అతడు ఓ మాజీ సైనికుడు. విధుల్లో భాగంగా సరిహద్దుల్లో కాపలా కాశాడు. శత్రువుల నుంచి దేశాన్ని కాపాడాడు. అతనో పక్షి ప్రేమికుడు కూడా. ఇంటినే సంరక్షణ కేంద్రంగా మార్చి, అరుదైన జాతులకు రక్షణనిస్తున్నాడు. నాలుగువందల విహంగాలతో సరికొత్త పక్షి ప్రపంచాన్ని సృష్టించాడు. అడవుల జిల్లా అయిన ఉమ్మడి ఆదిలాబాద్లో ‘బర్డ్ ఫాం’ ఏర్పాటే లక్ష్యమని చెబుతున్నాడు రాకేష్ మిస్త్రి, కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా కాగజ్నగర్ మండలం ఈజ్గాం విలేజ్ నెం 5కు చెందిన మాజీ ఆర్మీ జవాన్ రాకేష్ కుమార్ మిస్త్రి. ఈ వీర సైనికుడు అరుదైన పక్షులను పెంచుతూ తన ప్రత్యేకతను చాటుతున్నాడు. 2004లో బీఎస్ఎఫ్లో చేరిన రాకేష్ జమ్ము కశ్మీర్, పంజాబ్లతోపాటు ఈశాన్య రాష్ర్టాల సరిహద్దుల్లో పహరా కాశాడు. అబ్దూలియా పోస్ట్ ఆర్ఎస్ పురా సెక్టార్ (పాకిస్థాన్ సరిహద్దు)లో పని చేస్తున్నప్పుడు ఓ సంఘటన జరిగింది. ఇది అటవీ ప్రాంతం కావడంతో దేశదేశాల పక్షులు ఇక్కడికి వలస వచ్చేవి. ఓ రోజు పాకిస్థాన్తో హోరాహోరీగా కాల్పులు జరిగాయి. ఆ సమయంలో.. ఓ పక్షి తీవ్రంగా గాయపడింది. గిలగిలా కొట్టుకుంటూ కింద పడిపోయింది. దాన్ని చూసి చలించిపోయాడు రాకేష్. కొన్ని రోజులపాటు ఆ పక్షిని సంరక్షించాడు. కోలుకున్నాక కొండల్లో వదిలేశాడు. అప్పటినుంచి ఆయనకు పక్షులపై ప్రేమ పెరిగింది. గ్లోబల్ వార్మింగ్, పర్యావరణ కాలుష్యాల కారణంగా.. అంతరించిపోతున్న అరుదైన పక్షిజాతులను సంరక్షించేందుకు ఏదైనా చేయాలని నిర్ణయించుకున్నాడు.
ఉద్యోగ విరమణ తర్వాత..
2014లో ఉద్యోగ విరమణ చేశాడు రాకేష్. అప్పటి నుంచీ పక్షుల పెంపకంపై దృష్టి పెట్టాడు. 2015లో 20 పక్షులతో ఇంటి ఆవరణలోనే సంరక్షణా కేంద్రాన్ని ప్రారంభించాడు. అరుదైన, అంతరించిపోతున్న పక్షుల గురించి తెలుసుకొని.. ముంబై, ఢిల్లీ, కోల్కతా, హైదరాబాద్ తదితర ప్రాంతాలనుండి వాటిని సేకరిస్తున్నాడు. రాకేష్ దగ్గర బజ్రీ, ఆఫ్రికన్ లవ్ బర్డ్స్, ఫిషేర్స్, సన్కెన్యూ, ఫించెచ్, బెంగాలీ ఫించెస్, స్టార్ ఫించెస్, గోల్డెన్ ఫించ్, లూటినో, ప్యారా కిట్ బజ్డిస్, కాక్టేయిల్.. వంటి 400 రకాల పక్షులున్నాయి. ఇవన్నీ స్వేచ్ఛగా విహరించేలా ఏర్పాటు చేశాడు. మట్టి కుండలు, గడ్డి పరకల సాయంతో గూళ్లు నిర్మించాడు. సమయానికి ఆహారం అందిస్తూ కంటికి రెప్పలా కాపాడుతున్నాడు. పక్షుల ఆరోగ్య పరిస్థితులను ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ, ఏదైనా జబ్బు వస్తే వైద్యుల సాయంతో చికిత్స అందిస్తున్నాడు. ఇందుకోసం నెలనెలా వేలాది రూపాయలు ఖర్చు చేస్తున్నాడు. ఓ సామాన్యుడికి ఇది శక్తికి మించిన పనే.
‘హరితహారం’తో మనుగడ
చిన్నపాటి వ్యవసాయ కుటుంబం మాది. పదో తరగతి తర్వాత ఆర్మీలో చేరాను. 2008లో జరిగిన ఓ సంఘటన నన్ను పక్షుల సంరక్షణవైపు అడుగులు వేయించింది. ఒక్కో పక్షి జంట సేకరణకు రూ. 600 నుండి రూ.60వేల వరకు ఖర్చు అవుతున్నది. ముఖ్యమంత్రి కేసీఆర్ చేపట్టిన హరితహారంతో రాష్ట్రంలో వృక్ష సంపద పెరుగుతున్నది. ఫలితంగా పక్షులకు మరిన్ని ఆవాసాలు ఏర్పడుతున్నాయి. ఆ జాతి అంతరించకుండా ఉంటున్నది. పక్షుల సంరక్షణకూ ప్రభుత్వం చర్యలు తీసుకుంటే బాగుంటుంది. భావితరాలకు అద్భుత పక్షి ప్రపంచాన్ని అందించే అవకాశం ఉంటుంది. జిల్లాలోనే మొదటి బర్డ్ ఫాం ఏర్పాటు చేయాలన్నది నా లక్ష్యం. రాకేష్ కుమార్ మిస్త్రి