అమ్మకు అంకితం
తొలి వందనాలు అందుకున్న జగద్వేలుపు అమ్మ. తల్లిగురించి వివరించని వాఙ్మయం లేదు. అమ్మప్రేమను శ్లాఘించని కావ్యం లేదు. తరాలు మారినా, అంతరాలు పెరిగినా అమ్మప్రేమలో మార్పు లేదు. ఆ అమ్మ నిర్వహించే బాధ్యతల్లో తేడా రాలేదు. అయితే, అమ్మ చుట్టూ ఊహించని మార్పులు వచ్చాయి. ఒకప్పుడు నాన్న కస్సుమన్నా అమ్మకు మద్దతుగా పిన్నమ్మో, అత్తమ్మో వచ్చి నిలబడేది. కానీ, నవతరం అమ్మకు ఆ మద్దతు కరువైంది. న్యూక్లియర్ కుటుంబాల్లో అమ్మ వంటింటి పనులతో సతమతమవుతూనే, ఉద్యోగినిగానూ కష్టపడుతున్నది. నిత్యం పోరాడుతూనే ఉన్నది. ఇలాంటి తల్లులందరూ కలిసి ఏర్పాటు చేసుకున్న వేదికే
‘తెలుగు మామ్స్ నెట్వర్క్’. ఆన్లైన్ అమ్మల సంఘంగా పేరున్న తెలుగుమామ్స్ నెట్వర్క్ ఎన్నెన్నో కార్యక్రమాలు నిర్వహించింది. తాజాగా అమ్మతో వారికున్న అనుబంధాన్ని అందంగా ఆవిష్కరించే ప్రయత్నం చేశారు తెలుగు మామ్స్. ‘అమ్మంటే..’ అంటూ తమ తల్లులకు అక్షరార్చన నిర్వహించారు. కథలు, కవితలు, వ్యాసాల రూపంలో అమ్మ గొప్పదనాన్ని చాటి చెప్పారు. అమ్మ ప్రేమంత స్వచ్ఛమైన ఈ పుస్తకం చదువుతున్న ప్రతి క్షణం కళ్లు చెమ్మగిలుతాయి. అమ్మ జ్ఞాపకాలు మనసు పొరల్లో కదలాడుతాయి.
అమ్మంటే..
సంకలనం: ప్రదీప్తి విస్సంశెట్టి
పేజీలు: 232, వెల: రూ.150
ప్రతులకు: నవోదయ బుక్హౌజ్,
కాచిగూడ, హైదరాబాద్
http://books.acchamgatelugu.com/
రుబాయీల పరిమళం
ఉర్దూ సాహితీ తోటలో వికసించిన గజల్స్, షాయరీలు, రుబాయీలకు ప్రపంచమంతా ఫిదా అయింది. విషయం లౌకికమైందే అయినా, అందమైన పదాల అల్లికతో ముస్తాబై అలౌకిక ఆనందాన్ని కలుగజేయడం వీటి ప్రత్యేకత. అందుకే కాబోలు, అమీర్ ఖుస్రో మొదలు మీర్జా గాలిబ్ వరకు ఎందరో ఉర్దూ కవులు సాహితీ చక్రవర్తులుగా కీర్తి గడించారు. ఉర్దూభాషకే పరిమితమైన కొన్ని గజల్స్, రుబాయి ప్రక్రియలు ఇతర భాషల్లోనూ తొంగిచూసి మరింత మనోహరంగా భాసిల్లాయి. తెలుగు సౌందర్యానికి ఉర్దూ పరిమళాలు తోడైతే ఇంక చెప్పేదేముంటుంది! తెలుగు గజల్స్ జయదేవుడి అష్టపదులంత పసందుగా ఉంటాయి. అదే తెలుగు రుబాయీలైతే క్షేత్రయ్య పదాలంత గొప్పగా ఉంటాయి. చూడటానికి నాలుగు పంక్తుల కవితలా కనిపించినా, ఛందస్సు అడుగడుగునా కవి కాళ్లకు ముల్లులా గుచ్చుకుంటూనే ఉంటుంది. ముల్లులను మల్లెలుగా మార్చి, అంత్యప్రాసలను త్రాసులో తూచి, అచ్చుహల్లుల నిబంధనలను అందంగా సమకూరిన రుబాయీలనే ఇందులో చదువుతాం. ఈ అపురూప ప్రక్రియను ‘అశ్రుధార’తో అందంగా ఆవిష్కరించారు రచయిత పెన్నా శివరామకృష్ణ. అనల్ప భావనలను పదాల పటాటోపం లేకుండా పండించారు. 500 రుబాయీలను ఆస్వాదించడమే మన పని!
అశ్రుధార (రుబాయీలు)
రచన: పెన్నా శివరామకృష్ణ,
పేజీలు: 139 వెల: రూ.100
ప్రతులకు: నవ తెలంగాణ, నవచేతన,
నవోదయ బుక్హౌజ్.
వుహాన్ టు లాక్డౌన్
‘రోబో’ సినిమాలో కథానాయికను కుట్టిన దోమ రంగూస్కీని చిట్టి రోబో నిలదీసినప్పుడు జరిగిన దోమల సమావేశం సన్నివేశాన్ని హాస్యంగానే భావించాం. కానీ, ప్రయోగాల పేరిట మనిషి చేస్తున్న దుశ్చర్యలు, అభివృద్ధి కోసం మానవుడు ప్రారంభించిన విధ్వంసం నేటి కొవిడ్ విపత్తుకు మూలకారణం. ఈ విషయాన్ని ప్రతిపాదించి సూక్ష్మక్రిములన్నీ తీర్మానం చేయడంతో ‘కోవిద్-19’ పుస్తకం ప్రారంభమవుతుంది. ఈ తరహా రచన ఊహలా అనిపించినా వుహాన్లో మొదలైన కరోనాపీడ వెనుకున్న కథంతా ఇందులో వివరించారు రచయిత డాక్టర్ లంకా శివరామప్రసాద్. రకరకాల వైరస్ కారకాలు సమావేశం కావడం, మానవ తప్పిదాలను దెప్పి పొడవడం, వాటిని మనిషి ఎదుర్కొన్న తీరుతెన్నులను సున్నితంగా వాటితోనే చెప్పించారు రచయిత. చైనా దేశపు యుద్ధతంత్ర నిపుణుడు సన్ ట్జు రాసిన ‘ద ఆర్ట్ ఆఫ్ వార్’ ఆధారంగా 13 అధ్యాయాలతో దీనిని ఆవిష్కరించారు. శతాబ్దాలుగా నరలోకాన్ని పట్టి పీడిస్తున్న వైరస్ల పుట్టుపూర్వోత్తరాలనూ విశ్లేషించారు. ఆ విపత్తుల్లో మనిషి పాత్రనుకూడా సహేతుకంగా విమర్శించారు. కరోనా తీవ్రత, వుహాన్నుంచి లాక్డౌన్వరకు జరిగిన క్రమాన్ని కండ్ల ముందుంచారు. కరోనాపై సమగ్ర సమాచారాన్ని తెలుసుకోవచ్చు.
కోవిద్-19 (వుహాన్-జహాన్-లాక్డౌన్)
రచన: డాక్టర్ లంకా శివరామప్రసాద్
పేజీలు: 308, వెల: రూ.600
ప్రతులకు: 88978 49442
www.anuvaadham.com