బడి దశ మొదలుకుని ఉద్యోగం, ఇంటర్వ్యూలు, సమావేశాలు తదితర సందర్భాల్లో తమ గొంతును పదిమందికి వినిపించి, మెప్పించాలనే తపన చాలామందికి ఉంటుంది. కానీ, మనలో దాగి ఉన్న ఉపన్యాస కళను ఎలా వెలికితీయాలో తెలియదు. దాంతో అడుగు ముందుకువేయరు. అడుగు పడినా స్వరపేటిక పెగలదు. ‘సరిగ్గా మాట్లాడలేమేమో, ముందున్న వారిని మెప్పించలేమేమో! మాట్లాడుతున్నప్పుడు ఎవరైనా తప్పుపడతారేమో! మాట్లాడటానికి తగినవాళ్లం కాదేమో’.. లాంటి భయాలు మనలోని వక్తృత్వ లక్షణాలను మరుగునపడేస్తాయి. అంతే.. చొరవ అవసరమైన సందర్భాల్లోనూ మౌనానికే పరిమితమైపోతాం. దీనివల్ల జరిగే నష్టం మామూలుగా అయితే పట్టించుకోనవసరం లేదు. కానీ ప్రపంచం ఎల్లలు చెరిగిపోయి కార్పొరేట్ ఇంటర్వ్యూలు, ప్రాజెక్ట్ డిమాన్స్ట్రేషన్స్ అనివార్యమైన పరిస్థితుల్లో.. ఆలోచనలను బలంగా చెప్పి సంస్థల యజమానులు, మేనేజర్లను ఓ వైపు, వినియోగదారులను మరోవైపు మెప్పించాల్సిన సందర్భాల్లో మన మౌనం మనల్ని వృత్తి జీవితంలో ఎదగకుండా అడ్డుకుంటుంది. రాజకీయాల్లో వక్తృత్వం అవసరం గురించి చెప్పాల్సిన పనేలేదు. ఉపన్యాస భీతిని అధిగమించడానికి వక్తృత్వ వికాస నిపుణుడు బాల్రెడ్డి దొమ్మాట 10 అధ్యాయాల్లో ఎన్నో కిటుకులు వివరించారు. ఎంతోమందిని ఉత్తమ వక్తలుగా తీర్చిదిద్దిన అనుభవానికి బాల్రెడ్డి ‘వక్త’ పేరుతో పుస్తక రూపం ఇచ్చారు. ఇందులోని సూచనలను అమలుపరిస్తే మనలో దాగిన ఉపన్యాసకుడు బయటికి రావడం ఖాయం.
రచన: బాల్రెడ్డి దొమ్మాట, పేజీలు: 178, వెల: 200
ప్రతులకు: ప్రధాన పుస్తక కేంద్రాలు
ఫోన్: 80081 16606
భారతదేశం అంటే సింధూనాగరికత, వేదాలు, ఉపనిషత్తులు, జ్యోతిషం, సంస్కృతం సహా వివిధ భాషల్లో వెలువడిన విశిష్టమైన సాహిత్యం, వివిధ మతాలు వెంటనే గుర్తుకువస్తాయి. ఇవే కాకుండా భారతదేశం అంటే అంతుచిక్కని రహస్యాల అపురూప శిల్ప సంపదను కలిగిన దేవాలయాలూ స్ఫురిస్తాయి. దాదాపు ఐదు వేల సంవత్సరాల పైచిలుకు నాగరికత కలిగిన భారతీయ సంస్కృతి, వారసత్వ సంపద విశిష్టతను
వీలైనంత సరళంగా పరిచయం చేస్తూ మనదేశపు తాత్తిక చింతన, వాస్తుశిల్ప రహస్యాలు, ప్రాచీన భారత నగరాల గురించి ఉదాహరణలతో వివరిస్తూ పూసపాటి శంకరరావు రచించిన పుస్తకం ‘అంతర్దర్శనం’. ఇది విద్యార్థులు, పరిశోధకులు, పండితులకు మంచి సంప్రదింపు గ్రంథం. సామాన్య పాఠకులకు ఓ విజ్ఞాన సర్వస్వం.
రచన: డా. పూసపాటి శంకరరావు,
పేజీలు: 663, వెల: 550,
ప్రచురణ: తేజోవిరాట్ ప్రచురణలు,
ప్రతులకు: ఫోన్: 98858 98297
-చింతలపల్లి హర్షవర్ధన్