన కృతజ్ఞతను అతనికి వెల్లడించింది.
“చీమలు దూరని ఈ చిట్టడవిలోకి తమరెందుకోసం వచ్చారు?” అని ప్రశ్నించింది.
“చేప నవ్విన కారణం తెలుసుకోవడానికి వచ్చాను” అని చెప్పాడు ప్రద్యుమ్నుడు.
అందుకా భైరవపక్షి..
“అయ్యా! నిపుణమతులైన మానవులకు తెలియని రహస్యాలు మాకు తెలుస్తాయా? ఒక విశేషం చెబుతాను ఆలకించండి. ఈ కృష్ణసర్పం శిరస్సుమీద ఒక దివ్యమైన మణి ఉంటుంది. దానిని సంగ్రహించి, ఈ మర్రిచెట్టు తొర్రలో ప్రవేశిస్తే పాతాళలోకం కనిపిస్తుంది. మణిప్రభావం వల్ల అక్కడో పాతాళసుందరి మీకు వశమవుతుంది. పాతాళవాసులు ఎవరైనా మీ ప్రశ్నకు సమాధానం చెప్పగలరు. మీరు ప్రయత్నించండి. ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి.. ఈ మణిని మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ పోగొట్టుకోకండి. పాతాళం నుంచి బయటికి వచ్చిన తరువాత మీరు ఎప్పుడు తలుచుకున్నా, నేను వెంటనే వచ్చి మీ ముందు వాలుతాను” అని చెప్పి, తన భార్యను కలుసుకుంది.
ప్రద్యుమ్నుడు వెనువెంటనే మణిని సంగ్రహించి, మర్రిచెట్టు తొర్రలో ప్రవేశించాడు. నిర్జనారణ్యంలో తన చెల్లెలిని ఒంటరిగా వదిలేసి వెళుతున్నానని అతనికి ఆ క్షణంలో తోచలేదు.
(వచ్చేవారం.. చేప ఊరికే నవ్వదు-2)
– అనుసృజన నేతి సూర్యనారాయణ శర్మ