తెలంగాణ.. వీరుల పురిటిగడ్డ. శత్రువులతో యుద్ధాలు చేస్తూ, దోపిడి ముఠాల నుంచి గ్రామాలను రక్షిస్తూ, ప్రమాదాల నుంచి ప్రజలను కాపాడుతూ.. ఎంతోమంది యోధులు వీరమరణం పొందారు. ఆ తెగువరుల జ్ఞాపకార్థం రాజులు, మండలేశ్వరులు, గ్రామాధికారులు ‘వీరగల్లులు’ వేయించారు. కొన్ని ప్రాంతాల్లోని ప్రజలువీరగల్లులను గ్రామదైవాలుగా,తమను కాపాడే అదృశ్య శక్తులుగా భావిస్తారు.భక్తితో పూజిస్తారు.ఏడాదికోసారి వారి పేర్లమీద ఘనంగా పండుగలూ
చేస్తుంటారు.
తెలంగాణలో గ్రామగ్రామానా వీరగల్లులు ఉన్నాయి. సాధారణంగా వీరగల్లులో ఓ వీరుడు గుర్రం మీద సవారీ చేస్తున్నట్టుగా, విల్లంబులు ధరించినట్టుగా, ఖడ్గంతో శత్రువులను వధిస్తున్నట్టుగా, కర్రలు ఎత్తి పట్టుకున్నట్టుగా, క్రూరమృగాలతో పోరాడుతున్నట్టుగా ప్రతిమలు ఉంటాయి. మరికొన్ని చోట్ల వీరుడి శిల్పం పక్కన స్త్రీ మూర్తుల ప్రతిమలూ ఉంటాయి. తెలంగాణ వ్యాప్తంగా ఇలా దాదాపు 50 రకాల వీరగల్లులు ఉన్నాయి. అయితే, ఖమ్మం జిల్లా తిరుమలాయపాలెం మండలం పిండిప్రోలు గ్రామంలోని వీరగల్లు మాత్రం వాటన్నిటిలోకి చాలా ప్రత్యేకమైంది.
కేశాలంకరణ
ఖమ్మం- వరంగల్ ప్రధాన రహదారిలో పిండిప్రోలు గ్రామం ఉంది. ఈ రహదారికి పక్కనే 10 అడుగుల దూరంలో దాదాపు 6 అడుగుల ఎత్తయిన వీరగల్లు కనిపిస్తుంది. ఒక వీరుడు తన ప్రాణాలకు తెగించి, చిరుత పులిని తన రెండు చేతులతో నిలువరిస్తున్నట్లుగా ఒక గ్రానైట్ శిలపై చెక్కారు. ఈ విగ్రహంలోని వీరుడి కేశాలంకరణ చాలా ప్రత్యేకంగా కనిపిస్తుంది. ఆడవారికి ఉన్నట్లుగా పొడవైన జడ యోధుడి వెనుకవైపున వేలా పడుతూ ఉంటుంది. పురుషులకు, ఇలాంటి కేశాలంకరణ సంస్కృతి ఈజిప్టు లోనే ఎక్కువ. మధ్యయుగకాలంలో.. శిఖ ముడివేసుకోవడం మినహాయించి, కేశాలను జడలా పెంచే సంస్కృతి మన దగ్గర ఉన్నట్లు ఇప్పటివరకు ఎలాంటి ఆధారాలూ లభ్యం కాలేదు. ఖమ్మం జిల్లాలోని వీరగల్లులపై పరిశోధించిన కట్టా శ్రీనివాస్, ఇలాంటి జడలున్న విగ్రహాలు కొన్నిటిని గుర్తించారు. అవి..
జంతువులతో పోరాడుతూ..
సింహబలురైన వీరులు పెద్దపులులతో పోరాడే దృశ్యాలున్న వీరగల్లులు తెలంగాణలో అత్యంత అరుదుగా లభించాయి. యాదాద్రి జిల్లా తుర్కపల్లిలో, నల్గొండ జిల్లా పజ్జూరులో, కరీంనగర్ జిల్లా నగునూరులో, సిద్దిపేట జిల్లా కోహెడలో మాత్రమే దర్శనమిచ్చాయి. ఖమ్మంకోట సమీపంలో పాముతో పోరాడుతున్నట్లున్న వీరుడి విగ్రహం, మహబూబ్నగర్ జిల్లాలోని భూత్పుర్లో అడవిపందిని వేటాడుతున్న వీరుని విగ్రహాలూ లభ్యమయ్యాయి. ఆ కాలంలో అడవి పందులూ, సర్పాల బెడద తీవ్రంగానే ఉన్నట్టు దీనివల్ల అర్థం అవుతున్నది. ఆ బాధ నుంచి విముక్తులను చేసిన యోధులు కథానాయకులై, ప్రజల హృదయాల్లో స్థానం సంపాదించారు.
వీర పూజలు..
అద్భుత సాహసాన్ని, పరాక్రమాన్ని ప్రదర్శించిన వీరులు తమ మరణానంతరం భైరవ, వీరభద్ర రూపాల్లో గ్రామాలను రక్షిస్తారని పల్లె ప్రజల అపార నమ్మకం. అందుకే, వీరుల విగ్రహాలకు ఆలయాలను నిర్మించారు. ప్రత్యేక పూజలు చేయడంతోపాటు పండుగలప్పుడు జంతుబలులు ఇచ్చే ఆచారమూ అనేక గ్రామాల్లో కనిపిస్తుంది. అదే విధంగా పులితో పోరాడుతున్న పిండిప్రోలు వీరగల్లును స్థానికులు ‘శ్రీ గోపయ్య సమేత లక్ష్మీ తిరుపతమ్మ తల్లి’ పేరుతో పూజిస్తున్నారు. ఇక్కడ చిన్న ఆలయాన్నీ నిర్మించారు. స్థానికులే కాకుండా తిరుమలాయపాలెం మండలంలోని పలు గ్రామాల ప్రజలు ఇక్కడ కొలుపులు చేస్తుంటారు. కోరిన కోర్కెలు తీరితే భక్తితో మొక్కులు చెల్లించుకుంటారు. ఇలా, త్యాగధనులకు దైవత్వాన్ని ఆపాదించారు మనవాళ్లు.
-అరవింద్ ఆర్య ,7997 270 270