ఓదిక్కు జంట శెరువులు. మరోదిక్కు మాండవ్య మహాముని తానమాడి పూజించిన రాములోరి ఆనవాళ్లు. ఇంకో దిక్కున నక్కవాగు- మానేరు మట్టిమహిమలు. శ్రీ సీతారామలక్ష్మణుల గుళ్లో నాలుగొందల యేండ్లనుంచీ నందాదీపం ఓవైపు. వావి వరుసలతో పిలుచుకుంటూ, వర్ణభేదాలు మరిచిన ప్రజలు ఇంకోవైపు. ఇవన్నీ పొదుగుకున్నదీ.. ఆ పల్లెటూరు. పాడిపంటలకు, కవి పండితులకు నెలవు. అదే ‘ఆవునూరు’. ఆత్మీయతకు నిలువెత్తు నిదర్శనమీ ఊరు.
ఆ ఊళ్లో.. ఓరోజు అంబటాళ్లయింది. ‘డడ్డరం ఢమ్కా.. డడ్డరం ఢమ్కా..’ డప్పుల సప్పుడు శెవుల వడంగనే ఇంట్లోంచి దర్వాజళ్లకు వచ్చిండ్రు వాడకట్టోల్లందరు. మోకాళ్లదాకా దోతీ, ఖద్దరు బనీను, తలకు రుమాలు, చేతిల కర్రతో యాబై ఏండ్ల పెద్దమనిషి. ఒకైనె ఎత్తుకున్న గంపలకెళ్లి బిస్కిట్ పుడలు తీసుకుంట పొల్లగాండ్లకు పంచుతుండు. ఆళ్లంతా సంబురంగ “రాం రాం తాతా! రాం రాం తాతా!” అనుకుంట ఎగిరి దుంకుతున్నరు. లొల్లి లొల్లి కేక లేసుకుంట.. శీమల దండోలే రాం రాం తాత ఎంటవడుతుండ్రు. అందరి నోళ్లల్ల ‘రాం రాం తాతా’ అనే పేరే!
బత్తుల మల్లయ్య అసలు పేరును మరిసిండ్రు. ఒక్క బనీను లేకపోతే ‘గాంధీ తాతే’ అంటరు. బగ్గ మంచోడు. పెద్దోళ్ల మనసును ఎప్పుడో గెలిసిండు. ఇప్పుడు పిల్లల మనసును గెలుత్తండు. ఇంట్ల ఓ పూటకుంటే ఇంకోపూటకుండది. అయినా, తెగారం జేసి పొలగాండ్లకు బిస్కిట్లు పంచుతండు. ఊళ్లె మాటలచ్చిన పిల్లగాండ్ల దగ్గరినుండి కాటికి కాళ్లు సాపిన ముసలోల్లదాక అందరికీ ఆయినె తెలుసు. పగోల్లు లేని మనిషి. అందరి నోట్లో పండసొంటోడు. కానీ, ఊరుకు దూరంగా ఓ పాక ఏసుకొని ఉంటండు.
***
పొల్లగాండ్లకు బిస్కిట్లు వంచుడు అయిపేయింది. జబ్బ సంచిల శెట్ల మందులు ఓ పక్కకు సర్ది, ఓ అవ్విచ్చిన బువ్వకూర మూట వెట్టుకుండు. జబ్బ కేసుకొని ఇంటిదారి వట్టిండు.
“ఓ.. మల్లన్నా!” అని కేకలేసిన సప్పుడు మల్లయ్య శెవుల్ల దూరింది. ఆగి ఎన్కకు దిరిగిండు.
“నీయవ్వ.. పిలిత్తె ఇనత్త లేదాయే!” ఆయాసంగా ఎగపోత్తూ అన్నడు భూమయ్య.
“ఏంది తమ్మి.. గిప్పటిదాకా ఊళ్లెనే ఉన్న. గిప్పుడే ఇంటికి వోతున్న” అన్నడు మల్లయ్య.
కొంచెం సేపు దమ్ము తీసుకొని మళ్లీ శప్పవట్టిండు భూమయ్య.
“గడీల పొల్లగాండ్లు చెట్టిర్క ఆడిండ్రు. లక్ష్మణ్రావు దొర శిన్న కొడుకు రాకేశ్ దొర. తీట పోరడు కొన మండల్ల కెక్కిండు. మండకు పురుగు వట్టిందేమో పుటుక్కున ఇరిగింది. కింద వడ్డడు. బువ్వ కాలిరిగింది. పెద్దొరసాని, చిందొరసాని బగ్గ ఏడుత్తుండ్రు. ‘ఓరి భూమా.. గా బత్తుల మల్లిగాన్ని జల్ది దొల్కరాపో’ అన్నడు దొర కండ్లల్ల నీళ్లు దిర్గంగ. నువ్వు గిప్పుడే వోతున్నవని దుబ్బిగాడు జెప్పిండు. జెప్పన ఉరికచ్చిన.
“పా పోదం జెప్పన”
“తమ్మీ.. గీ బువ్వ మా ముసల్దానికిచ్చి దేవునిగుట్ట జంగల్లకోయి మందాకు తీసుకొత్త. కాలిరిగిందంటున్నవ్ గదా! ఇంటికాడ ఎల్తె బద్దలు తీసుకొనత్త. గట్లవోయి గిట్లత్త! నువ్వు వో” అన్నడు మల్లయ్య ఆతృతగా.
“నీ యవ్వ మల్లన్నా! జాముజేత్తె గా దొర తిడుతడే! సిన్నదొర బగ్గ ఏడుత్తుండు. తండ్లాడుతుండు. సూడబుద్దయిత లేదు. మనసుల కలికలి అయితంది. ఇంగో, గా బువ్వ మీ యింటికాడ వదినెకిచ్చత్త! నువ్వు గిట్లనే జంగల్కు వో..” అన్నడు భూమయ్య దీనంగా.
“సరే తమ్మీ! గట్లయితే ఇంటికాడ వదినె నడుగు. ఎదురుంగ గూట్లె ఎల్తె బద్దెలు పిడికెడన్ని వట్టుకొని నువ్వు దొరింటికివో! నేను దేవునిగుట్టకాడ మందాకు తెంపుకొని జెప్పనత్త.. పో!” అంటూ మూట యిచ్చి, జెంగల్ తొవ్వ వట్టిండు మల్లయ్య వేగంగా.
‘ఆపద ఎవలదయినా ఒక్కటే! పొల్లగాడు ఎంత తల్లడిత్తండో..’ అనుకుంట మందుశెట్టు ఆకును దూసుకొన్నడు. కొండెంగ జంగ లేసుకుంట దొరింటికి జేరుకుండు.
సుంకరి భూమయ్య దర్వాజల నిల్సుండి ఎదురుసూత్తుండు. మల్లయ్య కనవడంగనే పోయిన పానం తిరిగచ్చినట్లయింది. ‘అవ్వా!’ అనుకున్నడు. “రా.. రా.. మల్లన్నా!” అనుకుంట దొరింట్లకు దోలుకపోయిండు.
“ఏమాయెరా మల్లిగా బగ్గసేపయింది. శిన్నదొర నొప్పితోని మస్తు బాధ వడుతండు. అటు సూత్తెనే ఏడుపాగుత లేదురా!..” కంటతడి వెడుతూ అన్నడు దొర.
కొడుకు బాధ సూడలేక ఆయినె మనసంతా తల్లడమల్లడమైతంది.
“బాంచెన్ దొర.. మందు శెట్లకోసం బగ్గ లెంకిన. ఓ కాడ గుంపుగుండే! మ్యాకలు మేసినయ్. తిరుగంగ తిరుగంగ దొరికింది.. బాంచెన్ కాల్మొక్తా!” అన్నడు మల్లయ్య భయం భయంగా!
“ఆ సరేరా! ఆన్ని సూడు. జెల్ది మగ్గేట్టు కట్టుగట్టు. ఆడు ఉన్నకాడ ఉండర్రా! ఆంతోని కట్టముంది” అన్నడు దొర బాధ పడుతూనే.
మందాకును నూరి, రాకేశ్ దొర కాలుకు దెబ్బ తాకిన కాడ పూసిండు. ఎల్తె బద్దెలతోని కట్టు గట్టిండు. నొప్పి తగ్గినట్టయినంక కొంచెం నిమ్మల వడ్డడు శిన్నదొర.
“మల్లిగాని శెయ్యి గుణం మంచిది. ఎవల్లకాడ నేర్సుకున్నడోగానీ, అన్ని శెట్ల మందులూ తెల్సు. బగ్గ గొప్పోడు. ఆని వైద్యం అమృతం. గందుకే ఆడు మా ఊరి ధన్వంతరి. బొక్కలు పొల్లు పొల్లు ఇరిగినా ఒక్క కట్టు గడితె మగ్గుడే! ఒకటేమిటి బాలింతలకు పెద్దమందు, బాలింతకాడ తెలుపు, దమ్ము, దగ్గు.. సర్వవాతాలకూ, ఎన్నో రోగాలకు ఆని మందు అమృతం లెక్క పనిజేత్తది. కానీ, ఆడు నోట్లో నాలుక లేనోడు. కట్ట పట్టందుకు పైకం అడుగడు. ఎంతిత్తె గంతే దీసుకుంటడు. గింత తొక్కుబువ్వ వెట్టినా ఊకుంటడు. జెంగలంత దిరిగి దిరిగి పసర్లు దెత్తడు. అయినా, కూలీ అడగని ఉత్తముడు. మా ఊరికోసమే పుట్టిండేమో!
‘శరీర ధర్మమ్ ఖలు ధర్మసాధనమ్’ అన్నట్టు తన పెయ్యిని ఊరోళ్ల కోసమే కట్ట వెడుతడు. మనూరికి సంజీవని గుట్టసొంటోడు” అని కమల దొరసాని కితాబిచ్చింది.
“అయ్యో దొరసాని! గట్టెందుకంటరు. నాకు తెలిశిన సేవ జేత్తున్న.. బాంచెన్ కాల్మొక్తా!” అన్నడు మల్లయ్య.
“అరే మల్లయ్యా! నువ్వు మాటిమాటికీ ఈ బాంచెన్ మాట మరువురా! నువ్వు గొప్ప వైద్యుడివిరా! నీకు దెలుత్త లేదు గానీ ‘వైద్యో నారాయణో హరిః’.. అంటే వైద్యుడు నారాయణ దేవుడసొంటోడని పెద్దలంటరు. ఆపదలో ఆదుకొనే దేవుడివిరా నువ్వు. అంటరానోడివని దూరంగా ఉండద్దు..” అన్నది దొరసాని బిగ్గరగా.
“ఏందమ్మా!.. మల్లిగాన్ని పల్లకిల ఊరేగించమంటవా ఏంది?” అన్నడు దొర నవ్వుకుంట.
“అయ్యో దొర! దండం బెడుత.. అంటరానోన్ని గట్లెందుకంటరు. ఏదో దేవుడిచ్చిన వరం. దాంతోనే సేవ జేసుకుంట బతుకెల్ల దీస్తున్న. గంతే దొర” బెదిరిండు మల్లయ్య.
“ఓరే! మల్లిగా.. మాగ్గూడ మనసుండదారా! నీ గొప్పదనమంతా మా మనసులుంటది. కానీ, ఎందుకో.. దొరతనమడ్డమస్తుంటది. గంతేగని. నువ్వు గొప్పోడివిరా మల్లిగా!” అంటూ దొర తలదించుకున్నడు.
“అయ్యా! ఇరిగిన దగ్గర సర్ది కట్టు కట్టిన. నీళ్లు పడనియ్యకుండ్రి. పత్తెం రెండు రోజులు. ఎల్లిపాయ కారం తినిపించుండ్రి. అటెన్క కూరగాయలు తినొచ్చు. వారం దాకా పప్పులద్దు. దొరసానీ.. పది రోజులయినంకా మల్లొక్క కట్టు గడుత! ఇంగ పొయ్యత్త దొరా! దొరసానీ!” అంటూ బయల్దేరిండు మల్లయ్య .
“అరె మల్లయ్యా! నీతో అచ్చిన శిక్కే గిదిరా! నోరు లేనోడా! గుట్టలు శెట్లు దిరిగినవ్. ఉట్టిగనే పోతావ్రా?” బిగ్గరగా అన్నది దొరసాని.
“ఏమయింది దొర్సానీ! నేనేమన్న.. బాంచెన్ కాల్మొక్తా..” అంటూ బీరిపోయిండు మల్లయ్య.
“ఓ దొరా! ఆనికి పది రూపాయలియ్యి. తిండనక ఎండనక తిప్పల వడ్డడు. అరేయ్! నీ ముసల్దానికి ముద్దవప్పన్నం తీసుకపో!” అన్నది
దొరసాని.
“నీ కడుపు సల్లగుండ..” అంటూ పంచెలో అన్నం గట్టుకొని జబ్బ సంచిల ఏసుకున్నడు.
“పోయత్త బాంచెన్..” అంటూ బైలెల్లిండు.
“ఓ మల్లయ్య బాపూ! ఇంట్లకు రా.. నీయవ్వ! గింత పోద్దాటి కల్లు దాగిపో!” అని పిల్సిండు నర్సాగౌడు.
ఆళ్ల ఇంట్లకు వొయ్యి కూసున్నడు మల్లయ్య. ఆకు దెచ్చిచ్చి కల్లు అంపిండు నర్సాగౌడు.
“మొన్న మా అత్తకు వాతమత్తె మందువోత్తివి. నా బిడ్డకు బాలింతకాడ దెత్తివి. పైసల్ తీసుకొమ్మంటే.. ‘ఎందుకు తియ్ బిడ్డా’ అంటివి. ఇంగో ఇంకో దమ్ము వట్టు..” అని అన్నడు.
“అవ్వ! కొడుకా! కల్లు గట్టిగుంది” సరాయించుకుంట అన్నడు మల్లయ్య.
“బిడ్డా! లచ్చవ్వా! మన్మనికి పాలరుగుతున్నయా? ఇంగో, గీ యేరు చనువాలల్ల కొద్దిగ రంగరించి పొయ్యి. పాలరుగుతయ్, ఎక్కిల్లు వట్టయ్, ఏడ్వడు. మత్తుగ నిద్రవోతడు బిడ్డ..” వివరించి చెప్పిండు మల్లయ్య.
“ఆ.. గట్టనే మామా! నా శిన్నబిడ్డకు తెలుపువోతున్నది మామా..” అన్నది లక్ష్మి.
“అయ్యో బిడ్డా! మొన్నెందుకు జెప్పలే! రోగమత్తె శెప్పుకోవాలె. ధనమత్తె దాసుకోవాలె. శెప్పితె గదా బిడ్డా.. తెలిసేదీ” అన్నడు మల్లయ్య.
“ఆకువట్టు” అని మల్లోసారి కల్లు వంచిండు.
“సాలు బిడ్డా.. మూడు దమ్ములు వట్టిన. మా ముసల్దాని సేవ జేసుకోవాలె” అంటూ సంచి సర్దుకున్నడు మల్లయ్య.
“అవునే బాపు! కోడండ్లు జూసుకోరానే!”
“ఏం జేత్తు బిడ్డా.. కడుపు శింపుకుంటే కాళ్లమీద వడతది. ఏం జూత్తరు బిడ్డా.. కొడుకులలై ఎవల బతుకులు వాళ్లయేనాయె. ఇంక కోడండ్లేం జూత్తరు. ఇద్దరం గుడ్డిగూబలోలే ఉన్నం. ఏదో జెడ్డ గడియచ్చింది. మా ముసల్ది జాలట్ల జారి, ఇర్సుక వడ్డది. ఎన్నుపూస తొలిగింది. మంచంల వడ్డది. కాలుకో.. శెయ్యికో.. అయితే నేనే కట్టు గడుతుంటి. దావకాన్ల జూపిత్తే.. ‘ఆపరేషన్ శెయ్యాలె. లచ్చ గావలె’ అన్నరు. ఇగ నీనే పొయ్యి ఎలిగించుడు. శెయ్యి గాల్సు కునుడు అయితంది. ఎందర్నో మంచిగ జేసిన. నా అదృట్టం.. నా రాత గిట్లుంది. ఏ జన్మల పాపమో! ఇంగో గా కమలవ్వ దొర్సాని గింత బువ్వకూర వెట్టింది. చెరింత దింటం, పంటం. నా కథ శెప్తే తెల్లారది బిడ్డా!” అనుకుంటనే ఫక్కున వగిలిండు. కన్నీళ్లు కట్టలు తెంచుకున్నయ్ మల్లయ్యకు.
“అయ్యో బాపూ! ఏడ్వకు. నీకు బుద్ధి వుట్టినప్పుడు మా ఇంటికి రా. కడుపునిండ కల్లుతాగి పో. ఏమనుకుంటరో అనుకోకు బాపు!” అంటూ ఓదార్చిండు నర్సాగౌడ్.
కండ్లు తుడుసుకుంట, “గట్లనే బిడ్డ.. ఇంక పోయత్త” అంటూ గడుప దాటిండు మల్లయ్య.
దారెంటా పిల్లలు “రాం రాం తాతా! రాం రాం తాతా!” అనుకుంట, పెద్దోళ్లు వరుసబట్టి పలుకరిత్తండే ఆ బాధను మరిసిండు. ఇల్లు జేరి ముసలవ్వ సేవలో మునిగిండు. దొర్సాని బెట్టిన బువ్వ మూత ఇప్పి, కంచు పల్లేలల్ల శెరింత వెట్టుకచ్చిండు. ఒకటి ముసలవ్వకిచ్చి, తానోటి తీసుకొని తింటూ,
“దొర్సాని ముద్దవప్పు ఎట్లజేత్తదో గానీ.. కమ్మగుంది” అనుకుంట తిన్నరు. మంచంలకు ఒరిగి నిద్రలోకి జారుకున్నరు.
ఓనాడు అద్మరాత్రి.. ఇంటి తలుపులు దబ్బదబ్బ సప్పుడు. మల్లయ్య శెవిల వడ్డయ్.
దిగ్గున లేశిండు. “ఆ.. ఎవలయ్యా! వత్తున్న.. ఎవలూ?” అంటూనే తలుపు దీసిండు.
“ఆ! నేను మామా! నక్కల మల్రెడ్డిని. బాల్రెడ్డి బిడ్డ ఆపద వడుతంది. రాత్రి బువ్వదిన్నంక సురువయింది. వాడ కట్టంతా పరేషాన్ అవుతుండ్రు. నిన్ను దోల్కరమ్మని నన్ను తోలిండ్రు..”
“అయ్యో.. గట్లనే అత్తన్న అత్తన్న..” అనుకుంట మందుల సంచిని జబ్బకేసుకుండు మల్లయ్య.
అప్పటికే మూలసుక్క వొడిసింది. మబ్బులు గమ్మి వాన సురువయితంది. గందుకే, గొంగడి కొప్పెర గూడ వెట్టుకుండు.
“ఓ ముసల్దానా.. గట్ల ఊల్లెదాక పోయత్తా!” అని శెప్పుకొంట ఇంట్లకెంచి బైట వట్టడు.
“మామా.. సైకిలెక్కు తొక్కుతా! బయపడకు మామా!” అన్నడు మల్రెడ్డి.
“అయ్యో పటేలా! నాకు సైకిలెక్కరాదు. జెప్ప జెప్ప నడుత్త..” అంటూ బాట అందుకుండు.
కాసేపట్లనే వాన జోరందుకుంది. ముంతవోత వోత్తంది. ఇద్దరూ మాట్లాడుకుంటనే నడుత్తుండ్రు.
“ఔ పటేలా.. నరారి పంతులు, మంగలి అనుమవ్వత్త అచ్చిండ్రా! అల్లేమంటుండ్రు?” అడిగిండు మల్లయ్య.
“అచ్చిండ్రు మామా.. అందరు ఆగమౌతుండ్రు. ఎడ్లబండి గూడ తయారుచేసిండ్రు. గానీ, సిర్సిల్లకు పోదామంటే పెద్దాగు రావట్టే. ముత్తాబాద పోదుమంటే మనూరి శెరువు మత్తడి దుంకవట్టే. శెర్లకు అచ్చే కాలువగూడ బగ్గనే అత్తుంది. ఇంగా, కాట్లోని శెరువుకట్ట మీదికెల్లి పోతిగంటినుంచి ముత్తవాద పోదామంటే పోతిగంటి శెరువుగుడ మత్తడి దుంకుతుంది. ఒర్రె సుత బగ్గవారుతంది. నీయవ్వ! మన సర్పంచి కిషన్రావు దొర గా ఎమ్మెల్యెతో జెప్పి పెద్దాగుమీద వంతెన గట్టిత్తే.. సిర్సిల్లకు వోవత్తుండే. శెర్లకెల్లి రోడ్డేత్తే ముత్తవాద వోవత్తుండే. ఏం నాయకులో ఏందో.. నీయవ్వ! ఊరిసుట్టూ నీళ్లే.. ఇదో లంకయింది. గిట్లాంటి ఆపద వడితే సావు బతుకుల నడుమే సావవడితిమి..”
మాటల్లోనే బాల్రెడ్డి ఇంటికి జేరుకున్నరు.
“అరే మల్లిగా! డాక్టరు నరహరి పంతులూ! ఓ మంగలనుమవ్వ! ముగ్గురాలోచించండ్రి. తల్లీపిల్ల బతికేటట్లు జూడుండ్రి. ఎటూ వోరాకుంటుంది. ఈ గోస జూడలేక వోతన్న. ఇగ వోండ్రి..” అన్నడు అక్కడే ఉన్న సర్పంచి కిషన్రావు దొర.
“అనుమవ్వత్త.. తొవ్వసాపుందా? నొప్పులున్నయా? ఇబ్బంది ఎందుకైతంది?” అంటూ వివరాలు తెలుసుకున్నడు మల్లయ్య.
“అల్లుడా.. ఉమ్మునీరు బగ్గవోయింది. పొల్ల బక్క పలుసగుంది. బిడ్డ అడ్డం దిరిగింది. తొవ్వల కత్తలేదు. లేకపోతే ఒక్కలనన్న దావకాండ్లకు పోనిచ్చిన్నా?” అన్నది అనుమవ్వ దిగులుతో.
“పంతులయ్యా.. నొప్పులకు సూదియ్యిండ్రి. నేను పసరు మందిత్తా! నొప్పులు గట్టి గత్తయి. అనుమవ్వత్తా! తక్కుడు నువ్వులనూనె వాడి పిండాన్ని తొవ్వలకు దెచ్చుకో! గంతే.. దేవుని దయవల్ల మంచిగనే అయిద్ది. గోరెచ్చని నీళ్లు దాగియ్యి. బయపడకత్తా!” ఇగురం జెప్పిండు మల్లయ్య.
వాన కొద్దిగా తగ్గింది. ఆడ కొంతమంది, ఈడ కొంతమంది పోగై ముచ్చట్లు వెడుతుండ్రు.
ఈది లైట్లు అక్కడోటి ఇక్కడోటి ఉన్నయ్. ఒక్కసారి బగ్గ మెరిసింది. ఉరిమి పిడుగు వడ్డట్టయింది. అక్కడున్నోళ్లందరూ ఉలిక్కివడ్డరు. కరెంటుగూడ వోయింది. కందిలి, ఎక్కను ముట్టిచ్చిండ్రు. అంతల్నే కాన్పు అయింది. మగబిడ్డ పుట్టిండు.
‘తల్లీ బిడ్డ సేమంగ ఉన్నరు’ అని మంగలి అనుమవ్వ కేకేసి శెప్పింది. అందరూ ఊపిరి పీల్సుకున్నరు. గుడి ముందర కొబ్బరికాయ గొట్టిండ్రు.
“నరహరి అయ్యగారు, మంగలనుమవ్వ, బత్తుల మల్లయ్య.. మీకు సేతులెత్తి మొక్కుతున్నా. నా బిడ్డను, మనుమన్ని బతికిచ్చిండ్రు. బత్తుల మల్లయ్య నువ్వు దేవునివిరా!” అనుకుంట కండ్లల్ల నీళ్లు రాలంగ దండం బెట్టిండు బాల్రెడ్డి.
“అయ్యో పటేలా! బాంచెన్.. నన్ను గంత దండోన్ని చెయ్యకుండ్రి. ఏదో ఊరికి సేవ సేసే భాగ్యం దక్కింది పటేలా. మొదటి కాన్పు కదా! పొల్లపెయ్యి బగ్గ మెత్తవడుతది. పెద్దమందు బాలింతకాడ, సంటోనికి పాలు తాగడానికి మందుసెట్టు రేపు దీసుకత్త. బల్లున తెల్లారవట్టే ఇంటికాడ పన్లు సేసుకోవాలె. బర్ల జెంగిడి, ఆవుల జెంగిడి ఎదురైతే తొవ్వ దూగది. పటేలా.. పొయ్యత్తం” అంటూ గొంగడి కొప్పెర వెట్టుకొని బయల్దేరిండు మల్లయ్య.
సూడంగనే ఇరువై ఐదేండ్లు గడిసినయ్.
ఆ రోజు దసరా పండుగ. పొద్దుగాల్నే ఊళ్లె ఇచ్చేటోల్లకు మూలిక మందులిచ్చిండు. కొందరు పైసలు, ఇంకొందరు బువ్వకూర వెట్టిండ్రు. సార్గమ్మకాడ గడిల మైసమ్మకు బలిచ్చిన యాటల మాంసం కొంత పెడితే మూట వట్టుకున్నడు.
“బత్తుల మల్లిగా! బాగున్నావ్రా! ‘మానవ సేవే మాధవసేవ’ అంటే నువ్వేరా! ఇరువై ఏండ్ల పోరని లెక్క ఉన్నప్పటి సంది శెట్ల మందులతోని ఎందరికో రోగాలను నయం జేసినవ్. పైసలమీద ఆశ లేదు. సంపాదన మీద దురాశ లేదు. సాయమే నీ ధర్మం. ఇప్పుడు డెబ్బయారు ఏండ్లదాక ఉంటవు. శేతికర్ర తోడుంటే ఐసోనిలెక్క ఉశారుగా నడుస్తుంటవ్..” అన్నడు మంచాల రాయేశం శావుకారి.
“అయ్యా! షావుకారీ! మీ అందరి దీవెనలతోనే ఇంత జేత్తున్న..” అంటూ మల్లయ్య అడుగు ముందు కేసిండు.
అక్కడున్న పిల్లంతా, “రాం రాం తాతా! రాం రాం తాతా!” అని సంబురంగా ఎంట వడ్డరు.
ఆళ్లందరికీ “రాం.. రాం” శెప్పుకొంట ఎల్లాగౌడ్ ఇచ్చిన కల్లులొట్టి వట్టుకొని ఇంటిదారి వట్టిండు.
మొగులు మీదికి జూసి, ‘అరె! నెత్తిమీదికి పొద్దచ్చింది’ అనుకుంటనే నడక వేగం పెంచిండు.
కొందరు ఐసు పొలగాండ్లు బండ్లమీద బుర్రు బర్రుమని రువ్విడిగా పోతుండ్రు.
‘దసరా పండుగ గదా! తాగి సంబురంగ నడుపుతుండ్రు. శెప్తె ఇంటరా ఈ పోరగాండ్లు. గుర్రు గర్రు మంటరు. పడుసోల్లు పెడుసోల్లే గదా! ఏమన్నా ఇబ్బందే. ఏంజేద్దాం.. తొవ్వొంటా నా అసోంటి ముసలోళ్లకు టక్కరైతే ఉంటమా! పెద్ద పానాలు పుసుక్కున వోతయ్..’ అని ఆలోచనలు చుట్టు ముట్టినయ్.
తేరుకొని, ‘ముసల్ది ఎంత ఎదురు జూత్తందో..’ అనుకుంట రోడ్డు పక్కపొంటే నడుత్తండు.
అంతల్నే ఎన్కనుంచి ఎమునోలే అచ్చిన ఆటో మల్లయ్యను గుద్దుకొని చేతాడంతా దూరం లాక్కవోయింది.
మల్లయ్య రెండు కాళ్లిరిగి, బొక్కలు బైటికెళ్లినయ్. రోడ్డంతా నెత్తురు మడుగయ్యింది.
ఆటో పోరడు ఆ ఊరోడే. భయపడి బండి తింపుకొని ఏం దెల్వనట్టు ఊళ్లెకు వోయిండు.
అక్కడి పొలాలల్ల పని జేసుకొనేటోళ్లు సూసి ఉర్కొచ్చిండ్రు.
రోడ్డుమీద వడున్న మల్లయ్య సూడంగనే, “అయ్యో! బత్తుల మల్లయ్య! రాం రాం తాతా!” అని ఒర్రుడు వెట్రిండ్రు.
కొందరు మంచినీళ్లు తెచ్చి తాగించిండ్రు.
ఈ ముచ్చట కొద్దిసేపటికే ఊరంత వాకింది. అందరికీ ఆత్మ బంధువు లెక్కున్న మల్లయ్య ఎట్లున్నడోనని జనాలంత తండోప తండాలుగా వచ్చిండ్రు. మల్లయ్యను సూసి కన్నీల్లు రానోల్లు లేరు. కొనూపరితో కొట్టుమిట్టాడుతున్న మల్లయ్యను దావకాన్లకు తీస్కపోదమని తయారు జేత్తుండ్రు.
“నాయ్నా రాకేశ్! బత్తుల మల్లయ్యకు రాయిచెట్టు దగ్గర టక్కరైందట! గా మందుల డబ్బా పట్టుకొని రా. నీ కార్ల వోదం” అన్నడు లక్ష్మణ్రావు దొర
ఆత్రుతగా.
“ఏంటి నాన్నా! దసరా పండుగకు ఎంజాయ్ చేద్దామని ఊరికి వస్తే, మళ్లీ అదే డాక్టర్ పని చెయ్యమంటున్నవ్. అందరితో హాయిగా గడుపుదామంటే ఎవనికో యాక్సిడెంట్ అయిందని ఆగం జేస్తున్నవ్. ఏదో దావకాన్లకు వాళ్లే పోతరు తియ్..” అన్నడు రాకేశ్ విసుగ్గా.
ఆ మాటలు ఇనంగనే లక్ష్మణ్రావు దొరకు మస్తు కోపమచ్చింది.
“అరేయ్! అడ్డగాడిదా!” అంటూ ఆవేశంతో ఊగిపోయాడు. శెయ్యెత్తి కొడుకును కొట్టినంత పన్జేసిండు.
“కనికరం లేనోడ.. ఇమానం లేనోడ.. చీఛీ!” అంటూ బుస్సుబుస్సులాడిండు దొర.
‘ఈనెకు ఏమైంది’ అని ఇంట్లోల్లందరూ ఇశిత్రంగా చూస్తున్నరు.
“అరే పిచ్చోడా! శిన్నప్పుడు నీ కాలిరిగితే కట్టు కట్టింది ఆ మల్లిగాడేరా. దేవుడిలెక్క ఆడు చేసిన మేలును మరుత్తవారా? చీఛీ! బుద్ధిలేనోడా..” అని ఆవేశంగా అన్నడు దొర.
“అయ్యో.. సారీ నాన్నా! రాం రాం తాతనా? నాకర్తం కాలే. పా పోదాం” అనుకుంటనే కారు స్టార్ట్ చేశిండు.
రువ్వడిమీద పొయ్యి, టక్కరైన దగ్గరికి శేరిండు. అక్కడ గుమిగూడిన జనాన్ని తోసుకుంటూ వెళ్లి, మల్లయ్య శెయ్యి వట్టుకొని దాతు శూసిండు. నెత్తురు మస్తు వోయింది. అంతల్నే తోడుగా డాక్టర్ సుభాష్రెడ్డి గూడ అచ్చిండు.
“రాకేశ్! తాతకెట్లుంది?” అనడిగిండు సుభాష్రెడ్డి.
“క్రిటికల్ అనిపిస్తుంది.. నువ్వు జూడు” అన్నడు రాకేశ్.
దాతు వట్టుకొని చూసిన సుభాష్రెడ్డి, “ఓ.. రాం రాం తాతా! కండ్లు తెర్వు.. ఇంగో ఇద్దరం డాక్టర్లమున్నం. నిన్ను బతికించుకుంటం..” అన్నడు బాధతో.
మూలుక్కుంట కండ్లు దెరిసిండు మల్లయ్య తాత. అందర్నీ పుల్కు పుల్కున సూసుకుంట రొండు శేతులతోని దండం బెట్టిండు.
“నా ముసల్దేది.. నా ముసల్ది! నా కేమన్నయితే ముసల్దానికి దిక్కెవలు? నేనేం పాపం జేసినా?..” అనుకుంట కండ్ల నీళ్లు దెచ్చకున్నడు.
ఆ దెబ్బలు, రక్తం మడుగుల్ల మల్లయ్యను సూసినోళ్లంతా ఏడుపులు మొదలు వెట్టిండ్రు. అక్కడ కంటతడి పెట్టనోడు లేడు. అందరి గుండెలూ శెర్వులైనయ్.
“మల్లిగా! జెర ధైర్నం గుండు. మన ఊరోళ్లంతా నువ్వు బతకాలని దేవునికి మొక్కుతుండ్రు. జల్ది సిరిసిల్లకు తీసుక పోండ్రి బిడ్డా..” అంటూ కన్నీళ్లు పెట్టుకున్నడు లక్ష్మణ్రావు దొర.
మల్లయ్యను కార్లకు వట్టిండ్రు. ఓపక్క మల్లయ్య కొడుకు, మరోపక్క డాక్టర్ సుభాష్రెడ్డి ముసలోన్ని పట్టుకొని కూసున్నరు. రాకేశ్ కారు నడుపుతుండు.
“రాకేశ్! రాం రాం తాతనే నేను పుట్టినప్పుడు మా అమ్మను, నన్ను పానాలతో కాపాడిన దేవుడని మా తాత బాల్రెడ్డి ఎప్పుడూ శెప్పుతుండే! అప్పుడు మన ఊళ్లె డాక్టర్లు గూడ లేరట. రాం రాం తాత చేసిన మంచి పనులను కథలు కథలుగా చెప్తరు. ఎట్లాగైనా తాతను బతికించి, రుణం తీర్చుకోవాలె రాకేశ్! ఏమంటవ్?” అన్నడు సుభాష్రెడ్డి.
“దైవలీల.. మనం చేసే ప్రయత్నం చేద్దాం..” అన్నడు రాకేశ్.
కారు వెంకటాపూర్ దాటింది. ఒక్కసారిగా బాగా కండ్లు దెరిచి, “నా ముసల్ది” అనుకుంటనే గురుక్కుమన్నడు మల్లయ్య. సుభాష్రెడ్డి నాడి చూసి బోరుమని ఏడ్సిండు.
రాకేశ్గూడ కారు ఆపి, ఎన్కకు అచ్చిండు.
“మమ్మల్ని నీ రుణం తీర్చుకోనీయలేదు తాతా..” అనుకుంట ఇద్దరూ ఒకరిపై ఒకరు వడి కన్నీరు వెట్టుకున్నరు.మల్లయ్య అంత్యక్రియలను ఘనంగా జేసిండ్రు. తాత ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు.
తాత చివరి కోరిక, ముసలవ్వ కోసం శెరి 50 వేలు..
మొత్తం లచ్చ రూపాలు, ప్రతి నెలా వడ్డీ పైసలు అచ్చేటట్లు
ముసలామె పేరుమీద డిపాజిట్ చేసిండ్రు.
డాక్టర్ జనపాల శంకరయ్య: డాక్టర్ జనపాల శంకరయ్య స్వస్థలం, రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలం ఆవునూరు. ఏడో తరగతితోనే చదువు ఆపేశారు. కానీ, ఉన్నత విద్యాభ్యాసంపై మక్కువతో ప్రైవేటుగా ఎం.ఎ, ఎంఫిల్, పీహెచ్డీ, బీఈడీ, పీటీసీ చేశారు. 32 ఏండ్లపాటు ప్రభుత్వ తెలుగు ఉపాధ్యాయుడిగా సేవలందించారు. రాష్ట్ర స్థాయిలో ఉత్తమ ఉపాధ్యాయుడిగా అవార్డు అందుకున్నారు. సాహిత్యాభిలాషతో పద్య, వ్యాస, బుర్రకథ తదితర ప్రక్రియల్లో అనేక రచనలు చేశారు. 12 ఏండ్లపాటు సిరిసిల్ల సాహితీ సమితి ప్రధాన కార్యదర్శిగా పనిచేశారు. ప్రస్తుతం రాజన్న సిరిసిల్ల జిల్లా రచయితల సంఘం అధ్యక్షుడిగా ఉన్నారు. ‘ఆచార్య దేవోభవ’ శతకానికి పాలకొల్లు విశిష్ట పురస్కారం, చెలిమి సాంస్కృతిక సంస్థ పురస్కారం దక్కాయి.. వీరి ‘లంబాడీ గేయ సాహిత్యం’ పరిశోధనాగ్రంథానికి అంతర్రాష్ట్రీయ ఇందిరా గాంధీ అవార్డు వచ్చింది. పల్లె జీవితాలను ప్రపంచానికి పరిచయం చేయడమే లక్ష్యంగా కథా సాహిత్యంలోకి అడుగుపెట్టారు. తొలి కథ ‘మా ఊరి ధన్వంతరి రాంరాం తాతా’ కథ, నమస్తే తెలంగాణ – ముల్కనూరు ప్రజా గ్రంథాలయం నిర్వహించిన పోటీల్లో విశిష్ట పురస్కారానికి ఎంపికైంది.
-డాక్టర్ జనపాల శంకరయ్య, 8074727108