అనుభవాల బుట్ట
అత్యవసరానికి సాయమందించిన వ్యక్తికి ‘ఆజన్మాంతం రుణపడి ఉంటాం’ అంటారు. అంటే, ఆ వ్యక్తికి తిరిగి సాయం చేసి రుణం తీర్చుకోవడం కాదు. ఆ సాయాన్ని గుర్తుంచుకోవడం. దానిని ఓ అపురూప అనుభవంగా దాచుకోవడం. ఓన్లీ సాయాలేనా.. ఎన్నో సాయంకాలాలనూ ఇలా అనుభవాల బుట్టలో అందంగా దాచుకోవచ్చు. కావాల్సిందల్లా మన చుట్టూ జరుగుతున్న సంఘటనలను గుర్తించే మనసు, ఆపై స్పందించే గుణమూ ఉండాలి. అప్పుడు ప్రతి అనుభవమూ ఆజన్మం గుర్తుండిపోయే చిత్రంగానో, కవితగానో, కథగానో నిలిచిపోతుంది. రద్దీ బస్సులో వేళ్ల మధ్యలో కరెన్సీలు తురుముకునే కండక్టర్ విలక్షణత, స్టెత్ మర్చిపోయి రోగి గుండె పరీక్షించిన ఆర్ఎంపీ డాక్టర్ మతిమరుపు, ప్రతిరోజూ సహనాన్ని పరీక్షించే పేపర్ బాయ్ రాక.. ఇలా ప్రతి మనిషికీ కొన్ని అనుభవాలు ఉంటాయి. వాటిని ఊహించుకున్నప్పుడల్లా పెదవిపై చిరునవ్వు, మనసులో ఏదో ఒక భావన కలుగుతాయి. వీటిలో కొన్ని ఆజన్మాంతం మనతో ట్రావెల్ చేస్తాయి. అలాంటి అనుభవాలను కన్నవి కన్నట్టుగా, ఉన్నవి ఉన్నట్టుగా ‘ఆజన్మం’ ఆత్మకథాత్మక వచనంలో ఆవిష్కరించారు రచయిత పూడూరి రాజిరెడ్డి.
ఆజన్మం (ఆత్మకథాత్మక వచనం)
రచన: పూడూరి రాజిరెడ్డి
పేజీలు: 301, వెల: రూ.280
ప్రతులకు: అనల్ప బుక్ కంపెనీ – 70938 00303
కృష్ణాకాంత్ ప్రచురణలు: 97055 53567
మదిలో మెదిలిన భావాలు
కథలు రకరకాలు. అనుభవంలో నుంచి పుట్టుకొచ్చేవి కొన్ని. ఊహల్లో నుంచి ఊడిపడేవి ఇంకొన్ని. కథా వస్తువు ఏదైనా కథనం కుదిరినప్పుడే కథ పండుతుంది. ఇలాంటి అమూల్యమైన కథల సమాహారం ‘మనసు చెప్పిన కథలు’ సంకలనం. సాహితీమూర్తులందరూ కలిసి సాగించిన అక్షర సేద్యమిది. 51 మంది రచయితలు తమ మదిలో మెదిలిన భావాలను, ఎదురైన అనుభవాలను అందంగా పొందుపరిచారు. ఈ సంకలనంలో మంచి కథలు ఉన్నాయి. గొప్ప కథలు ఉన్నాయి. సీనియర్ రచయితలతోపాటు వర్ధమాన రచయిత్రుల, రచయితలు రాసిన కథలూ ఉన్నాయి. ప్రతి కథా ఆణిముత్యమే! ప్రేమకు చిరునామాగా నిలిచేవి కొన్నయితే, తరాల మధ్య అంతరాలను కండ్లకు కట్టినవి ఇంకొన్ని. రకరకాల కథలు పాఠకుడి మనసును దోచేస్తాయి. ఆ క్షణంలో కాలక్షేపం చేసినా కలకాలం గుర్తుండిపోతాయి.
మనసు చెప్పిన కథలు
సంకలనం: డా॥పాతూరి అన్నపూర్ణ,
వడలి రాధాకృష్ణ
పేజీలు: 343 వెల: రూ.300
ప్రతులకు: 94902 30939
బుక్ షెల్ఫ్
ఏది కవిత?
ఏది కవిత? ఈ ప్రశ్నకు సమాధానం కాకలు తీరిన కవిపండితులు సైతం చెప్పలేరు. కవిత గొప్పదనం ఎంచుకున్న వస్తువులో ఉంటుందా? ప్రయోగించిన పదాల్లో ఉంటుందా? ఉపయోగించిన అలంకారాల్లో ఉంటుందా? ఆశావాదాన్ని కలిగించేది, మనిషిలోని మానవీయ కోణాన్ని స్పృశించేది, సమాజహితాన్ని కోరేది, రాజకీయ అనైతికతను ప్రశ్నించేది, ప్రగతిశీల భావాన్ని ప్రజ్వలింపజేసేది నిజమైన కవిత. కవిత్వానికి అవసరమైన కళాత్మక విలువలను స్వేచ్ఛా కవిత్వంతో ఆవిష్కరించిన సంపుటి ‘స్వేచ్ఛా కవిత్వం ఏది కవిత?’.
రచన: మాదిరాజు రంగారావు
పేజీలు: 372, వెల: రూ.90
ప్రచురణ: రసధుని సాహితీ పరిషత్తు
ప్రతులకు: నవోదయ బుక్హౌస్, కాచిగూడ, హైదరాబాద్
నవచేతన బుక్హౌస్, హైదరాబాద్
అచ్చు (కవిత్వం)
తన జీవిత అనుభవాలు, చూసిన సంఘటనల ఆధారంగా రచయిత డా॥ సిద్దెంకి యాదగిరి రాసిన కవితల సమాహారం ‘అచ్చు’. ఈ కవితల్లో ఎన్నో ప్రశ్నలకు సమాధానాలు దొరుకుతాయి. మరెన్నో ప్రశ్నలు సంధించిన కవితలూ కనిపిస్తాయి. భావుకత కన్నా వాస్తవికతకు పెద్దపీట వేసిన కవితా సంకలనం ‘అచ్చు’.
రచన: డా॥ సిద్దెంకి యాదగిరి
పేజీలు: 112, వెల: రూ.100
ప్రతులకు: అన్ని ప్రముఖ పుస్తక కేంద్రాలు
81211 44773, 94416 79937
సాయి దీవెన (మొగ్గలు)
బాబా కృపకు పాత్రులైతే చాలు జీవితంలో వెతలు ఉండవనేది సాయి భక్తుల నమ్మకం. సాయి మార్గాన్ని ప్రస్తావిస్తూ ఎన్నో రచనలు వచ్చాయి. అలతి అలతి పదాలతో సాగిపోయే అందమైన సాహితీ ప్రక్రియగా పేరున్న మొగ్గలు రూపంలో బాబా చూపిన మార్గాన్ని ‘సాయి దీవెన’లో అవిష్కరించిన పుస్తకం ఇది.
రచన: కె.రాధికారాణి
పేజీలు: 40, వెల: రూ.30
ప్రతులకు: రచయిత్రి, 99598 53496