అపూర్వ పాలనా దక్షతకు, అద్వితీయ కళా పిపాసకు కాకతీయులు నిలువెత్తు నిదర్శనం. పురాతన ఆలయాలు, సుందర కళారూపాలకు నిలయం ఓరుగల్లు సామ్రాజ్యం. కాకతీయులు తీర్చిదిద్దిన ప్రతి శిల్పం ఓ అద్భుతమే. ఆ ఘనతకు సాక్ష్యంగా నిలుస్తున్నది బొల్లికుంట గ్రామం.
ఓరుగల్లు పుట్టకోటకు దక్షిణాన, అగడ్త ఒడ్డున ఉన్నది.. బొల్లికుంట. కాకతీయుల ఆనవాళ్లతోపాటు అడుగడుగునా చారిత్రక ప్రాశస్త్యాన్ని నింపుకొన్నదీ పల్లె. గ్రామంలోకి అడుగుపెట్టగానే ఒకవైపు పుట్టకోట అగడ్త (చెరువు), మరోవైపు ప్రకృతి అందాల నడుమ శివకేశవాలయం దర్శనమిస్తుంది. ఆలయ ప్రాంగణంలో ముష్కరుల చేతిలో ధ్వంసమైన వేంకటేశ్వరస్వామి, ఆంజనేయస్వామి, నాగేంద్రస్వామి విగ్రహాలు కనిపిస్తాయి. ఆలయం ఎదుట నందీశ్వరుడి విగ్రహం, అంతరాలయంలో గణపతి మూర్తి, గర్భాలయంలో శివలింగం భక్తులకు దర్శనమిస్తాయి. ఆలయ గోడల నుంచి నిరంతరంగా నీటి ధారలు కారడం ఇక్కడి ప్రత్యేకత. ఈ నీరంతా ఎక్కడినుంచి వస్తుందనేది అంతుచిక్కని రహస్యం. పక్కనే గరుడ పెరుమాళ్లు, ఆంజనేయస్వామి ద్వారపాలకులై పలుకరిస్తారు. గర్భాలయంలో అభయ ముద్రలో వేంకటేశ్వరుడు దర్శనమిస్తాడు. స్వామికి భక్తవత్సలుడని పేరు.
భద్రంగా కాచే అమ్మవారు
శివకేశవాలయానికి ఆగ్నేయ భాగంలో ఒక పెద్ద బండపై కాళికామాత దర్శనమిస్తుంది. పన్నెండు భుజాలతో(ద్వాదశ భుజి), పదునైన ఆయుధాలతో.. రాక్షసుల తలలను తెగనరికినట్లు రౌద్ర గంభీరంగా కనిపిస్తుంది. అమ్మవారి మూర్తికి ఎదురుగా పోతరాజు విగ్రహంతోపాటు పాదుకలూ ఉన్నాయి. స్థానికులు ఈ అమ్మవారిని గంగాభవానిగా కొలుస్తున్నారు. పండితులు మాత్రం క్షుద్ర కాళికాదేవిగా, ఆదిపరాశక్తిగా భావిస్తున్నారు. కాకతీయుల కాలంలో తీవ్రమైన కరువు వచ్చినప్పుడు, ఈ అమ్మవారి కటాక్షం వల్లనే సమృద్ధిగా వర్షాలు కురిసినట్లు స్థానిక గాథలు వినిపిస్తున్నాయి.
రుద్రమ విగ్రహాలు
పోచమ్మ ఆలయ ప్రాంగణంలో రాణి రుద్రమమూర్తులుగా భావిస్తున్న రెండు విగ్రహాలున్నాయి. అశ్వంపై కూర్చొన్న ఓ యోధురాలు కరవాలంతో శత్రువులను సంహరిస్తున్నట్టు, కిందపడ్డ శత్రు సైనికుల తలలను గుర్రం కాళ్లతో తొక్కిస్తున్నట్టు.. భీకర యుద్ధ వాతావరణాన్ని తలపిస్తాయి. తన పాలన కాలంలో రుద్రమదేవి బొల్లికుంటలోని గంగాభవాని మాతకు, ఆదిపరాశక్తికి పూజలు చేసినట్లు తెలుస్తున్నది. ఆంజనేయస్వామి విగ్రహాలు, శివలింగాలు, పానవట్టాలు గ్రామంలో అక్కడక్కడా శిథిల స్థితిలో కనిపిస్తాయి. ఈ ప్రాంతంలో పురావస్తు అధికారులు పరిశోధనలు చేపడితే, మరిన్ని ఆసక్తికర విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉన్నది.
అద్భుతం.. త్రికూటాలయం: బొల్లికుంట గ్రామంలో అద్భుతమైన త్రికూటాలయం ఉంది. నాట్య మండపం కూలిపోయింది. ఆలయం మాత్రమే ప్రకృతి విపత్తులకు తట్టుకొని నిలబడింది. ప్రధాన ఆలయంలో సీతా లక్ష్మణ సమేత కోదండరాముడు కొలువై ఉన్నాడు. భద్రపీఠంపై మహావిష్ణువు దశావతారాలకు సంబంధించిన విగ్రహాలున్నాయి. ఇలాంటి విగ్రహాలు దేశవ్యాప్తంగా మూడు మాత్రమే ఉన్నట్లు చరిత్రకారులు చెబుతున్నారు. గర్భగుడిలో ఆళ్వారుల విగ్రహాలు దర్శనమిస్తాయి. ఇరువైపులా ఉన్న గర్భాలయాల్లోని విగ్రహాలు మాత్రం ముష్కరుల దండయాత్రలో ధ్వంసమయ్యాయి.
… రమేశ్, ఖిలా వరంగల్