పాతరోజులతో పోలిస్తే మద్యపానం అలవాటు పెరిగింది. ఆధునిక జీవితంలోని ఒత్తిడిని తట్టుకునేందుకో, స్నేహితులతో కలిసి వారాంతాలు గడిపేందుకో… మద్యం ఓ మార్గమైపోయింది. మధుపానాసక్తులలో మహిళల శాతమూ పెరిగిపోయింది. అయితే పిల్లలు కనాలనుకునే మహిళలు మద్యానికి వీలైనంత దూరంగా ఉండాలని హెచ్చరిస్తున్నారు శాస్త్రవేత్తలు. ఈ విషయాన్ని వెల్లడించే ముందు… అమెరికాకు చెందిన పరిశోధకులు 400 మందికి పైగా అభ్యర్థులను ఎంచుకున్నారు. దాదాపు 18 నెలలపాటు వీరిని తమ దినచర్య నమోదు చేయమని సూచించారు. ఊహించినట్టుగానే మద్యం తాగుతున్న వారిలో అండం ఫలదీకరణ చెందడంలో సమస్యలను గుర్తించారు. ముఖ్యంగా రుతుక్రమం రెండో దశలో అంటే… నెలసరి అయిన రోజు నుంచి రెండో పక్షంలో మద్యం సేవించినవారిలో ఈ దుష్ప్రభావం మరింత తీవ్రంగా ఉందని తేలింది. వీరిలో, సంతానం కలిగే అవకాశం 44 శాతం తక్కువగా కనిపించింది. ఈ సమయంలో కొద్దిపాటి మద్యం కూడా వీరి సంతానసాఫల్యం మీద ప్రభావం చూపడం గమనార్హం.