‘కళ జీవితాన్ని శాశ్వతం చేస్తుంది’ అని గురువు చెప్పిన మాట ఓ మామూలు విద్యార్థిని ‘సైకత శిల్పి’గా మలిచింది. తనలో ఏదో సాధించాలనే తపనను రగిలించింది.అద్భుత కళాకృతులను తయారు చేయిస్తున్నది. అదే తన ప్రతిభను విశ్వవ్యాప్తం చేస్తున్నది.
మహబూబాబాద్ జిల్లా కురవికి చెందిన నీలం శ్రీనివాసులు వినూత్న సైకత శిల్పిగా పేరు తెచ్చుకున్నాడు. ఇసుకతో వివిధ రకాల కళాకృతులను తీర్చిదిద్దుతూ, తన ప్రతిభ తరాలపాటు నిలిచిపోయేలా చేస్తున్నాడు. వృత్తిరీత్యా సిరిసిల్ల జిల్లా అగ్రహారం డిగ్రీ కళాశాలలో అధ్యాపకుడిగా పనిచేస్తున్నా, తనకిష్టమైన కళారంగాన్ని మాత్రం వదులుకోలేదు. నైపుణ్యానికి ఎప్పటికప్పుడు తుదిమెరుగులు దిద్దుకుంటూ, అందరిలో ప్రత్యేకంగా నిలుస్తున్నాడు.
ప్రత్యేక శిల్పాలు
సైకత శిల్పాలంటే సముద్రపు ఒడ్డున ఇసుకతో చేసే కళాకృతులు. కానీ, అవి కొద్ది రోజుల్లోనే నీటిలో కలిసి కనుమరుగైపోతాయి. అందుకు భిన్నంగా శాశ్వత సైకత శిల్పాలను తయారుచేస్తున్నాడు శ్రీనివాసులు. ‘యుద్ధం వద్దు… శాంతి ముద్దు..’ అంటూ భారీ శాశ్వత సైకత కళాఖండాన్ని సృష్టించాడు. ఎనిమిది అడుగుల ఎత్తులో, 20 అడుగుల పొడవున రూపొందించిన ఈ శిల్పం, అందరి మన్ననలూ అందుకున్నది.దీన్ని సృష్టించడానికి 100 కిలోల ఇసుక, 15 కిలోల జిగురు, ైప్లెవుడ్ షీట్స్, 115 కిలోల స్టీల్, 50 కిలోల టేకు ఉపయోగించాడు. ఏడుగురు హైస్కూల్ విద్యార్థుల సాయంతో 16 రోజుల్లోనే ఈ భారీ కళాఖండాన్ని తయారుచేశాడు. ప్రపంచ శాంతికోసం పోరాడిన అనేకమంది మహానుభావుల చిత్రాలను పొందుపరిచి, అందరినీ అబ్బుర పరిచాడు.
ఉద్యమనేతకు వీరాభిమాని
తెలంగాణ సాధనకోసం తన ప్రాణాలనే పణంగా పెట్టిన ఉద్యమనాయకుడు సీఎం కేసీఆర్కు శ్రీనివాసులు వీరాభిమాని. కేసీఆర్ చిత్ర రూపాన్ని సైకత శిల్పంగా మార్చి తన ప్రేమను చాటాడు.
‘సన్ ఆఫ్ తెలంగాణ
(తెలంగాణ సూర్యుడు)’ పేరుతో కేసీఆర్ బొమ్మను అందంగా తీర్చిదిద్దాడు. దాన్ని డోర్నకల్ ఎమ్మెల్యే డీఎస్ రెడ్యానాయక్కు బహూకరించాడు. సీఎం కేసీఆర్ 65వ పుట్టినరోజును పురస్కరించుకొని మరో అద్భుత కళాఖండానికి ప్రాణంపోశాడు. ఆకుపచ్చని తెలంగాణ బ్యాక్డ్రాప్లో సీఎం ప్రవేశ పెట్టిన పథకాలను పొందు పరిచాడు. ‘ద ట్రూ ఇండియన్స్’ అనే సైకత శిల్పఖండంలో మేరికోమ్ రూపాన్ని గుదిగుచ్చాడు. తాజ్మహల్ వంటి నిర్మాణాలనూ
మలిచాడు.
ఎన్నో అవార్డులు
శ్రీనివాసులు రూపొందించిన పలు కళాఖండాలు ఆయనకు అనేక అవార్డులను తెచ్చిపెట్టాయి. ‘ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్’, ‘లిమ్కా బుక్’లోనూ శ్రీనివాసులుకు చోటు దక్కింది. వరల్డ్ రికార్డ్స్ ఆఫ్ ఇండియా, తెలుగు బుక్లోనూ స్థానం సంపాదించుకున్నాడు. లండన్లోని వరల్డ్ రికార్డ్స్ యూనివర్సిటీ నుంచి గౌరవ డాక్టరేట్ కూడా అందుకున్నాడు.
గిన్నిస్ .. నా లక్ష్యం
సైకత శిల్పాల జీవితకాలం కొన్ని రోజులు మాత్రమే. అందుకే, వీటికి శాశ్వతతం అందించాలనే ఉద్దేశంతోనే, సరికొత్త సైకత శిల్పాలకు ప్రాణం పోస్తున్నా. ఈ కళను ప్రపంచవ్యాప్తం చేయడం, గిన్నిస్ బుక్లో పేరు సంపాదించడమే నా లక్ష్యం. త్వరలోనే మహబూబాబాద్, వరంగల్, ఖమ్మం, కరీంనగర్, హైదరాబాద్లలో నా కళను ప్రదర్శిస్తా. తద్వారా వచ్చే లాభాలను నిరుపేద విద్యార్థులకు సాయంగా అందిస్తా.
-నీలం శ్రీనివాసులు,సైకత శిల్పి
-నాగరాజు